చైనా సరిహద్దులో భారత్‌ శరవేగంగా రోడ్లు, సొరంగాల నిర్మాణం

చైనా సరిహద్దులో భారత్‌  శరవేగంగా రోడ్లు, సొరంగాల నిర్మాణం

అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ ప్రాంతాన్ని టిబెట్‌లో భాగమని వాదిస్తున్న చైనా పదేపదే చొరబాట్లకు యత్నిస్తున్న వేళ  భారత్‌ పూర్తిగా అప్రమత్తమైంది. అంతేగాక భారత్‌తో సరిహద్దుల్లో చైనా వేగంగా మౌలిక సదుపాయాలను నిర్మిస్తోంది. ఏకంగా కొత్త కొత్త గ్రామాలను అక్కడ ఏర్పాటు చేస్తోంది. సైనిక అవసరాల కోసం వీటిన వినియోగించుకుంటోంది.

ఈ నేపథ్యంలో డ్రాగన్‌కు ఏమాత్రం తగ్గకుండా అరుణాచల్‌లో మౌలిక సదుపాయాలను వేగంగా కల్పిస్తోంది. డ్రాగన్‌ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా ఎదుర్కొనేందుకు వాస్తవాధీన రేఖ వద్ద భారీ ఎత్తున బలగాలను మోహరించిన భారత్‌  సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని వేగవంతం చేసింది.

పర్వతాలతో నిండిన అరుణాచల్‌ప్రదేశ్‌లో అతిశీతల వాతావరణ పరిస్థితులు ఎదురైనా ఏడాది పొడవునా రాకపోకలు సాగేలా రహదారులు, వంతెనలు, సొరంగ మార్గాలను భారత్‌ యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తోంది. చైనాతో సరిహద్దు కలిగిన అరుణాచల్‌ ప్రదేశ్‌లోని గ్రామాలను రహదారులతో అనుసంధానించనున్నారు.

బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ చీఫ్‌ ఇంజినీర్‌ వర్తక్‌ మీడియాతో మాట్లాడుతూ ”ఇక్కడి భూభాగం చాలా క్లిష్టతరంగా ఉంటుంది. పర్వతాలు ఎక్కువగా ఉంటాయి. సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఇక్కడి భూభాగం ఉంటుంది. పర్వతాలు, వాతావరణ పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉంటాయి. ఇలాంటి కఠిన వాతావరణ పరిస్థితుల్లో రోడ్ల నిర్మాణం కోసం సరిహద్దు రహదారుల సంస్థ నిరంతరం పనిచేస్తోంది” అని తెలిపారు.

“ఇక్కడి కొన్ని గ్రామాలు మారుమూల ప్రాంతాల్లో ఉంటాయి. అలాంటి మారుమూల ప్రాంతాలకు కూడా మేము రోడ్లు వేస్తున్నాం. తద్వారా పశ్చిమ అరుణాచల్‌లో అన్ని ప్రాంతాలు అభివృద్ధి అయ్యేలా చూస్తాం” అని పేర్కొన్నారు. చైనాతో సరిహద్దు కలిగిన ప్రాంతాల్లో భారీ ఎత్తున మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను భారత్‌ చేపట్టింది.

అరుణాచల్‌లోని చైనాతో సరిహద్దు కలిగిన అన్ని గ్రామాలను రోడ్లతో అనుసంధానించాలని కోరుకుంటోంది. శీతాకాలంలో రోడ్లు మంచుతో కప్పుకుపోయే చోట్ల సొరంగ మార్గాలను నిర్మిస్తోంది. కీలకమైన సచిఫు సొరంగ మార్గం త్వరలోనే అందుబాటులోకి రానుంది. సేలా పాస్‌ సొరంగం కూడా వచ్చే ఏడాది జులై కల్లా పూర్తికానుంది.

సేలా టన్నెల్‌ ప్రాజెక్టులో భాగంగా రెండు జంట సొరంగ మార్గాలను నిర్మిస్తున్నారు. సొరంగ మార్గాల్లో 24గంటలూ పని జరుగుతోంది. ఆరుగంటలకు ఒక షిఫ్ట్‌ చొప్పున నాలుగు షిఫ్టుల్లో పని చేస్తున్నారు. మరో ఆరు నెలల్లో సేలా పాస్‌ సొరంగాన్ని పూర్తి చేసి ప్రజా రవాణా కోసం ప్రారంభిస్తామని బీఆర్‌వో చీఫ్‌ ఇంజినీర్‌ వర్తక్‌ వివరించారు.

మరోవంక, చైనాతో కొనసాగుతున్న సరిహద్దు వివాదం మధ్య భారత్‌ సైన్యం వ్యూహాత్మక కార్యకలాపాల కోసం తొలిసారిగా బాలిస్టిక్‌ క్షిపణిని చేర్చబోతున్నది. ఎల్‌ఏసీపై ప్రళయ్‌ బాలిస్టిక్‌ క్షిపణిని మోహరించాలని సైన్యం నిర్ణయించింది.