వీవీప్యాట్లపై పిటిషన్లను కొట్టేసిన సుప్రీం కోర్టు

* వ్యవస్థను గుడ్డిగా వ్యతిరేకించవద్దని హితవు

ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌లో ఎటువంటి మార్పు ఉండ‌బోదు అని సుప్రీంకోర్టు శుక్రవారం త‌న తీర్పులో స్ప‌ష్టం చేసింది. లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ‌ ఈవీఎంల‌లో ఓట్ల‌తో పాటు వీవీప్యాట్ల స్లిప్‌లను కూడా లెక్కించాల‌ని సుప్రీంకోర్టులో ప‌లు పిటీష‌న్లు దాఖ‌లు అయ్యాయి. ఆ పిటీష‌న్ల‌ను విచారించిన అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆ అభ్య‌ర్థ‌ల‌ను తోసిపుచ్చింది. 
 
ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో పోలైన ఓట్ల‌తో వీవీప్యాట్ల స్లిప్‌ల‌ను వంద శాతం స‌రిచూసుకోవాల‌ని చేసిన డిమాండ్‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. ఈవీఎంలు, వీవీప్యాట్ల‌తో వంద శాతం క్రాస్ వెరిఫికేష‌న్ కుద‌ర‌ద‌ని కోర్టు చెప్పింది. ఈవీఎంల స్థానంలో మ‌ళ్లీ పేప‌ర్ బ్యాలెట్ల‌ను వాడాల‌న్న అభ్య‌ర్థ‌న‌ను కూడా జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా, దీపాంక‌ర్ ద‌త్త‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం తోసిపుచ్చింది. వీవీప్యాట్ల ఫిజిక‌ల్ డిపాజిట్ కూడా కుద‌ర‌దు అని కోర్టు త‌న ఆదేశాల్లో స్ప‌ష్టం చేసింది.

ప్రస్తుతం ఈవీఎంలు – వీవీప్యాట్స్లిప్‌లుకు సంబంధించి ప్రతి అసెంబ్లీ, లోక్​సభ నియోజకవర్గాల్లో 5 ఈవీఎంలను మాత్రమే సరిపోల్చి చూస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఇదే కొనసాగనుంది.

“ఈవీఎం- వీవీప్యాట్​ కేసు విషయంలో వ్యవస్థను గుడ్డిగా అనుమానించడం సరైన విషయం కాదు. అర్థవంతమైన విమర్శలు చేయడంలో తప్పు లేదు. అది న్యాయవ్యవస్థపైనైనా లేక శాసన వ్యవస్థపైనైనా సరే! ప్రజాస్వామ్యం అంటే సామరస్యాన్ని మెయిన్​టైన్​ చేసుకోవడమే. అది నమ్మకం, సహకారం వల్లే జరుగుతుంది. అలా చేస్తేనే ప్రజాస్వామ్యాన్ని బలపరచవచ్చు,” అని జస్టిస్​ దత్త తన తీర్పులో వెలువరించారు. 

అన్ని అధారాలను చూసిన తర్వాతే తమ తీర్పును చెబుతున్నట్టు స్పష్టం చేశారు. అదే సమయంలో ఎన్నికల కమిషనర్​కి రెండు ఆదేశాలను జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈవీఎంలో చిహ్నాలను పెట్టినప్పుడు, సింబల్​ లోడింగ్​ యూనిట్​ని సీల్​ చేసి, భద్రంగా కంటైనర్స్​లో పెట్టాలని చెప్పింది. సీల్​ మీద అభ్యర్థులు సంతకాలు చేయాలని స్పష్టం చేసింది. 

ఎన్నికల ఫలితాలు వెలువడిన సమయం నుంచి కనీసం 45 రోజుల పాటు ఈ సీల్​ చేసిన ఎస్ఎల్​యూలను ఈవీఎంలతో స్టోర్​రూమ్​లో పెట్టాలని వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియ ముగిసన తర్వాత ప్రతి అసెంబ్లీ లేదా పార్లమెంట్ ​ నియోజకవర్గంలోని కనీసం 5 శాతం కంట్రోల్​ యూనిట్​లు, బాలెట్​ యూనిట్​లు, వీవీప్యాట్​లను ఈవీఎం తయారీ సంస్థలకు చెందిన ఇంజినీర్లు చెక్​ చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. 

ఇది ఇద్దరు ముగ్గురు అభ్యర్థుల అభ్యర్థనతో జరుగుతుందని, ఫలితాలు వెలువడిన 7 రోజులలోపు.. రిక్వెస్ట్​ చేసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇలా అభ్యర్థన చేసుకున్న వారే ఖర్చులు భరించాలని, ఒకవేళ ఈవీఎంలు టాంపరింగ్​కు గురైనట్టు తేలితే ఖర్చులు వెనక్కి తిరిగిచ్చేయాలని తెలిపింది. ఈవీఎంలు- వీవీప్యాట్ల వ్యవహారంపై గత కొంతకాలంగా విచారణ జరుపుతోంది సుప్రీంకోర్టు.  తాము ఎన్నికల సంఘాల కార్యకలాపాలను నిర్దేశించలేమని, కేవలం అనుమానాలు ఉన్నాయని రూల్స్​ని మార్చలేమని సుప్రీంకోర్టు కొన్ని రోజుల ముందు అభిప్రాయపడింది.

ఈవీఎంలలో కంట్రోల్​ యూనిట్​, బాలటింగ్​ యూనిట్​లు ఉంటాయి. వీటిని కేబుల్​ సాయంతో కనెక్ట్​ చేస్తారు. ఇవి వీవీప్యాట్​లకు కూడా కనెక్ట్​ అయ్యుంటాయి. ఈ వీవీప్యాట్​ అంటే ఓటర్​ వెరిఫైడ్​ పేపర్​ ఆడిట్​ ట్రైల్​. ఈవీఎంలో బటన్​ ప్రెస్​ చేసిన తర్వాత ఓటు పడిందా? లేదా? అనేది ఓటరుకు తెలియజేసే యంత్రం వీవీప్యాట్​. ఏ పార్టీ అభ్యర్థికి ఓటు వాశామో కూడా కనిపిస్తుంది.