బీజేపీ ఎదుగుదల చూసి ఓర్వలేకనే టిఆర్ఎస్ విషప్రచారం

తెలంగాణలో బీజేపీ  ఎదుగుదల చూసి  టిఆర్ఎస్ నేతలు  ఓర్వలేకనే విషప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. తన నియోజకవర్గంలో జరిగే అధికారిక కార్యక్రమాలకే పిలవకుండా అవమానిస్తూ ఇప్పుడు ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా  ప్రొటోకాల్ గురించి టీఆర్ఎస్ నేతలు మాట్లాడ్డం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
 
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనతో టీఆర్ఎస్ ఇరకాటంలో పడిందని, అందుకే ఆత్మరక్షణ ధోరణి అవలంబిస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. కమ్యూనిస్టులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తోందని, అయితే ఇటు రాష్ట్రంలో అటు దేశంలో కమ్యూనిస్టుల చరిత్ర ముగిసిపోయిందని గుర్తు చేశారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీయే కమ్యూనిస్టుల కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు సహా అనుబంధ సంఘాలన్నింటినీ ఆక్రమించుకుందని, అయినా సిగ్గులేకుండా టీఆర్ఎస్ పంచన చేరిన కమ్యూనిస్టులు బీజేపీని విమర్శించడం సిగ్గుచేటని మండిపడ్డారు.
 
తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అయితే, ఇందులో భాగంగా చేపడుతున్న అనేక మౌలిక వసతుల కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. `ఈ ఫ్యాక్టరీ వల్ల మన యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మన రైతులకు యూరియా అందుబాటులోకి వస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మన తెలంగాణ ముఖచిత్రమే మారిపోతుంది’ అని కిషన్ రెడ్డి తెలిపారు.
 
 ఇలాంటి తెలంగాణ కల్పతరువైన ఫ్యాక్టరీ విషయంలో టీఆర్ఎస్, వారి మిత్ర పక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం చేస్తున్న కృషికి సహకరించాల్సిందిపోయి అర్థరహితమైన విమర్శలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు.

ఇకనైనా రాజకీయాలు పక్కనపెట్టి ముఖ్యమంత్రి నవంబర్ 12 నాటి కార్యక్రమానికి హాజరు కావాలని కిషన్ రెడ్డి కోరారు. రాజకీయాల్లో పట్టువిడుపులు సహజమేనని, తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం తన హుందాతనాన్ని నిలుపుకోవాలని హితవు చెప్పారు. ప్రధానమంత్రి పార్టీ సంబంధిత కార్యక్రమానికి వస్తుంటే నిరసన తెలిపినా అర్థం ఉంటుందని, తెలంగాణ పురోగతికి సంబంధించిన ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తుంటే ఉత్సాహంగా పాల్గొనాల్సింది పోయి విమర్శలు చేయడం సరికాదని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి ఘర్షణాత్మకమైన వ్యవహారశైలి వల్ల తెలంగాణకు నష్టమే తప్ప లాభం జరగదని పేర్కొంటూ మొండి వాదన, వితండ వాదన వల్ల.. సాధించేది ఏమీ ఉండదని కిషన్ రెడ్డి హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితులు తొలగిపోయి తెలంగాణ అభివృద్ధి బాటలు పట్టాలంటే.. మన రాష్ట్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కారు ఉండాల్సిన అవసరం ఉందని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణ సమన్వయంతో పనిచేసినపుడు పురోగతి సాధ్యమవుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

రాజకీయాల్లో సిద్ధాంతపరమైన వైరుధ్యాలు సహజమేనని.. కానీ దేశం, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వీటిని పక్కనబెట్టి పనిచేయాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వారు విజ్ఞతతో ఆలోచిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి వచ్చినా, కేంద్ర మంత్రులు వచ్చినా, గవర్నర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించడం లేని విషయం వాస్తవమా? కాదా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.