విమానాల్లో తరచూ ప్రయాణించే వారికి సెక్యూరిటీ చెకింగ్, ఇతర ప్రాసెస్లు పూర్తి కావడానికి కొన్ని సందర్భాల్లో విమాన ప్రయాణ సమయం కంటే ఎక్కువ సమయం అవుతుంది. దీంతో స్వదేశీ విమాన ప్రయాణికులకు ఈ పక్రియను సులభతరం చేయడం కోసం ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తోపాటు, బెంగళూరు, వారణాసి విమానాశ్రయాలు డిజియాత్ర సేవలను ప్రారంభించారు.
దీని ద్వారా దేశీయ ప్రయాణికులు డిజిటల్గా చెక్-ఇన్ చేసుకోవచ్చు. ఈ యాప్తో పేపర్లెస్గా ప్రాసెస్ పూర్తవుతుంది. డిజియాత్ర ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ఆధారంగా ప్రయాణికులను అనుమతిస్తుంది. దీంతో ప్రయాణికులకు చాలా సమయం ఆదా అవుతుంది. గురువారం పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దేశ రాజధానిలోని విమానాశ్రయంలో డిజియాత్ర సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఆధారంగా బయోమెట్రిక్ ఎనేబుల్డ్ డిజియాత్ర సురక్షితమైన, సౌకర్యవంతమైన ట్రావెల్ ఎక్స్పీరియన్స్ను అందిస్తుందని భారత ప్రభుత్వ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. డిజియాత్ర ద్వారా విమానాశ్రయాలలో ప్రయాణీకులకు పేపర్లెస్ ప్రవేశం లభిస్తుంది.
సెక్యూరిటీ చెక్ సహా వివిధ చెక్పోస్టుల వద్ద ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ఆధారంగా ప్రయాణీకుల డేటా ఆటోమేటిక్గా ప్రాసెస్ అవుతుంది. ఢిల్లీతో పాటు బెంగళూరు, వారణాసి విమానాశ్రయాల్లో కూడా ఈరోజు డిజియాత్ర సేవలు అందుబాటులోకి రానున్నాయి.
డిజియాత్ర సర్వీస్ను విమానాశ్రయాలలో బోర్డింగ్ ప్రాసెస్ను వేగంగా, ఎలాంటి అంతరాయాలు లేకుండా నిర్వహించే లక్ష్యంతో రూపొందించారు. ఈ సర్వీస్ను పొందేందుకు, విమాన ప్రయాణికులు డిజియాత్ర యాప్లో తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
వారు ఆధార్ బేస్డ్ వ్యాలిడేషన్, సెల్ఫ్ ఇమేజ్ క్యాప్చర్ని ఉపయోగించడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయవచ్చు. ఇది పూర్తయిన తర్వాత బోర్డింగ్ పాస్ను స్కాన్ చేయాల్సి ఉంటుంది, ఆ వివరాలు సంబంధిత విమానాశ్రయానికి షేర్ అవుతాయి.
ఆ తర్వాత విమానాశ్రయం ఇ-గేట్ వద్ద, ప్రయాణీకుడు మొదట బార్-కోడెడ్ బోర్డింగ్ పాస్ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఇ-గేట్ వద్ద ఇన్స్టాల్ చేసిన ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ప్రయాణికుడి ఐడెంటిటీ, ట్రావెల్ డాక్యుమెంట్ని ధృవీకరిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, ప్రయాణీకుడు ఇ-గేట్ ద్వారా విమానాశ్రయంలోకి ప్రవేశించవచ్చు.
డిజి యాత్ర ఫౌండేషన్ అనేది లాభాపేక్ష లేని సంస్థ. ఇది డిజియాత్రకు నోడల్ బాడీ. ఫౌండేషన్ వాటాదారులుగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ఉన్నాయి.
More Stories
కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల తర్వాత పెరిగిన బీజేపీ గ్రాఫ్
వీవీప్యాట్లపై పిటిషన్లను కొట్టేసిన సుప్రీం కోర్టు
ఇందిరా ఆస్తి పోవద్దనే వారసత్వపు పన్ను రద్దు