పోలవరం పూర్తి చేసే బాధ్యత నాది

* ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ప్రధాని మోదీ హామీ

పోలవరం పూర్తి చేసే బాధ్యత తనదని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు దృఢమైన హామీ ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర  మోదీ వెల్లడించారు. రెండు రాష్ట్రాల్లోని మాదిగలకు న్యాయం చేస్తానని అన్నారు. డీలిమిటేషన్‌లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనివ్వనని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల వేళ ‘ఈనాడు’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను వెల్లడించారు.

ప్రశ్న: పదేళ్ల పదవీ కాలాన్ని నెమరేసుకుంటే ఏమనిపిస్తుంది? మీరు సాధించిన పెద్ద విజయాలేంటి?
జవాబు: 140 కోట్ల మంది ప్రజల మనసుల్లో నమ్మకం, విశ్వాసం నెలకొల్పడమే మేం సాధించిన ప్రధాన విజయం. ప్రభుత్వ పని సంస్కృతిని మార్చేశాం. 4 కోట్ల కుటుంబాలకు నీడ దొరికింది. మరుగుదొడ్లు మహిళల గౌరవాన్ని నిలబెట్టాయి. ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు అందుతోంది. గ్యాస్‌ కనెక్షన్ల వల్ల ఆరోగ్యకరమైన వాతావరణంలో వంట చేయగలుగుతున్నారు. 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్‌ అందించాం. ఇవన్నీ ప్రజల జీవన ప్రమాణాల్లో గొప్ప మార్పులు తెచ్చాయి. ప్రత్యక్ష నగదు బదిలీ విధానాన్ని అమల్లోకి తెచ్చి ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందించడంలో జరిగే రూ.3.5 లక్షల కోట్ల అవినీతిని నిర్మూలించగలిగాం

ప్రశ్న: ఈ ఎన్నికల్లో మీరు బీజేపీకి 370కిపైగా, ఎన్డీయేకు 400కుపైగా సీట్ల లక్ష్యం విధించుకున్నారు. దీని వెనకున్న లక్ష్యమేంటి?
జవాబు: 370 సీట్లన్నది కేవలం ఎన్నికల నినాదం కాదు. అది ప్రజాభిప్రాయం. మోదీ గ్యారంటీలను అమలు చేస్తారని మాపై పెట్టుకున్న నమ్మకం, విశ్వాసానికి నిదర్శనం. ఆర్టికల్‌ 370 రద్దు అన్నది కోట్ల మంది ప్రజల దీర్ఘకాల ఆకాంక్ష. ఆర్టికల్‌ 370 రద్దు చేసిన పార్టీకి 370కిపైగా సీట్లు, కూటమికి 400కుపైగా సీట్లు ఇవ్వాలన్న సహజ సిద్ధమైన భావోద్వేగం వారిలో కలిగింది. ఈ నినాదం వెనుకున్న అసలు విషయం ఇది. మన రాజ్యాంగాన్ని కాపాడటానికి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను రక్షించడానికి మాకు 400 సీట్లు అవసరం.

ప్రశ్న: దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటు సీట్లు భారీగా తగ్గిపోతాయనే భయాందోళనలు నెలకొన్న వేళ మీరు ఎలాంటి భరోసా ఇస్తారు..?
జవాబు: నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు అన్యాయం జరగదని నేను గ్యారంటీ ఇస్తున్నా. ప్రతిపక్షాలకు సానుకూల ఎజెండా లేదు కాబట్టి అవెప్పుడూ దేశాన్ని విభజించే కథనాలను సృష్టించడానికి ప్రయత్నిస్తుంటాయి.

ప్రశ్న: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మీవద్ద ఉన్న ప్రణాళికలేంటి? మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంలో..
జవాబు: తెలుగు రాష్ట్రాల్లోని మాదిగలకు చారిత్రకంగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి కంకణబద్ధులై ఉన్నాం. ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నాం. కేబినెట్‌ కార్యదర్శి నేతృత్వంలో ఉన్నత సాయి కమిటీ ఏర్పాటు చేశాం. ఈ కమిటీ ఇప్పటికే ఏపీ, తెలంగాణ, కర్ణాటకలోని మాదిగ సామాజిక వర్గం ప్రతినిధులతో సమావేశమై చర్చలు జరిపింది.

ప్రశ్న: విభజన వేళ పార్లమెంటు సాక్షిగా ఏపీ, తెలంగాణలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఏమైనా మార్గ సూచిక ఉందా?
జవాబు: నాటి హామీల అమలుకు మేం చిత్తశుద్ధితో పని చేశాం. ఏకాభిప్రాయ సాధనతో ద్వైపాక్షిక సమస్యల సామరస్య పరిష్కారానికి మా ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోంది. ఈ దిశగా 2014 నుంచి ఇప్పటివరకూ 33 సమీక్షా సమావేశాలను నిర్వహించాం. అయితే రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం లేక 89 సంస్థలు/కార్పొరేషన్ల విభజన పూర్తి కాలేదు.

14, 15వ ఆర్థిక సంఘం సిఫార్సులతో తెలుగు రాష్ట్రాలకు వేల కోట్ల గ్రాంటు ఇచ్చాం. వనరుల లోటు భర్తీ, 7 వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, విదేశీ సాయం కింద చేపట్టిన ప్రాజెక్టుల రుణాలపై వడ్డీ కోసం ఏపీకి రూ.35వేల కోట్లకుపైగా విడుదల చేశాం. జాతీయస్థాయి విద్యాసంస్థలను ఏర్పాటు చేశాం. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటుకు ఆమోదముద్ర వేశాం. ఏపీని పెద్ద పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడానికి కసరత్తు చేస్తున్నాం. వైజాగ్‌-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ను దిల్లీ-ముంబయి పారిశ్రామిక కారిడార్‌ తరహాలో అభివృద్ధి చేస్తున్నాం.

తెలంగాణలోని ములుగులో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశాం. కాజీపేటకు రైల్వే వ్యాగన్ల తయారీ యూనిట్‌ మంజూరు చేశాం. 9 ఉమ్మడి జిల్లాల అభివృద్ధి కోసం ప్రత్యేక సాయం కింద రూ.2,250 కోట్లు విడుదల చేశాం.

ప్రశ్న: పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణంలో మీ సాయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. అది పూర్తయితే దేశానికి రాష్ట్రం ధాన్యాగారంగా మారడం ఖాయం. ఈ విషయంలో రాష్ట్ర ప్రజలకు మీరేమైనా హామీ ఇస్తారా?
జవాబు: పోలవరం జాతీయ ప్రాజెక్టు. ఈ విషయంలో ఏపీ ప్రజలకు దృఢమైన హామీ ఇస్తున్నా. దీని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇప్పటికే రూ.15వేల కోట్లకుపైగా విడుదల చేసింది. పోలవరం నిర్వాసితుల పునరావాసానికి మేం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశాం. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిర్మాణ పనులను రోజువారీగా పర్యవేక్షిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ అంశాల్లో సాయం చేయడానికి వివిధ స్థాయిల్లో ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పనులను సమీక్షిస్తున్నాం.

ప్రశ్న: మీరు మంచి ఆరోగ్యానికి, శారీరక దృఢత్వానికి¨ చిహ్నంగా కనిపిస్తారు. మీ ఆరోగ్య రహస్యమేమిటి? రోజుకు ఎన్ని గంటలు పని చేస్తారు? సెలవు తీసుకోకుండా నిరంతరం పని చేయడానికి స్ఫూర్తి ఏమిటి?
జవాబు: రోజుకు ఎన్ని గంటలు పని చేశానని లెక్కలేసుకునే వ్యక్తిని కాదు. కొన్ని అలవాట్లను చిన్నప్పుడే నేర్చుకుని ఇప్పటికీ పాటిస్తున్నాను. హిమాలయ పొత్తిళ్లలో గడిపిన రోజుల్లో బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నాన పానాదులు పూర్తి చేసేవాణ్ని. అప్పటి నుంచీ అదే అలవాటును కొనసాగిస్తున్నాను. యోగా, ధ్యానం క్రమం తప్పకుండా చేస్తా. నేను గంటల తరబడి నిద్రపోలేను. నా జీవితంలో పనికి, విశ్రాంతికి మధ్య తేడా లేదు. పనిలోనే విశ్రాంతి వెతుక్కోవడం అలవాటు చేసుకున్నాను.

ప్రశ్న: గత పదేళ్ల భారాస, ప్రస్తుత కాంగ్రెస్‌ పాలనల మధ్య ఏమైనా తేడా గుర్తించారా?
జవాబు: ఇది చాలా మంచి ప్రశ్న. ఈ రెండు ప్రభుత్వాల మధ్య తేడాను తెలంగాణ ప్రజలూ గుర్తించలేకపోతున్నారు. ఒకే నాణేనికున్న రెండు పార్శ్వాలు భారాస, కాంగ్రెస్‌లు. రెండు ప్రభుత్వాలు కొండంత హామీలిచ్చాయి. కానీ గోరంతే చేశాయి.. చేస్తున్నాయి. ఒక విషయంలో రెండూ బాగున్నాయి.. అదే అవినీతి. తెలుగు సినిమా పరిశ్రమ ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి సూపర్‌హిట్‌ సినిమాను ఇస్తే.. తెలంగాణ ప్రభుత్వం ప్రజల నుంచి బలవంతంగా ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దేశానికి మంచిపేరు తెస్తే, ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ భారత్‌ పరువును దిగజారుస్తోంది. దిల్లీ మద్యం కుంభకోణంలో కాంగ్రెస్‌, భారాసలు రెండూ భాగస్వాములే. భారాసను ఇంటికి పంపడానికి ప్రజలు పదేళ్లు తీసుకున్నారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని సాగనంపడానికి వారికి ఎక్కువ సమయం పట్టదు.

ప్రశ్న: ఈ ఎన్నికలు మీ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా చూస్తారా?
జవాబు: మనం ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య ఉత్సవాలను నిర్వహించుకుంటున్నాం. మా ప్రభుత్వ కఠోర శ్రమ, ట్రాక్‌ రికార్డును దేశ ప్రజలు చూశారు. దశాబ్ద కాలంలో దేశాన్ని ఎలా రూపాంతరం చెందించామన్నది గుర్తించారు. కాబట్టి ప్రజలంతా ఈ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. 2047 నాటికి వికసిత భారత్‌ లక్ష్యాన్ని చేరుకునేలా మేం దేశాన్ని ముందుకు తీసుకెళ్తామని వారు నమ్ముతున్నారు.

  • ప్రభుత్వంలో ఉన్నవారిపై అరుదుగా కనిపించే సానుకూలతను నేను ప్రతి చోటా చూస్తున్నాను. నేను ఎక్కడికెళ్లినా తల్లులు, చెల్లెళ్లు ఆశీర్వదిస్తున్నారు. దేశ భవిష్యత్తుపై యువత అత్యంత సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేస్తోంది. అందుకే తొలిసారి ఓటు హక్కు వచ్చిన వారు ఓటేయడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రజలు ఈ ఎన్నికల్లో తామే పోటీ చేస్తున్నట్లుగా భాగస్వాములవుతున్నారు. మాకు వేసే ప్రతి ఓటు వికసిత భారత్‌కేనని ప్రజలకు తెలుసు.
  • ఒకవైపు మేం చేసిన పనులు, భవిష్యత్తు ప్రణాళికల గురించి చెప్పి ప్రజలను ఓట్లు అడుగుతుంటే.. ప్రతిపక్షాలు మోదీని లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేస్తున్నాయి. చేయడానికి పని, భవిష్యత్తు గురించి ఆలోచనలు లేకపోవడంతో అవి నాపై దాడే లక్ష్యంగా చేసుకోవడంతోపాటు దూషించడానికి పరిమితమవుతున్నాయి. మోదీని గద్దెదింపడమే వాటి ఎజెండాగా మారింది.

దండిగా సాయం: తెలంగాణ నుంచి ఎక్కువ ఆదాయం వస్తున్నా కేంద్రం తమకు తగినన్ని నిధులు ఇవ్వడంలేదని అక్కడి ప్రభుత్వాలు ఆరోపించడం వారి చేతగానితనానికి నిదర్శనం. స్వీయ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే దీన్ని సాకుగా చూపుతున్నారు. 2004-2014 మధ్యలో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.1,32,384 కోట్లు వస్తే, 2014-24 మధ్యలో తెలంగాణకు రూ.1,62,288 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,94,602 కోట్ల వాటా దక్కింది. గత ప్రభుత్వాల నాటి కాలంతో పోలిస్తే మా హయాంలో రెండు రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటా, ఇతర సాయం గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగింది.

ప్రశ్న: వచ్చే ఐదేళ్లలో మీ ముఖ్యమైన ప్రాధాన్యాలేంటి?
జవాబు: వికసిత భారత్‌ దిశగా అభివృద్ధిని వేగవంతం చేయడమే మా మొట్టమొదటి ప్రాధాన్యాంశం. మూడోసారి అధికారం చేపట్టిన తొలి 100 రోజుల్లో దీనిపై కార్యాచరణ మొదలుపెడతాం. తర్వాత వచ్చే 5 ఏళ్లకు పూర్తి స్థాయి ప్రణాళిక అమలు చేస్తాం. 2014లో బాధ్యతలు చేపట్టినప్పుడు దేశానికి జరిగిన నష్టాన్ని నివారించడానికి మిషన్‌ మోడ్‌లో పని చేశాం. ఎక్కడ సంపూర్ణమైన మరమ్మతు అవసరమో అక్కడ చేశాం. యూపీయే ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన దుష్పరిపాలన, తప్పులు, లోపాలను సరిదిద్దడం మాకు తలకు మించిన భారంగా పరిణమించింది. రెండో విడతలో దీర్ఘకాల సమస్యలకు పరిష్కారం కనుగొనడంలో నిమగ్నమయ్యాం.

మూడో విడతలో ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడానికి బలమైన పునాది వేయబోతున్నాం. మూడో విడతలో ప్రతి భారతీయుడి కల నెరవేరుతుంది. సొంత శక్తితో భారత్‌ ప్రపంచ నేతగా ఎదిగే సమయం వచ్చింది.ఈ రోజు చిన్న బొమ్మల నుంచి చంద్రయాన్‌, గగన్‌యాన్‌ వరకూ, వందే భారత్‌ రైళ్ల నుంచి ప్రపంచ స్థాయి ఎక్స్‌ప్రెస్‌వేల వరకూ, మొబైల్‌ ఫోన్ల నుంచి సూపర్‌ కంప్యూటర్ల వరకూ అన్నీ మన ముంగిటకొస్తున్నాయి. మనం ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్లు, జెట్స్‌ తయారు చేస్తున్నాం. మూడో విడతలో వికసిత్‌ భారత్‌ కలను నెరవేర్చే దిశలో పెద్ద ముందడుగు వేయబోతున్నాం. ఇప్పటివరకూ మీరు చూసింది ట్రైలర్‌ మాత్రమే. అసలు మున్ముందు చూస్తారు.

ప్రశ్న: పన్నుల రూపంలో తెలంగాణ నుంచి కేంద్రానికి ఎక్కువ ఆదాయం వస్తున్నా కేంద్రం తగిన నిధులు కేటాయించడం లేదన్న విమర్శలకు ఏమని సమాధానం చెబుతారు?
జవాబు: ఇందులో నిజాలు తెలిసీ ప్రతిపక్షాలు పదేపదే ఇలాంటి ఆరోపణలు చేయడం దురదృష్టకరం. తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే అవి దీన్ని ఉయోగించుకుంటున్నాయి. విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే కొన్ని వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలి. పన్నుల్లో రాష్ట్రాలకు ఎంత వాటా పంపిణీ చేయాలన్న దానిపై రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఆర్థిక సంఘం ఉంటుంది. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు పంపిణీ చేసే వాటాను ఏకంగా 32% నుంచి 42%కి పెంచింది. ఆ సిఫార్సులను ఎన్డీయే ప్రభుత్వం పూర్తిగా అమలు చేసింది. దానివల్ల రాష్ట్రాలకు వచ్చే వాటా భారీగా పెరిగింది. మూలధన వ్యయం కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ప్రత్యేక సాయం చేస్తోంది. ఈ పథకం కింద తెలంగాణకు రూ.1,156 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,226 కోట్లు ఇచ్చాం. గత ప్రభుత్వాల నాటితో పోలిస్తే మా హయాంలో రెండు రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటా, ఇతర సాయం గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగింది.

ప్రశ్న: భారత్‌ 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే క్రమంలో మీ నాయకత్వంద్వారా దేశం ఎంత ముందడుగు వేసింది? ఆ ఆర్థిక పురోగతి ఫలాలను ప్రజలు ఎప్పటి నుంచి అనుభవించగలుగుతారు?
జవాబు: అభివృద్ధి ఫలాలను మనం తొలి నుంచీ దక్కించుకోవడం లేదని ఎవరైనా భావిస్తే వాళ్లు పెద్ద విషయాలను చూడలేదేమో అనిపిస్తుంది. మన చుట్టుపక్కలున్న ప్రపంచ దేశాలు ద్రవ్యోల్బణం, అధిక ధరలతో సతమతమవుతున్న తరుణంలో భారత్‌లో అందుకు భిన్న పరిస్థితులున్నాయి. మన విశిష్టమైన అభివృద్ధి ప్రస్థానానికి ఇదే ప్రత్యక్ష, ప్రబల సంకేతం. ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థలన్నింటి కంటే మనం వేగంగా అభివృద్ధి చెందుతున్నాం. గత పదేళ్ల కాలంలో కొవిడ్‌, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ వ్యాప్తంగా ధరల పెరుగుదల లాంటి సమస్యలు చుట్టుముట్టినప్పటికీ ద్రవ్యోల్బణం సగటున 5%కి పరిమితమయ్యేలా చర్యలు తీసుకున్నాం.

16 ఏళ్ల గరిష్ఠానికి పీఎంఐ: తయారీ రంగం పీఎంఐ 16 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరింది. చిన్న చిన్న తయారీ సంస్థలూ తమకు అందిన కొత్త ఆర్డర్లను పూర్తి చేయడంలో తలమునకలై ఉన్నాయి. మన మార్కెట్లు కొత్త శిఖరాలకు చేరుకుంటూ రికార్డులు సృష్టిస్తున్నాయి. దేశ, విదేశీ పెట్టుబడులు, ఐపీవోల్లో నిరంతర వృద్ధిని చూస్తున్నాం. అందువల్ల ఫలాల గురించి మాట్లాడేటప్పుడు ఈ కొలమానాలన్నింటినీ కలిపి చూడండి. ఒకవైపు ఉపాధిపరంగా ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. ఎన్నో అభివృద్ధి మార్గాలు కనిపిస్తున్నాయి. ఆదాయాలు పెరుగుతున్నాయి. మరోవైపు ఖర్చులు తగ్గుతున్నాయి. అభివృద్ధి చక్రంలో భాగస్వాములు కావడానికి మునుపెన్నడూ లేని అవకాశాలు మన ముందున్నాయి.

జీరో బ్యాలెన్స్‌ ఖాతాలపై నవ్వారు: భారత్‌ సాధించిన డిజిటల్‌ విప్లవం.. మరీ ముఖ్యంగా ప్రత్యక్ష నగదు బదిలీని ఉదాహరణగా తీసుకోండి. నేను జీరో బ్యాలెన్స్‌ బ్యాంకు ఖాతాల గురించి మాట్లాడినప్పుడు చాలా మంది నవ్వారు. డబ్బులు లేనప్పుడు బ్యాంకు ఖాతాలు తెరవాల్సిన అవసరం ఏముందని, పేదలకు బ్యాంకు సేవలు ఎలా అందుతాయని ప్రశ్నించారు. కానీ మేం దాన్ని సవాలుగా స్వీకరించి, భారతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థను సమాయత్తం చేశాం. ఈ రోజు ప్రజల బ్యాంకు ఖాతాల్లో రూ.36 లక్షల కోట్లను ప్రభుత్వం ఉంచింది. ప్రత్యక్ష నగదు బదిలీ విధానాన్ని అమల్లోకి తెచ్చి ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందించడంలో జరిగే రూ.3.5 లక్షల కోట్ల అవినీతిని నిర్మూలించగలిగాం.

ప్రశ్న: మళ్లీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఏం చేయబోతున్నారు?
జవాబు: యువతకు ఉద్యోగాలు కల్పించడంలో గత అన్ని ప్రభుత్వాల కంటే మా రికార్డు ఉత్తమంగా ఉంది. మాకున్న అత్యంత ప్రాధాన్యాంశాల్లో ఇది ఒకటి. ఈ విషయంలో మేం గణనీయ పురోగతి సాధించాం. వార్షిక పీఎల్‌ఎఫ్‌ఎస్‌ డేటా ప్రకారం 2017-23 మధ్యకాలంలో కార్మికులు, జనాభా నిష్పత్తి 56% దాటిపోగా, నిరుద్యోగ రేటు కనిష్ఠంగా 3.2%కి పడిపోయింది. ప్రపంచంలోనే అతి కనిష్ఠ నిరుద్యోగ రేటు ఇదే. ఎంతో మంది కార్మిక శక్తిలో చేరడాన్ని మనం చూస్తున్నాం. గత ఆరున్నరేళ్లలో ఈపీఎఫ్‌వోలో నికరంగా 6.17 కోట్ల మంది కొత్త చందాదారులు చేరడం సంఘటిత ఉద్యోగ మార్కెట్‌ వృద్ధిని సూచిస్తోంది. ముద్ర రుణాల ద్వారా 8 కోట్ల కొత్త వ్యాపారాలు ఏర్పడటానికి సాయం చేశాం. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే 6 కోట్ల ఉద్యోగాలను సృష్టించింది. అది రెట్టింపు దిశగా వెళ్తోంది. రియల్‌ ఎస్టేట్‌ రంగం గత దశాబ్ద కాలంలో 3 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించింది. రోజ్‌గార్‌ మేళా ద్వారా లక్షల మంది యువతను ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమిస్తున్నాం. స్టార్టప్‌లు ఇప్పటివరకూ లక్షకుపైగా ఉద్యోగాలు కల్పించాయి.

  • పదేళ్లకు ముందు చాలా వ్యవస్థలు మనుగడలోనే లేవు. ఉదాహరణకు క్రీడా రంగాన్ని తీసుకుంటే మేం ఈ రంగాన్ని ఆకర్షణీయమైన కెరీర్‌గా తీర్చిదిద్దాం. శిక్షకులు, విశ్లేషకులు, పౌష్టికాహార నిపుణులు, గ్రౌండ్‌ స్టాఫ్‌ రూపంలో ఎన్నో ఉద్యోగావకాశాలు కల్పించాం. అంతరిక్షం, డ్రోన్లు, స్టార్టప్‌లు, హరిత ఇంధనంలాంటి రంగాలు వేగంగా వికసిస్తున్నాయి.
  • మౌలిక వసతుల కోసం ఆశ్చర్యపోయే విధంగా మేం రూ.11.11 లక్షల కోట్లు కేటాయించాం. చరిత్రలో ఇదే అత్యధికం.
  • ప్రపంచం పారిశ్రామికం 4.0వైపు మళ్లుతున్న తరుణంలో ఉద్యోగాల గుణం వేగంగా మారిపోతోంది. ఈ మార్పును ముందు చూపుతో గ్రహించి మనం అందిపుచ్చుకుంటున్నాం. ఉద్యోగాల కల్పనలో భారత్‌ భవిష్యత్తులో కూడా ముందుంటుందని ప్రగాఢంగా నమ్ముతున్నాను.

రూ.21 వేల కోట్లకు పైగా రక్షణ ఎగుమతులు: ఈరోజు మనం మొబైళ్ల తయారీలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నాం. మన రక్షణ ఎగుమతులు రూ.21వేల కోట్లను దాటాయి. సౌర విద్యుత్తు పరికరాల తయారీలో ప్రపంచంలో రెండో అతి పెద్ద దేశంగా అవతరించబోతున్నాం. ఇంత విస్తృత స్థాయిలో మనం చేస్తున్న పనులు కొత్త ఉద్యోగాలు సృష్టించవనుకుంటున్నారా?

ప్రశ్న: కొత్త రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తగిన విధంగా సాయం చేయడం లేదని భారాస, కాంగ్రెస్‌ రెండూ ఆరోపిస్తున్నాయి కదా? దీనికి ఏం సమాధానం చెబుతారు?
జవాబు: మా ప్రభుత్వం తెలంగాణకు అన్ని విధాలా మద్దతు పలికింది. ఇక ముందూ కొనసాగిస్తుంది. వృద్ధికి తెలంగాణలో విస్తృత అవకాశాలున్నప్పటికీ దాని పురోగతికి భారాస, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు బ్రేకులు వేశాయి. ఆ ప్రభుత్వాల వైఫల్యాల గురించి ప్రజలు నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపుతున్నాయి. తెలంగాణ ప్రజలు చాలా తెలివైనవారు. ఎయిమ్స్‌ బీబీనగర్‌, కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం, సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌ ఐఐటీలో మౌలిక వసతుల బలోపేతం, కాజీపేటలో వ్యాగన్ల తయారీ యూనిట్‌, రామగుండంలో ఎరువుల కర్మాగారం, ఎన్‌టీపీసీ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు, వరంగల్‌లో పీఎం మిత్ర పార్కు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమేనని తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా కల్పించి ప్రపంచ పటంలో పెట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదేనన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గ్రహించారు.

ప్రశ్న: తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసినా దాన్ని సాకారం చేసే విషయంలో ఆ తర్వాత చర్యలేమీ చేపట్టలేదు.ఈ విషయంలో ఏదైనా ముందడుగు ఆశించొచ్చా?
జవాబు: రైతులకు సాధికారత కల్పించడానికి మా ప్రభుత్వం తీసుకున్న ముఖ్య చర్యల్లో పసుపు బోర్డు ఒకటి. ప్రధాన కార్యాలయం ఖరారు దగ్గరి నుంచి అధికారుల గుర్తింపు వరకూ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా ఈ పనులపై కొంత ప్రభావం పడింది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లోనే పనులు ప్రారంభిస్తాం. దేశంలో పసుపు రంగానికి ప్రోత్సాహం, అభివృద్ధికి ఈ బోర్డు దోహదం చేస్తుంది. పరిశోధన, మార్కెట్‌ సౌకర్యాల అభివృద్ధి, వినియోగం పెంపు, విలువ జోడింపు లాంటి అంశాలపై ఈ బోర్డు పని చేస్తుంది.

ప్రశ్న: హైదరాబాద్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సాయం చేయబోతోంది? హైదరాబాద్‌-ముంబయి మధ్య హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ నిర్మాణ ప్రతిపాదన ఉంది. వీటిని సాకారం చేయడానికి ఏం చర్యలు తీసుకోబోతున్నారు?
జవాబు: తెలంగాణకు, భారత దేశానికి హైదరాబాద్‌ నగరం ఒక గ్రోత్‌ సెంటర్‌. మేం పట్టణీకరణను సమస్యగా కంటే అవకాశంగానే చూస్తున్నాం. హైదరాబాద్‌లో రద్దీని నివారించడానికి పలు రకాలుగా పని చేస్తున్నాం. 6 ముఖ్యమైన జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోంది. హైదరాబాద్‌ను అన్ని వైపులా స్పీడ్‌ కారిడార్లతో అనుసంధానం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పని చేస్తోంది. నగరంలోని అన్ని ప్రాంతాల వారికి సులభమైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి తేవడానికి ఎంఎంటీఎస్‌ నెట్‌వర్క్‌ను విస్తరిస్తాం. వందే భారత్‌ మెట్రో ప్రయోజనం పొందే నగరాల్లో హైదరాబాద్‌ ఉండబోతోంది.

హైదరాబాద్‌కు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌: ముంబయి- అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైల్‌ ప్రాజెక్టు త్వరలో పూర్తి కాబోతోంది. అలాంటి కారిడార్లు దేశంలో దక్షిణ, తూర్పు, ఉత్తర ప్రాంతాల్లో నిర్మిస్తామని మ్యానిఫెస్టోలో చెప్పాం. వివిధ గమ్య స్థానాలపై ఇప్పటికే రైల్వేశాఖ అధ్యయనం ప్రారంభించింది. దక్షిణాదిలో హైదరాబాద్‌ ముఖ్య నగరం కాబట్టి భవిష్యత్తులో హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ను కచ్చితంగా చూస్తుంది.