తీవ్ర ఆర్థిక సంక్షోభం అంచున పాకిస్థాన్

ఆర్థిక సంక్షోభం అంచున పాకిస్థాన్ కొట్టుమిట్టాడుతుంది. చైనా నుంచి రుణాలు పెరిగిపోవడం, దేశంలో శాంతి భద్రతలు క్షీణిస్తుండటం ఈ పరిణామాలకు కారణం. దీంతో దాదాపు అన్ని ప్రభుత్వ విభాగాలు నగదు కొరతను కూడా ఎదుర్కొంటున్నాయి. పాక్‌‌లో పరిస్థితి ఇప్పుడు అత్యంత దయనీయంగా ఉంది.
చైనా నుంచి రుణాలు తీసుకోవడం వల్లే ఇప్పుడు ఈ స్థాయికి చేరినట్లు తెలుస్తోంది.
కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉండటం కలవరపరుస్తోంది. దాదాపు అన్ని విభాగాల వద్ద అసలు నగదే లేదని మీడియా కధనాలు వెల్లడిస్తున్నాయి.  ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ రానున్న కొద్ది రోజుల్లో దివాలా తీస్తుందని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు. పాక్‌కు గనుక అంతర్జాతీయ ద్రవ్య నిధి  సంస్థ నుంచి రుణం రాకుంటే కచ్చితంగా పాక్ దివాలా తీస్తుందని ఆయన స్పష్టం చేశారు.
2023 సంవత్సరం పాక్‌కు కష్టకాలమే. ఏం జరుగుతుందో.. ఈ క్లిష్ట పరిస్థితి నుంచి గట్టెక్కుతుందో లేదో చూడాలని నిపుణులు చెబుతున్నారు.  కనీసం పదవీ విరమణ పొందినవారికి కూడా వారి ప్రయోజనాలు అందక సంవత్సరం దాటింది. గ్రాట్యుటీలు,పెన్షన్ రూపంలో మొత్తం కోట్లల్లో చెల్లించాల్సి ఉంది. కానీ చిల్లిగవ్వ కూడా వారి వద్ద లేదంట. ఇక నెలవారీగా ఉద్యోగులకు వేతనాలు, రిటైర్ అయినవారికి పెన్షన్లు కూడా చెల్లించలేని పరిస్థితిలో పాక్ కొట్టుమిట్టాడుతోంది.
 
పాకిస్థాన్ రైల్వేల్లో డీజిల్ కోసం కూడా డబ్బుల్లేవంట. దీంతో అవి కూడా సరిగ్గా నడవట్లేదట. ఉద్యోగులకు వేతనాలు కూడా 15, 20 రోజుల తర్వాత అదీ కొంత మొత్తంలో చెల్లిస్తున్నాయట. ఇక రైల్వే డిపార్ట్‌మెంట్ ఉద్యోగులైతే పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేస్తున్నారట వేతనాలు చెల్లించట్లేదని.
 
 గ్యాస్ కొరత కూడా పాక్ ప్రజల్ని వేధిస్తోంది. అక్కడ గ్యాస్ కూడా నిండుకుందంట. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రజలు గ్యాస్‌ను ప్లాస్టిక్ బ్యాగుల్లో నింపుకుంటున్న వీడియోలు వైరల్‌గా మారాయి  ఒకవైపు ఇలాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ద్రవ్యోల్బణం కూడా చుక్కలు చూపిస్తోంది. అన్ని రికార్డులను బ్రేక్ చేసింది.
 
 అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. లైవ్ బ్రాయిలర్ చికెన్ రేటు కొద్దిరోజుల కిందటి వరకు కిలోకు రూ.370గా ఉండగా.. ఇప్పుడది రూ.800 స్థాయికి చేరడం గమనార్హం. ఇంకా ఇవే కాకుండా పప్పులు, నూనెలు, గోధుమ పిండి వంటివాటి ధరలు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి.
 
మరోవైపు పాకిస్థాన్‌లో సంక్షోభం నేపథ్యంలో విద్యుత్ కష్టాలు కూడా ఎక్కువయ్యాయి. లైట్లు ఆర్పేయాలని ప్రజలకు సూచిస్తున్నారు. కేబినెట్ మీటింగ్‌ల్లోనూ లైట్లు ఆర్పేసి నిర్వహిస్తుండటం గమనార్హం. మార్కెట్లు, మాల్స్, ఫంక్షన్ హాల్స్ ఇతరత్రా వాటిని త్వరగా మూసేస్తున్నారు. విద్యుత్ కష్టాలను అధిగమించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోందీ పొరుగు దేశం.
 
ఇపుడు ప్రభుత్వం ఇంధన పొదుపు చర్యలు ప్రకటించింది. రాత్రి 8.30గంటలకే మార్కెట్లు, రాత్రి. 10గంటలకు ఫంక్షన్ హాళ్లు మూసివేయాలని పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రకటించారు. ఫిబ్రవరి నుంచి బల్బుల తయారీని, జూలై నుంచి నాసిరకం ఫ్యాన్ల ఉత్పత్తిని ఆపేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆఫీసుల్లో 30 ని శాతం విద్యుత్ ఆదాకు చర్యలు తీసుకున్నట్లు ప్రకటించారు. ఇంధన పొదుపు ప్రణాలళికను తక్షణమే అమలు చేస్తామని పేర్కొన్నారు.