పరిశీలనలో ‘రామసేతు’జాతీయ వారసత్వ స్మారకం

రామసేతును జాతీయ వారసత్వ స్మారకంగా ప్రకటించే ప్రక్రియ ఇంకా పరిశీలనలో ఉందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు గురువారం తెలిపింది. రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యన్ స్వామి దాఖలు చేసిన ‘పిల్’ను ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తి జెబి. పార్ధివాలాతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. కావాలనుకుంటే ప్రభుత్వానికి ఓ వినతిని చేసుకోమని ధర్మాసనం ఆయనకు సూచించింది.

‘ప్రస్తుతం ఈ విషయం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉందని సోలిసిటర్ జనరల్ (తుషార్ మెహతా) తెలిపారు. పిటిషనర్ కావాలనుకుంటే అదనపు సమాచారాన్ని కూడా ఇవ్వొచ్చునని ఆయన అన్నట్లు’ ధర్మాసనం తెలిపింది. అంతేకాక కోర్టు ఓ నిర్ణయాన్ని తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. ఒకవేళ సంతృప్తి చెందకపోతే కోర్టు ముందు వచ్చే స్వాతంత్య్రం స్వామికి ఉందంది.

‘నేను ఈ విషయంలో ఎవరినీ కలువను…నేను అదే పార్టీలో ఉన్నాను. మా మేనిఫెస్టోలో రామసేతు ఉంది. ఏమిచేయాలనుకుంటున్నారో ఆరు వారాల్లో వారే నిర్ణయించుకోనివ్వండి’ అని సుబ్రమణ్యన్ స్వామి తెలిపారు. తాను మళ్లీ వస్తానని, విచారణ వింటానని పేర్కొన్నారు.

అప్పటి సాంస్కృతిక మంత్రి ప్రహ్లాద్ పటేల్ 2019లో రామసేతును జాతీయ వారసత్వ స్మారకంగా ప్రకటించేలా సిఫార్సు చేస్తానని తెలిపారు. అందుకో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారని స్వామి వివరించారు. అసలు విషయానికి వస్తే ‘వారు అవుననో, కాదనో చెప్పాలి అంతే’ అని స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలిస్తోందని న్యాయాధికారి చెప్పారు.

రామసేతు అన్నది రాముడు లంకకు నిర్మించిన వంతెనగా హిందువులు భావిస్తారు. ‘ఆడమ్ బ్రిడ్జి’గా కూడా అది ప్రసిద్ధి చెందింది. తమిళనాడు ఆగ్నేయం తీరంలోని పంబన్ ద్వీపం నుంచి శ్రీలంకలోని వాయవ్యంలో ఉన్న మన్నార్ ద్వీపం వరకు వ్యాపించి ఉన్న సున్నపురాళ్ల గుండ్లతో (లైమ్‌స్టోన్ షోల్స్) ఉన్న వంతెన ఇది.

ఇదిలావుండగా ఈ కేసులో మొదటి రౌండ్ ఇప్పటికే గెలిచేసినట్లు బిజెపి నాయకుడు సుబ్రమణ్యన్ స్వామి తెలిపారు. తొలి యుపిఏ ప్రభుత్వం మొదలెట్టిన వివాదాస్పద ‘సేతుసముద్రం షిప్ ఛానెల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పిల్ వేసిన బిజెపి నాయకుడు రామసేతును జాతీయ స్మారకంగా ప్రకటించాలంటున్నారు. కాగా ఈ వివాదం సుప్రీంకోర్టుకు వెళ్లగా రామసేతు ప్రాజెక్టుపై స్టే ఇచ్చింది.

అయితే కేంద్రం మాత్రం దీనిని ‘సామాజిక, ఆర్థిక ప్రతికూలతగా’ భావిస్తోంది. రామసేతు దెబ్బతినకుండా మరో మార్గం గుండా షిప్పింగ్ ఛానెల్ ప్రాజెక్టును చేపట్టాలనుకుంటోంది. ఈ ప్రాజెక్టు కింద మన్నార్‌ను పాక్ జలసంధిని కలుపాలనుకుంటోంది. ఇందుకోసం 83 కిమీ. వాటర్ ఛానెల్‌ను చేపట్టాలనుకుంటోంది.

 అందుకు అక్కడ ఉన్న సున్నపురాయి గుండ్లను డ్రెడ్జింగ్ ద్వారా తొలగించాలనుకుంటోంది. ఒక విధంగా చెప్పాలంటే అది రామసేతుకు చెరుపుచేసేదే కాగలదు. ఇదిలావుండగా సుప్రీంకోర్టు 2019 నవంబర్ 13న రామసేతుపై వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని కేంద్రానికి ఆరు వారాల గడువు కూడా ఇచ్చింది. ఒకవేళ కేంద్రం తన వైఖరిని తెలుపకుంటే కోర్టును సంప్రదించేందుకు సుబ్రమణ్యన్ స్వామికి స్వేచ్ఛ ఉంటుందని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.