దేశంలోని రాజకీయ నాయకులలో అత్యంత సంపన్నుడిగా ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలిచారు. ముఖ్యంగా దేశంలోని 30మంది సీఎంలలో అత్యంత ధనవంతుడని ప్రముఖ వెబ్పత్రిక ‘ది ప్రింట్’ కధనం వెల్లడించింది. అన్ని రాష్రాల ముఖ్యమంత్రులు ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చింది.
వారి ఆస్తులతో పాటు వారి గురించి ఏడు ఆసక్తికర అంశాలపై విశ్లేషణ చేసింది. అత్యంత ధనవంతుడిగా ఏపీ సీఎం మొదటిస్థానంలో ఉంటే చివరన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నారు. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అత్యధిక విద్యార్హత కలిగి ఉండగా, 8మంది సీఎంలు సొంత ఆయుధాలు కలిగి ఉన్నారు. సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్సింగ్ తమాంగ్ గోలేకు ముగ్గురు భార్యలున్నారంటూ ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది.
జగన్ రూ.370 కోట్ల ఆస్తితో 30మంది సీఎంలలో మొదటి స్థానంలో ఉన్నారు. ఈ ఆస్తుల్లో వారసత్వంగా వచ్చిన ఆస్తితో పాటు సంపాదించినది కూడా ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆ తర్వాత అరుణాచల్ప్రదేశ్ సీఎం పేమా ఖండూకు రూ.132 కోట్ల ఆస్తులున్నాయి. ఈశాన్య రాష్ట్ర్లాలకు చెందిన 8మంది సీఎంల ఆస్తుల విలువ మొత్తం రూ.178.85 కోట్లు.
మమతా బెనర్జీ ఆస్తి కేవలం రూ.15 లక్షలు కాగా, బిహార్ సీఎం నితీశ్కుమార్ ఆస్తి రూ.56 లక్షలు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ రూ.73 లక్షల ఆస్తులు కలిగి ఉన్నారు. 12 మంది సీఎంల జీవిత భాగస్వాములకు వేర్వేరు వ్యాపారాలున్నాయి.
హేమంత్ సోరెన్ (జార్ఖండ్), శివరాజ్సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్), ఏక్నాథ్ షిండే (మహారాష్ట్ర)ల భార్యలు.. తమ భర్తలకంటే ధనవంతులు. అసోం ముఖ్యమంత్రి భార్య రినిరి భుయాన్ శర్మ ప్రముఖ మీడియా కంపెనీకి సీఎండీగా ఉన్నారు. ఆమె భర్త ఆస్తి రూ.1.04 కోట్లు కాగా.. ఆమె ఆస్తి రూ.11 కోట్లు.
సోరెన్ ఆస్తి రూ.2.24కోట్లు. ఆయన భార్య కల్పన ఆస్తుల విలువ రూ.5.81కోట్లుగా ఉంది. అదే విధంగా చౌహాన్ ఆస్తి రూ.2.6కోట్లు కాగా ఆయన భార్య సాధనాసింగ్ రూ.3.9కోట్లు ఆస్తి కలిగి ఉన్నారు. షిండే భార్య లతా షిండే కాంట్రాక్టర్.
30 మంది సీఎంలలో ఐదుగురు మనోహర్లాల్ ఖట్టర్(హరియాణా), నవీన్ పట్నాయక్(ఒడిసా), యోగి ఆదిత్యనాథ్(యూపీ), ఎన్.రంగసామి(పుదుచ్చేరి), మమతా బెనర్జీ (పశ్చిమబెంగాల్) అవివాహితులు. సిక్కిం సీఎం తమాంగ్కు ముగ్గురు భార్యలు ఉండగా, వారు ముగ్గురూ ప్రభుత్వ ఉద్యోగులే కావడం గమనార్హం.
అందరి కంటే ఎక్కువగా తెలంగాణ సీఎం కేసీఆర్పై 64 కేసులు ఉంటే, ఆ తర్వాత తమిళనాడు సీఎం స్టాలిన్పై 47 కేసులు, సీఎం జగన్పై 38 కేసులు ఉన్నాయి. నేరారోపణ కేసులు కేసీఆర్, జగన్ ఇద్దరిపైనా ఉన్నాయి. అలర్లు, హత్యాయత్నం కేసుల్లో కేసీఆర్, చీటింగ్ కేసుల్లో జగన్, కిడ్నాప్ కేసులో స్టాలిన్ ఉన్నారు.
10 మంది బీజేపీ సీఎంలలో ఒక్కరిపైనా ఒక్క కేసు కూడా లేదు. బీజేపీయేతర సీఎంలలో అశోక్ గహ్లోత్ (రాజస్థాన్), కొనరాడ్ సంగ్మా (మేఘాలయ), నిఫ్యూ రియో (నాగాలాండ్), మమత, నవీన్ పట్నాయక్, రంగస్వామిపైనా ఎలాంటి క్రిమినల్ కేసులూ నమోదు కాలేదు.
అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఫిలాసఫీలో డాక్టరేట్, పొలిటికల్ సైన్స్లో పీజీ, లా డిగ్రీ చేసిన అత్యంత విద్యావంతుడు. త్రిపుర సీఎం మాణిక్ సాహా డెంటిస్ట్రీలో మాస్టర్ డిగ్రీ చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై మెకానికల్ ఇంజనీరింగ్ చేయగా.. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేశారు.
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే అందరి కంటే తక్కువ విద్యార్హత కలిగి ఉన్నారు. ఆటో డ్రైవర్ నుంచి శివసేన నేతగా ఎదిగిన ఆయన హైస్కూల్ చదువు కూడా పూర్తిచేయలేదు. స్థిరాస్తుల్లో కూడా జగన్ రూ.27.74 కోట్లతో ముందు వరుసలో ఉన్నారు. తర్వాతి స్థానంలో రూ.60కోట్లతో నవీన్ పట్నాయక్, ఆ తర్వాత రూ.38 కోట్లతో రంగసామి ఉన్నారు.
జగన్ పేరిట 4 వాహనాలున్నాయి. అందులో మూడు స్కార్పియోలు, ఒక బీఎండబ్ల్యూ ఉంది. కేంద్ర హోంశాఖ ఇచ్చిన బుల్లెట్ప్రూఫ్ వాహనం కూడా తన పేరున ఉందని, అయితే దానిని కొనుగోలు చేసింది తాను కాదని అఫిడవిట్లో జగన్ పేర్కొన్నారు.
More Stories
నామినేషన్ ఉపసంహరించుకున్న ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి
హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అంటూ కేటీఆర్ కొత్త అస్త్రం
రేజర్వేషన్లపై అమిత్ షా `నకిలీ వీడియో’పై ఎఫ్ఐఆర్