ఐటీ దాడులపై మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలను ఖండించిన రఘునందన్

తనతో పాటు తన కుటుంభం సభ్యులు, సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు రెండు రోజులుగా జరుపుతున్న సోదాల వెనుక రాజకీయ కుట్ర ఉన్నదని అంటూ తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేసిన ఆరోపణలను బిజెపి ఎమ్యెల్యే ఎన్ రఘునందన్ రావు తీవ్రంగా ఖండించారు.
 
కక్ష సాధింపులో భాగంగానే ఐటీ దాడులు చేస్తున్నారని మల్లారెడ్డి చెప్పడం సరికాదన్న ఆయన సాక్ష్యాల ఆధారంగానే అధికారులు విచారణ జరుపుతారని స్పష్టం చేశారు. కొడుకును కొట్టారంటూ మల్లారెడ్డి ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. మల్లారెడ్డి ఫోన్లు దాచిపెట్టుకున్నారంటేనే ఏదో జరిగిందని అర్థమవుతోందని రఘునందన్ అభిప్రాయపడ్డారు.
 
ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే సరిపోతుందని చెప్పారు. మల్లారెడ్డి తప్పు చేయనప్పుడు విచారణకు ఎందుకు భయపడుతున్నారని రఘునందన్ ప్రశ్నించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, అధికారం అడ్డుపెట్టుకుని తప్పు చేసిన వారే భయపడతారని తెలిపారు.
 
నోటీసులు ఇవ్వగానే గుండెనొప్పులు వస్తున్నాయా? అని రఘునందన్‌రావు ప్రశ్నించారు. మంత్రి మల్లారెడ్డికి సన్నిహితంగా ఉన్నవారే ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చి ఉంటారని ఆయన చెప్పారు. అధికారం అండతో అక్రమంగా సంపాదించుకున్నవారిపైనే దాడులు జరుగుతాయని పేర్కొన్నారు. మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కేసీఆర్‌ పాలన ఉందని ఎమ్మెల్యే రఘునందన్‌రావు విమర్శించారు.