చమురు దిగుమతులలో ఐరోపా ధోరణిపై భారత్ ఆగ్రహం 

రష్యా నుండి భారతదేశం చమురు దిగుమతులను సమర్ధిస్తూ ఈ విషయంలో ఐరోపా దేశాలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాల పట్ల విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  జర్మనీ విదేశాంగ మంత్రి   అన్నాలెనా బేర్‌బాక్‌తో సమావేశమయ్యాక మాట్లాడుతూ రష్యా నుంచి భారత్‌ కంటే ఈయూ 6 రెట్లు అధికంగా చమురును దిగుమతి చేసుకున్నదని గుర్తు చేశారు.
ఐరోపా తన ఇంధన అవసరాలకు ప్రాధాన్యతనిచ్చి భారతదేశాన్ని మరేదో  చేయమని కోరుతోందని పేర్కొంటూ  దానికి ఎంపిక చేసే హక్కు లేదని డాక్టర్  జైశంకర్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభానికి చాలా ముందే భారత్, రష్యా మధ్య వాణిజ్యాన్ని విస్తరించే చర్చలు ప్రారంభమయ్యాయని ఆయన గుర్తు చేసారు.
 “ఐరోపాకు ఒక దృక్కోణం ఉంది , వారు ఎంచుకుంటారు, అది ఐరోపా  హక్కు. కానీ ఐరోపా తన అవసరాలకు ప్రాధాన్యతనిచ్చి,  భారత్‌ను మాత్రం ఇంకేదో  చేయమని అడుగుతోంది. ఇది ఆమోదయోగ్యం కాదు” అని తేల్చి చెప్పారు.
 “మొదట మనం వాస్తవాలను చాలా స్పష్టంగా చూడాలని నేను భావిస్తున్నాను. ఫిబ్రవరి 24 నుండి నవంబర్ 17 మధ్య, ఐరోపా యూనియన్ రష్యా నుండి  10 దేశాల కంటే ఎక్కువ శిలాజ ఇంధనాన్ని దిగుమతి చేసుకుంది.  ఐరోపాయూనియన్ చమురు దిగుమతి భారతదేశం దిగుమతి చేసుకున్న దానికంటే ఆరు రెట్లు ఎక్కువ” అని తెలిపారు.
ఐరోపా యూనియన్ 50 బిలియన్ల యూరోల విలువైన (గ్యాస్) దిగుమతి చేసుకుందని చెబుతూ   మధ్యప్రాచ్యం    నుంచి క్రూడాయిల్ కొనుగోలు కూడా ధరలపై ఒత్తిడి తెస్తోందని డాక్టర్ జైశంకర్ చెప్పారు. మధ్యప్రాచ్యం నుండి  ముడి చమురు చాలా కొనుగోలు చేసినందుకు ఐరోపాను  జైశంకర్ నిందించారు. “సాంప్రదాయకంగా మధ్యప్రాచ్యం భారతదేశం వంటి ఆర్థిక వ్యవస్థకు సరఫరాదారు” అని ఆయన పేర్కొన్నారు.