గొల్ల కురుమల కోసం పోరుబాట పట్టిన బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం గొల్లకురుమలను మోసం చేసిందంటూ బీజేపీ ఆధ్వర్యంలో మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి కోమటిరెడ్డి పూలమాలవేసి, వినతి పత్రం అందజేశారు. రెండు గంటలకు పైగా రోడ్డుపై బైఠాయించారు.
మునుగోడు ఉపఎన్నికలో గెలిచేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం గొల్లకురుమల బ్యాంకు ఖాతాల్లో జమచేసిన డబ్బులను వెనక్కి తీసుకుందంటూ ఆరోపించారు. ధర్నాలో గొల్ల కురుమలు, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే ధర్నా చేస్తున్న రాజగోపాల్ రెడ్డిని తీవ్ర ఉద్రిక్తతల మధ్య అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు.
బీజేపీ కార్యకర్తలు, గొల్ల కురుమలు రాజగోపాల్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా.. పోలీసుల కార్ల ముందు బైఠాయించే ప్రయత్నం చేశారు. తోపులాట, ఉద్రిక్తల మధ్య రాజగోపాల్ రెడ్డిని మునుగోడు పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మునుగోడు ఎన్నికలో గెలుపు కోసం సీఎం కేసీఆర్ ఎన్ని కుట్రలు చేశారో అందరికీ తెలుసని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా విమర్శించారు. గొల్లకురుమ సోదరులను మోసం చేసినందుకు పోరుబాట మొదలు పెట్టామని చెప్పారు. గొల్ల కురుమ సోదరులకు గొర్ల కోసం డబ్బులు ఇస్తున్నామని.. 7,540 మంది అకౌంట్లో డబ్బులు వేశారని గుర్తుచేశారు.
అయితే అకౌంట్లో డబ్బులు వేసినట్టే వేసి ఫ్రీజ్ చేశారని ఆరోపించారు. గొల్ల కురుమ సోదరుల అనుమతి లేకుండా అకౌంటు ఎలా ఫ్రీజ్ చేస్తారని ప్రశ్నించారు. ఫ్రీజ్ చేసిన మొత్తం డబ్బులను విడుదల చేయాలని పోరుబాట ద్వారా డిమాండ్ చేస్తున్నామని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. డబ్బులు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాలుగు లక్షల మందితో ప్రగతి భవన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. అలాగే, దళితబంధు హామీ ఇచ్చేంతవరకు తమ పోరు ఆగదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
More Stories
పత్తాలేని బిఆర్ఎస్…కాంగ్రెస్కు ఓటమి ఖాయం
మేడిగడ్డను పరిశీలించిన జస్టిస్ ఘోష్
మొట్టమొదటిసారి ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు తీసేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే