కరోనా పుట్టినిల్లయిన చైనాలో తాజాగా కేసులు మళ్లీ విజృంభిస్తూ ఉండడంతో అక్కడి ప్రజలను అత్యవసర సేవలు, మందుల కొరత వేధిస్తున్నట్లు తెలిసింది. పైగా, చైనాలో తయారైన టీకాలు తీసుకోవడంతోనే తిరిగి ఈ మహమ్మారి తిరగబెట్టిందని సర్వత్రా అంటూ ఉండడంతో స్థానిక మందులపై ప్రజలలో నమ్మకం సడలిపోతున్నది.
దీంతో చైనా ప్రజలు భారత దేశం నుండి వచ్చే మందుల వైపు చూస్తున్నారు. చైనాలో కరోనా వ్యాక్సిన్లు అయిన పాక్స్లోవిడ్, అజ్వుడిన్ కొన్ని ఆసుపత్రిలో మాత్రమే లభిస్తున్నాయి. పైగా అధిక ధరకు విక్రయిస్తుండటంతో చైనా ప్రజలు భారతీయ జనరిక్ డ్రగ్స్పై ఆధారపడుతున్నారు.
అయితే, భారత్ కు చెందిన ఔషధాల విక్రయాలను చైనాలోని నిరంకుశ పాలకులు అనుమతించడం లేదు. చైనాలో ఇప్పుడు తిరిగి కరోనా ప్రభావం పెరిగిపోవడంతో ప్రజలు బ్లాక్ మార్కెట్లో భారతీయ డ్రగ్స్ను కొనుగోలు చేస్తున్నారు. ఇటువంటి సమయంలో చైనా వ్యాక్సిన్ల కొరత ఉండడం, అధిక ధరకు విక్రయిస్తుండటంతో.. అక్రమంగా రవాణా చేస్తూ బ్లాక్ మార్కెట్లో తక్కువ ధరకు దొరికే ఇండియన్ డ్రగ్స్ అయిన యాంటీ కొవిడ్ ఇండియన్ జనరిక్ డ్రగ్స్ బాక్సును 144 డాలర్లకు అమ్ముతున్నారు.
ఈ విషయం చైనీస్ సోషల్ మీడియా ప్లాట్ ఫారం అయిన వెయిబోలో ట్రెండింగ్ అయింది. యూజర్లు మెడిసిన్ పొందడానికి టిప్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నట్లు రిపోర్టు పేర్కొంది. ఇండియన్ యాంటీ కొవిడ్ డ్రగ్స్ అయిన ప్రీమోవిర్, పాక్సిస్ట , మొల్నునట్, మొల్నట్రిస్ తదితర ఔషధాలను చైనీస్ బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నట్లు ఇంకొక ఆన్లైన్ పోర్టల్ పేర్కొంది.
లాన్సెట్ కమిషన్ మెంబర్ అయిన సునీల్ గర్గ్ మాట్లాడుతూ.. వైరస్కి సరిహద్దులతో సంబంధం లేదని, ఇప్పటికే ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవడం ప్రారంభించిందని తెలిపారు. కరోనా ఫోర్త్ వేవ్పై చైనా నుంచి స్పష్టత కావాలని పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యాక్సినేషన్పై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
చైనాలో కరోనా ప్రభావంతో మందుల కొరత రావడంతో జనం ఆస్పత్రుల దగ్గర క్యూలో నిలబడి ఉన్న వీడియోలు వైరల్ అయ్యాయి. అలాగే శ్మశానం వద్ద శవాలు గుట్టలు కూడా కనిపించాయి. కానీ ఇప్పటివరకు కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు గురించి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ నోరు మెదపలేదు. పెరుగుతున్న కేసుల గురించి స్పందించలేదు.
ప్రస్తుతం చైనాలో పారాసిటమాల్, ఐబుప్రోఫిన్ టాబ్లెట్లు కొరత ఉండడంతో డిమాండ్ ఎక్కువగా ఉందని, చైనా నుంచి ఈ టాబ్లెట్లు ఉత్పత్తి కోసం కొటేషన్లు వస్తున్నాయని ఫార్మేక్సిల్ చైర్మన్ షాహిల్ ముంజల్ తెలిపారు. ఈ పరిస్థితిపై స్పందించిన విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఆరిందం బాగచి ప్రపంచంలోనే అతిపెద్ద జనరిక్ మెడిసిన్ తయారీదారులుగా ఉన్న భారత్ ఈ పరిస్థితుల్లో చైనాకి సహాయం చేయడానికి ముందుంటుందని తెలిపారు.
చైనాలో కరోనా పరిస్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఫార్మేక్సిల్ రిపోర్ట్ ప్రకారం.. 2021-22 సంవత్సరంలో చైనాకి భారత నుండి మెడికల్ ఉత్పత్తులు కేవలం 1.4% మాత్రమే ఎగుమతి అయ్యాయని తెలిపారు.
More Stories
రెండేళ్లలో పోలవరం పూర్తిచేస్తాం.. రాజధానిగా అమరావతి చేస్తాం
పోలింగ్కు ముందే జారిపోతున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు
పోలవరం పూర్తి చేసే బాధ్యత నాది