దేశంలో అత్యంత సురక్షిత జిల్లాల్లో ఆదిలాబాద్

దేశంలో అత్యంత సురక్షితమైన జిల్లాలో ఆదిలాబాద్ ఐదో స్థానంలో నిలిచింది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి విడుదల చేసిన సామాజిక ప్రగతి సూచిక, సురక్షితమైన జిల్లాల నివేదిక ప్రకారం 85 మార్కులతో ఆదిలాబాద్ జిల్లా అత్యంత సురక్షితమైన జిల్లాగా దేశంలో ఐదవ స్థానాన్ని, తెలంగాణలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది.
మారుమూల జిల్లా అయినప్పటికీ, మావోయిస్టుల ప్రాబల్యం గల అటవీ ప్రాంతం ఉన్నప్పటికీ,  పరిగణలోకి తీసుకున్న ప్రామాణిక అంశాలు,  అందుకోసం ఉపయోగించే పారామీటర్లు చార్టులలో ఆదిలాబాద్‌ను అగ్రస్థానంలో నిలిపాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ (ఎడిబి) కోసం ఎంపిక చేసిన దేశవ్యాప్తంగా ఉన్న జిల్లాలలో ఇది కూడా ఒకటి కావటం గమనార్హం.
ఈ సర్వేలో 89 సూచికలను పరిగణలోకి తీసుకున్నారు. అందులో ముఖ్యంగా మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు, సైబర్ క్రైమ్, హత్యలు, రోడ్డు మరణాలు, హింసాత్మక నేరాలు తదితర అంశాలను వ్యక్తిగత భద్రత పరిమితిని లెక్కించేందుకు పరిగణలోకి తీసుకున్నారు.  ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ద్వారా విడుదల చేసిన ఈ నివేదికలో ఆదిలాబాద్ మారుమూల జిల్లా అయినప్పటికీ మార్కులు సంపాదించే పారామీటర్లలో మాత్రం అగ్రస్థానంలో నిలిచింది.
అయితే.. తెలంగాణ మొత్తం వ్యక్తిగత భద్రత స్కోరు మాత్రం 42కే పరిమితమైంది. తెలంగాణ వ్యక్తిగత భద్రత స్కోరు 42గా ఉండగా ఆదిలాబాద్ జిల్లా వ్యక్తిగత భద్రతా స్కోరు 85గా ఉండి రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లా పోలీసు వ్యవస్థ పనితీరుకు నిదర్శనంగా ఈ భద్రత ర్యాంకింగ్స్ రావడం విశేషం.
ఈ ర్యాంకింగ్‌లో నాగాలాండ్‌లోని మొకొక్ జిల్లా 89.89 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా ఆదిలాబాద్ ఐదో స్థానం, 81 మార్కులతో కరీనంగర్ ఎనిమిదో స్థానంలో నిలిచాయి. 62 మార్కులతో హైదరాబాద్ మధ్యస్థంగా ఉండగా, భద్రాద్రి కొత్తగూడెం (44), రాజన్న సిరిసిల్ల (47), సూర్యాపేట (48) అల్యల్ప స్కోరింగ్ సాధించాయి.