చండీగఢ్ మేయర్ గా మరోసారి బిజెపి

చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌ మేయర్‌ ఎన్నికల్లో మరోసారి బీజేపీ గెలుపొందింది. 14 వార్డులు గెలిచి అతి పెద్ద పార్టీగా నిలబడినా ఆప్‌ చతికిలపడిపోయింది. దాంతో మేయర్‌, సీనియర్‌ డిప్యూటీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులు బీజేపీ వశమయ్యాయి. చండీగఢ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మూడు ముఖ్య పదవులకు మంగళవారం ఓటింగ్‌ చేపట్టారు.
ఓటింగ్‌లో మొత్తం 29 మంది ఓటు వేయగా బీజేపీకి 15, ఆప్‌కు 14 ఓట్లు వచ్చాయి. కొత్త మేయర్‌గా బీజేపీ అభ్యర్థి అనూప్ గుప్తా ఎన్నికయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన జస్బీర్ లడ్డీని 1 ఓటుతో ఓడించారు. కాగా, కాంగ్రెస్, అకాలీదళ్ కౌన్సిలర్లు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. శిరోమణి అకాలీదళ్ కార్పొరేటర్ హర్దీప్ సింగ్ ఓటు వేయలేదు.
2016 నుంచి బీజేపీ మేయర్‌ పదవిని సొంతం చేసుకుంటూ వస్తున్నది. సరబ్జీత్‌ కౌర్‌ మేయర్‌గా ఉన్న సమయంలో డిప్యూటీ మేయర్‌గా సేవలందించిన అనూప్‌ గుప్తా గత ఎన్నికల్లో 11 వార్డు నుంచి కౌన్సలిలర్‌గా గెలుపొందారు.

సీనియర్ డిప్యూటీ మేయర్ పదవిని కూడా బీజేపీయే దక్కింది. ఈ ఎన్నికలో మొత్తం 29 ఓట్లు పోలవగా బీజేపీ అభ్యర్థి కన్వర్జిత్ రాణాకు 15 ఓట్లు. ఆప్ అభ్యర్థి తరుణ మెహతాకు 14 ఓట్లు వచ్చాయి. డిప్యూటీ మేయర్ పదవికి ఆప్ అభ్యర్థి సుమన్ శర్మపై బీజేపీ అభ్యర్థి హర్జీత్ సింగ్ విజయం సాధించారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌కు డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో 14 వార్డుల్లో ఆప్‌ అభ్యర్థులు గెలవగా, 12 వార్డుల్లో బీజేపీ విజయం సాధించింది.

ఎనిమిది మంది కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలిచారు. ఒక వార్డు శిరోమణి అకాళీదళ్‌కు దక్కింది. కాగా, కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు సభ్యులు హర్‌ప్రీత్‌ కౌర్‌ బబ్లా, గుర్‌చరణ్‌జీత్‌ సింగ్‌ కాలా బీజేపీలో చేరారు. దాంతో బీజేపీ బలం 14 కు చేరింది. ఎంపీ కిరణ్‌ ఖేర్‌ ఓటు వేయడంతో బీజేపీ మూడు పదవులను దక్కించుకున్నది.