కరోనా టీకా మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించదు

కరోనా రక్షక టీకా తీసుకున్న తర్వాత ఏవైనా తీవ్ర దుష్ప్రభావాలు ఎదురైతే అందుకు తమ బాధ్యత ఉండబోదని సుప్రీంకోర్టు నకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా టీకా తీసుకున్న వ్యక్తి మరణించినట్లయితే సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి పరిహారం కోరడమే మార్గమని పేర్కొంది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది.
 
కరోనా వ్యాక్సినేషన్‌ను ప్రజాప్రయోజనాల దృష్టా ప్రభుత్వం ప్రోత్సహించిందని, టీకాలు వేయడానికి చట్టపరమైన బలవంతం ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. గతేడాది కరోనా టీకా తీసుకున్న అనంతరం ఇద్దరు వేర్వేరు యవతులు మరణించారు. దీంతో వారి తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
 
దీనికి స్పందనగా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. కరోనా టీకాలు తీసుకున్న అనంతరం చోటు చేసుకున్న మరణాలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని పిటిషనర్లు కోరారు. టీకాలు తీసుకున్న తర్వాత తీవ్ర దుష్ప్రభావాలు ఎదురైతే వెంటనే గుర్తించి సత్వర చికిత్స అందించే ప్రోటోకాల్ కోసం డిమాండ్ చేశారు. ఈ మరణాలు కరోనా టీకాల వల్లేనని ఈ ఒక్క కేసులోనే నేషనల్ ఏఈఎఫ్ఐ కమిటీ గుర్తించినట్టు పేర్కొంది. జరిగిన నష్టంపై సివిల్ కోర్టును ఆశ్రయించి, పరిహారం కోరే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. ఇది విషాదకరమైనా ప్రభుత్వం మరణాలకు బాధ్యత వహించదని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
 
అర్హులైన వ్యక్తులు టీకా వేసుకునేలా ప్రభుత్వం ప్రోత్సహించిందని, అయితే దానికి ఎలాంటి చట్టపరమైన బలవంతం లేదని అఫిడవిట్‌లో పేర్కొంది.  ప్రతి వ్యాక్సిన్‌కు ఇమ్యునైజేషన్ అనుసరించే ప్రతికూల సంఘటనలు నివేదించబడుతున్నాయని, వ్యాక్సిన్లు థర్డ్‌ పార్టీలతో తయారవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు.
 
 కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించిన సమాచారం పబ్లిక్‌ డొమైన్‌లో ఉచితంగా అందుబాటులో ఉందని కోర్టుకు తెలిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల నష్ట పరిహారం డిమాండ్‌ను ఆరోగ్య మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది.  వ్యాక్సినేషన్‌ ప్రతికూల ప్రభావాలతో వ్యక్తి శారీరకంగా గాయమైనా, మరణించినా చట్టప్రకారం అతని కుటుంబం పరిహారం కోరుతూ సివిల్‌ కోర్టులో దావా వేయొచ్చని. నిర్లక్ష్యానికి సంబంధించిన కేసుల వారీగా కేసు నమోదు చేయవచ్చని అఫిడవిట్ పేర్కొంది.

పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కొలిన్ గోన్సాల్వేస్ వాదనలు వినిపిస్తూ వ్యాక్సిన్‌తో కలిగే నష్టాలను ముందుగానే తెలియజేసి సమ్మతి తీసుకుని ఉంటే ఈ మరణాలు సంభవించి ఉండేవి కావని పేర్కొన్నారు. అయితే, వ్యాక్సిన్లు, మందులను స్వచ్ఛందంగా వాడేందుకు ‘సమ్మతి’ అనే ప్రశ్న వర్తించదని, మోతాకు సంబంధించి ప్రతికూల ప్రభావాలు స్వల్పంగా ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది.

ఈ నెల 19 వరకు దేశంలో 219.86కోట్ల డోసులు ఇవ్వగా,  వీటిలో 92,114 ప్రతికూల ప్రభావాల కేసులు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది. ఇదిలా ఉండగా, ఓ బాలిక గతేడాది 29న కోవిషీల్డ్‌ మొదటి డోసు తీసుకున్న తర్వాత జూన్‌ 19న మరణించింది. మరో ఎంఎస్సీ విద్యార్థిని గత ఏడాది జూన్‌ 18న కొవిషీల్డ్‌ మొదటి డోసు తీసుకోగా.. జూలై 10న కన్నుమూసింది.