డీజీపీ కార్యాలయం ముట్టడిలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షునికి తీవ్ర గాయాలు

ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ బీజేవైఎం నాయకులు చేపట్టిన ‘ఛలో డీజీపీ’ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తకు దారితీసింది.
ఏకంగా డీజీపీ ఆఫీస్ లోపలికే నేతలు చొచ్చుకెళ్లారు. ఒకేసారి కార్యాలయంలోకి రావడంతో డీజీపీ ఆఫీస్ పోలీస్ భద్రత సిబ్బంది చేతులెత్తేసింది. డీజీపీ ఆఫీస్ లోకి వెళ్లేందుకు యత్నించిన బీజేవైఎం నాయకులను ఈడ్చి వేశారు. లాఠీ ఛార్జ్ చేశారు. 
 
ఈ సందర్భంగా పోలీసులకు, బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాటలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాశ్ స్ప్రుహ తప్పి పడిపోయారు. అయినా పోలీసులు విచక్షణారాహితంగా లాఠీలు ఝుళిపించారని మోర్చా నేతలు విమర్శించారు. ఈడ్చుకెళ్లి వ్యాన్ లో పడేశారు.
 
ఈ సంఘటనలో భాను ప్రకాశ్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బీజేవైఎం నాయకులు గ్లోబెల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వెంటనే వైద్యులు ఎమర్జెన్సీ వార్డుకు భాను ప్రకాశ్ తరలించిన వైద్య చికిత్స చేయిస్తున్నారు. ఈ ఘటనలో భాను ప్రకాశ్ తోపాటు అరుణ్ కుమార్, పుల్లెల శివ సహా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
 
హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు మార్కులు కలిపి న్యాయం చేయాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ముట్టడికి వచ్చిన కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నిరసనకారులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. పోలీసులు పలువురు బీజేవైఎం నేతలను పోలీసులు తీసుకుని స్టేషన్ కు తరలించారు. 
 
 ఎస్సై కానిస్టేబుల్ రిక్రూట్మెంట్‌లో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని బీజేవైఎం డిమాండ్ చేస్తోంది. ఎస్సై పరీక్షలో తొమ్మిది మార్కులు, కానిస్టేబుల్ పరీక్షలో ఏడు మార్కులను కలపాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు రెండు లక్షల మంది వరకు ఈవెంట్స్‌కు ఎలిజిబుల్ అవుతారని బీజేవైఎం పేర్కొంది.
 
ఆ మార్కులు కలిపితే మరోసారి ఈవెంట్స్ నిర్వహించాల్సి ఉంటుందని తెలిపింది. లాంగ్ జంప్ నాలుగు మీటర్ల నుండి 3.8 మీటర్లకు తగ్గించాలని, 1500 మీటర్లు ఉన్న పరుగు పందాన్ని 800 మీటర్లకు తగ్గించాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ డిమాండ్ చేశారు.
 
కరీంనగర్ పర్యటనలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈ విషయం తెలుసుకున్న వెంటనే బీజేవైఎం నాయకులకు ఫోన్ చేసి భాను ప్రకాశ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలో లక్షలాది మంది అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్న సరిదిద్దాలని ఆందోళన చేస్తే అమానుషంగా వ్యవహరిస్తారా? అంటూ మండిపడ్డారు.