2019లో కన్నా 2024లో బిజెపికి ఎక్కువ సీట్లు

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధిస్తుందని పేర్కొంటూ 2019 లోక్‌సభ ఎన్నికల్లో వచ్చినదానికన్నా ఎక్కువ సీట్లు దక్కించుకుంటుందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భరోసా వ్యక్తం చేశారు.  నెట్‌వర్క్ 18 గ్రూప్ ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ జోషికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోఉత్తర ప్రదేశ్ లో మొత్తం 80 సీట్లను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

ప్రతి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలు మంచి పనితీరు కనబరుస్తున్నాయని, అభివృద్ధి వేగం బుల్లెట్ రైలుతో సమానంగా ఉందని పేర్కొంటూ,  తాము ఉత్తరప్రదేశ్ నుండి మెరుగైన ఫలితాలను పార్టీకి అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాల విభజన రాజకీయాలను రాష్ట్రం మరోసారి తిరస్కరిస్తుందని యోగి చెప్పారు.

రాష్ట్రంలోని మొత్తం 80 లోక్‌సభ స్థానాలను గెలుచుకోవాలనే వ్యూహంలో భాగంగా యాదవులు, జాతవులు, పస్మాండ ముస్లింలలో తన పునాదిని విస్తరించుకోవాలని బీజేపీ ప్రణాళికలు రూపొందించింది.  2019 లోక్‌సభ ఎన్నికలలో, ఉత్తరప్రదేశ్‌లో బిజెపి  పోటీ చేసిన 78 లోక్‌సభ స్థానాలకు 62 గెలుచుకుంది, భారతదేశంలో రాజకీయంగా ముఖ్యమైన ఈ రాష్ట్రంలో కాంగ్రెస్   కేవలం ఒక స్థానాన్ని గెల్చుకుంది.

ముస్లింలపై భగవత్ వ్యాఖ్యలు సమర్థిస్తున్నా

భారతీయ ముస్లింలపై ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్  డా. మోహన్ భగవత్ ఇటీవల చేసిన ప్రకటనలతో ఏకీభవిస్తున్నట్లు ఆదిత్యనాథ్ తెలిపారు. భారతదేశంలో ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదని, అయితే వారు తమ ఆధిపత్యపు బూటకపు వాక్చాతుర్యాన్ని విడిచిపెట్టాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ ఇటీవల చేసిన ప్రకటనపై అడిగినప్పుడు ఆ ప్రకటనతో ఏకీభవిస్తున్నట్లు చెప్పారు.
 
కేవలం పాలన ద్వారా మాత్రమే కమ్యూనిటీలను చేరుకోగలవని, సంక్షేమ పథకాలను ప్లాన్ చేసేటప్పుడు తమ ప్రభుత్వం లబ్ధిదారుల వర్గాలను “ఎంచుకోవడం, ఎన్నుకోవడం” అనే పద్దతిని అవలంభించదని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు, మెరుగైన పాలన అన్ని వర్గాలకు సహాయపడిందని ఆయన పేర్కొన్నారు.
 
అన్ని మతాల పండుగలను శాంతియుతంగా నిర్వహించబడుతున్నాయని గుర్తు చేశారు. హిందూ బాలికలు సురక్షితంగా ఉంటే, ముస్లిం బాలికలు కూడా సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ పథకాలన్నీ ముస్లింలతో సహా ప్రతి వ్యక్తికి ప్రయోజనం చేకూరుస్తాయని పేరొంటు తాము ఎలాంటి బుజ్జగింపు రాజకీయాలు చేయమని తేల్చి చెప్పారు.
 
గడువులోగా రామ మందిరం

నిర్ణీత గడువులోగా అయోధ్యలో రామమందిరం పనులు పూర్తవుతాయని సీఎం యోగి ఆశాభావం వ్యక్తం చేశారు. రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు.

కాగా, ఇటీవల ‘రామచరిత మానస్‌’పై సమాజ్ వాదీ పార్టీ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందిస్తూ అభివృద్ధిని కాకుండా విభజనను నమ్ముకునేవారు ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారని ఆదిత్యనాథ్ ధ్వజమెత్తారు. రామచరిత మానస్‌ పై వివాదాలు రాష్ట్ర అభివృద్ధిపై ప్రజల దృష్టిని మరల్చేందుకు చేస్తున్న ప్రయత్నమని ఆయన ఆరోపించారు.

 రామచరితమానస్ అత్యంత గౌరవనీయమైన గ్రంథం అని,  ప్రతి ఇంట్లోనూ పూజిస్తారని తెలిపారు. దీని ప్రాముఖ్యత తెలియని వారు ప్రశ్నలను లేవనెత్తుతున్నారని ఎద్దేవా చేశారు.

కాగా, “తులసీదాస్ రచించిన ఈ రామయణంలోని కొన్ని భాగాలు కులం ప్రాతిపదికన సమాజంలోని విస్తృత వర్గాలను అవమానించేలా ఉన్నాయని, వాటిని తొలగించాలని” యూపీలో ప్రముఖ ఓబీసీ నేతగా ఉన్న స్వామి ప్రసాద్ మౌర్య పేర్కొన్నారు. అయితే,  మౌర్య వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని సమాజ్ వాదీ పార్టీ వివరణ ఇచ్చుకుంది.

ఈ అంశంపైనే తాజా ఇంటర్వ్యూలో మాట్లాడిన సీఎం యోగి సమాజ ఐక్యతకు మార్గదర్శకంగా నిర్వచించిన హిందూ పవిత్ర గ్రంథాన్ని విమర్శించే వారిపై చర్యలు ప్రారంభించామని చెప్పారు. తాను యోగిని అని, యోగిగా తన జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నానని పేర్కొంటూ అయితే ప్రజలు తనను వారు కోరుకున్న విధంగా గ్రహించగలరని ఆదిత్యనాథ్ హెచ్చరించారు.

సుపరిపాలన ద్వారా అన్ని కమ్యూనిటీలను చేరుకోవచ్చని సీఎం యోగి చెబుతూ రాష్ట్రంలో శాంతిభద్రతల మెరుగైన నిర్వహణ అన్ని కమ్యూనిటీలకు సహకరిస్తున్నదని  తెలిపారు.

ఇటీవల విడుదలైన షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్‌లోని ‘బేషరమ్ రంగ్’ పాట వివాదం సందర్భంగా పఠాన్ మూవీ సహా పలు సినిమాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న బహిష్కరణ రాజకీయాలపై మాట్లాడుతూ కళాకారులు, పండితులందరినీ గౌరవించాలని, అయితే అదే సమయంలో ప్రజల మనోభావాలను దెబ్బతీసే సన్నివేశాలను చిత్ర నిర్మాతలు పెట్టకూడదని యూపీ ఆదిత్యనాథ్ హెచ్చరించారు.

ప్రభావం చూపని భారత్ జోడో యాత్ర

ఇక, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర ఎలాంటి ప్రభావం చూపలేదని ఆదిత్యనాథ్ తేల్చివేసారు. దేశానికి విభజన రాజకీయాలను ఇచ్చిందని కాంగ్రెస్ అంటూ ఆ పార్టీ 1947 నుండి భారతదేశాన్ని విభజిస్తోందని విమర్శించారు. రాహుల్ గాంధీ తన ప్రతికూల వైఖరిని విడిచిపెట్టినట్లయితే, కాంగ్రెస్ లాభపడి ఉండేదని హితవు చెప్పారు.

మరోవైపు,గత నెలలో సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌కు పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించిన తర్వాత చెలరేగిన వివాదంపై ఆదిత్యనాథ్ మాట్లాడుతూ సమాజ్‌వాదీ పార్టీ డిక్షనరీలో కృతజ్ఞత లేదని విచారం వ్యక్తం చేశారు.  జోషిమఠ్ లో ఇళ్లు,రోడ్ల పగుళ్ల గురించి యాట్లాడిన సీఎం యోగి..అభివృద్ధి శాస్త్రీయంగా, ప్రణాళికాబద్ధంగా లేకపోతే, అది పర్యావరణాన్ని ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. ప్రకృతితో జోక్యం చేసుకోవడం వల్ల నివారించలేని విపత్తులు వస్తాయని తెలిపారు.