రూ. 2000 నోట్లను దశలవారీగా రద్దు చేయాలి

రూ. 2000 నోట్లను దశలవారీగా రద్దు చేయాలని బిజెపి ఎంపీ సుశీల్ కుమార్ మోడీ సోమవారం రాజ్యసభలో డిమాండ్ చేశారు. అలాంటి నోట్లను కలిగిన వారు బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు రెండేళ్ల గడువు ఇవ్వాలని కూడా సూచించారు. జీరో హావర్ లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు.

చాలా ఏటిఎంలలో రూ. 2000 కనిపించకుండా పోయాయని చెబుతూ అవి ఇక చెల్లుబాటు కావన్న వదంతులు కూడా దేశంలో వ్యాపిస్తున్నాయని పేర్కొన్నారు. “ప్రభుత్వం దీనిపై ఓ స్పష్టత ఇవ్వాలి”అని కోరారు. అంతేకాక ఆర్‌బిఐ మూడేళ్ల కిందటే రూ. 2000 నోట్లను ముద్రించడం ఆపేసిందని కూడా తెలిపారు.

ప్రభుత్వం నోట్ల రద్దు (డీమానిటైజేషన్) ప్రకటించి నాడు రాత్రికి రాత్రే పాత రూ.500, రూ. 1000 నోట్లను రద్దు చేసింది. ఆ తర్వాత రూ. 500, రూ. 2000 కొత్త నోట్లను ప్రచురించింది. “రూ. 1000 నోట్లను రద్దు చేసి, రూ. 2000 నోట్లను చలామణిలోకి తేవడంలో లాజికే లేదు” అని సుశీల్ కుమార్ మోడీ చెప్పారు.

అభివృద్ధి చెందిన దేశాలలో సైతం పెద్ద నోట్లు (హయ్యర్ డినామినేషన్ నోట్లు) లేవన్న ఉదాహరణలను ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు. రూ. 2000 నోట్లను అక్రమంగా దాపెట్టడానికి, మాదకద్రవ్యాలు వంటి అక్రమ వ్యాపారాలు చేయడానికి, మనీ లాండరింగ్‌కు ఉపయోగిస్తున్నారని ఆయన తెలిపారు.

దేశంలో రూ. 2000 అత్యధిక డినామినేషన్ నోటని చెబుతూ అది ఎక్కువ వరకు నల్ల ధనంగా వాడుకునేందుకు ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. ఆయన ఇదివరలో బీహార్  ఉపముఖ్యమంత్రిగా,ఆర్ధిక మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశారు.