ప్రధాని మోదీ స్వస్థలంకు యునెస్కో వారసత్వ కట్టడంగా గుర్తింపు

దేశంలోని మరో మూడు చారిత్రక ప్రదేశాలను ప్రపంచ వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చేర్చుతూ యునెస్కో నిర్ణయం తీసుకున్నట్లు ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ)  వెల్లడించింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ జన్మించిన చారిత్రక నగరం వడ్‌నగర్, అద్భుతమైన శిల్పకళ ఉట్టిపడే మొఢేరా సూర్య దేవాలయం, ఈశాన్య రాష్ట్రాల ఆంగ్‌కర్‌వాట్‌గా పిలిచే త్రిపురలోని ఉనాకోటీ రాతి నిర్మాణాలు ఉన్నాయి.
ఈ మూడు ప్రదేశాల ఫోటోలను కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ట్వీట్‌‌లో షేర్ చేస్తూ అభినందనలు తెలిపారు.
‘‘వాద్‌నగర్ మునిసిపాలిటీ ఒక బహుళ-స్థాయి చారిత్రాత్మక పట్టణం.  దీని చరిత్ర దాదాపు క్రీ.పూ. 8వ శతాబ్దం వరకు విస్తరించి ఉంది. ఈ పట్టణం ఇప్పటికీ పెద్ద సంఖ్యలో చారిత్రక భవనాలను కలిగి ఉంది, అవి ప్రధానంగా మతపరమైన, నివాస స్వభావం కలిగి ఉన్నాయి’’ అని పేర్కొన్నారు.
వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాకు ఈ మూడు స్థలాలను ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం రెండు వారాల కిందట పంపిన నామినేషన్లను యునెస్కో ఆమోదించింది. వీటితో పాటు ఈ ఏడాదిలో ఇప్పటివరకు భారత్ నుంచి ఆరు చారిత్రక ప్రదేశాలకు వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చోటు దక్కడం విశేషం.

ఏపీ నుంచి అనంతపురానికి చెందిన లేపాక్షి ఆలయం కూడా ఇందులో ఉండటం విశేషం. మహారాష్ట్ర కొంకన్ ప్రాంతంలో నేలపై గీసిన పురాతన చిత్రాలు, మేఘాలయ రాష్ట్రంలో ప్రకృతి ద్వారా మన సంస్కృతిని తెలియజేసేలా జీవంతో ఉన్న చెట్ల వేర్లపై ఏర్పాటు చేసిన వంతెనలు ఈ జాబితాలో ఉన్నాయి.

గత ఏడాది మొత్తం ఆరు చారిత్రక ప్రదేశాలు వారసత్వ కట్టడాలకు తాత్కాలిక జాబితాలో చోటు దక్కింది. మొత్తంగా చూస్తే భారత్ నుంచి 52 ప్రదేశాలు యునెస్కో తాత్కాలిక జాబితాలో ఉన్నాయి. గతేడాది సాత్పురా టైగర్ రిజర్వ్, చారిత్రక నగరం వారణాసి, మెగాలిథిక్ స్మారక చిహ్నం హైరే బెంకాల్, మహారాష్ట్రలోని మరాఠా మిలటరీ నిర్మాణం, మధ్యప్రదేశ్‌లో నర్మదా లోయ వద్ద ఉన్న భేడాఘాట్-లామేటాఘాట్, తమిళనాడులోని కాంచీపురం ఆలయాలను యునెస్కో జాబితాకు సిఫార్సు చేశారు.

 
ఈ జాబితాలో ఉన్న ప్రాంతాల సంఖ్య భారతదేశం గొప్ప సాంస్కృతిక, సహజ సంపదను సూచిస్తుందని, మన వారసత్వంలోని భారీ వైవిధ్యాన్ని చూపుతుందని కిషన్ రెడ్డి తెలిపారు.