బిజెపి కొనుగోలుకు బేరం ఆడుతున్నట్లుగా ప్రచారం చేస్తున్న నలుగురు ఎమ్యెల్యేలు అప్పటి నుండి ప్రగతి భవన్ కే పరిమితం కావడం విస్మయం కలిగిస్తోంది. ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి అక్కడే ఉండడం, మీడియాను తప్పించుకొనే ప్రయత్నం చేయడం చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై సీఎం కేసీఆర్ ప్రెస్మీట్ నిర్వహించబోతున్నట్టు శుక్రవారం ఉదయం ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. తాను ప్రగతి భవన్లో ఉన్న ఫొటోను తన సన్నిహితులకు పంపారు. ‘బీజేపీ బాగోతం బాగా ఉంది.. వన్ బై వన్ వస్తాయి’ అంటూ మరో పోస్ట్ పెట్టారు.
ఈ నలుగురు ఎమ్మెల్యేలు మరికొన్ని రోజులు ప్రగతి భవన్లోనే ఉంటారని టీఆర్ఎస్ ముఖ్య నేతలు చెప్తున్నారు. వాళ్లు ప్రగతి భవన్లోనే ఉన్నా, కేసీఆర్ వారితో మాట్లాడలేదని, వారి నుంచి వివరాలన్నీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు సేకరించి కేసీఆర్కు వివరిస్తున్నారని చెప్తున్నారు.
రామచంద్ర భారతితో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడినట్టుగా చెప్తున్న ఆడియోలో ఎక్కడా కేసుల ప్రస్తావన లేదు. బీజేపీలో చేరకుంటే ఈడీ, ఇతర సంస్థలతో దాడులు చేయిస్తామన్న మాటే లేదు. అయినా రోహిత్ తనకు డబ్బులిస్తామని చెప్పారని, తాను బీజేపీలో చేరకుంటే ఈడీ దాడులు చేయిస్తామని బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈనెల 26న ఫామ్హౌస్లో కొనుగోళ్ల డీల్ జరిగినట్టు చెప్తున్నా, అంత వరకు దీనిపై రోహిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. 24కు ముందే ఆయన రామచంద్ర భారతితో ఫోన్లో మాట్లాడినప్పుడు తనను ప్రలోభ పెడుతున్న విషయం ఎందుకు ఫిర్యాదు చేయలేదనేది సందేహాస్పదంగా మారింది.
మరో ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ మారడానికే రోహిత్ సిద్ధపడ్డారా? అందుకే నందుతో కలిసి బేరసారాలకు దిగారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫామ్హౌస్ ఎపిసోడ్లో ఆడియో ఎవిడెన్స్ ఉందని చెప్తున్నా వాటిని ఎందుకు కోర్టుకు సమర్పించలేదు? అవే ఆడియో ఫైల్స్ను ప్రగతి భవన్ మీడియాకు విడుదల చేయడానికి వెనుక కారణలేమిటనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ప్రగతి భవన్ నుండే ఆడియో రికార్డులు బయటికి వచ్చిన నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ గురించి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయా? అన్న సందేహాలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రగతి భవన్ నుంచే ఫామ్ హౌస్ ఎపిసోడ్కు సంబంధించిన ఆడియో లీక్స్ రావడం ట్యాంపింగ్ల ఆరోపణలకు బలం చేకూరుస్తున్నది. మొయినాబాద్ ఫామ్హౌస్లో నందకుమార్తో పాటు రామచంద్రభారతి, సింహయాజీల ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు.
వారి ఫోన్లలో ఉన్న రికార్డింగులనే ప్రగతి భవన్ నుంచి లీక్ చేశారా? లేక రాష్ట్రంలో ప్రముఖులందరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయా? అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర పార్టీల నాయకులు, కీలక అధికారులు, పలువురు మీడియా ప్రతినిధుల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని ప్రచారం ఉంది.
ఆడియో టేప్లను కోర్టుకు ఎందుకివ్వలేదు?
ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ సంభాషణలు అంటూ లీక్ చేసిన ఆడియో టేప్లను కోర్టుకు ఎందుకియ్యలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ‘‘ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులే దొంగలు.. మునుగోడులో టీఆర్ఎస్ ఓడిపోతుందని కేసీఆర్కు అర్థమైంది. అందుకే ఈ డ్రామా” అని ఆయన ధ్వజమెత్తారు.
శుక్రవారం లీక్ చేసిన ఆడియోలు అట్టర్ ఫ్లాప్ సినిమాకు ఐటమ్ సాంగ్ లాగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. అవి నిజమైనవే అయితే స్వయంగా కేసీఆర్ రిలీజ్ చేయొచ్చు కదా? ఈ లీకులెందుకు? అని నిలదీశారు. ఈ స్కామ్ బయటపడినప్పుడు పోలీస్ కమిషనర్ రూ.100 కోట్ల డీల్అని అందులో రూ.15 కోట్లు సీజ్ చేసినట్లు చెప్పారు.
ఆ సొమ్ము ఏమైందని, ఏసీబీ కోర్టులో ఎందుకు సమర్పించలేదని సంజయ్ ప్రశ్నించారు. ఆడియో రికార్డుల తయారీకి 3 రోజుల టైం పట్టిందని ఎద్దేవా చేశారు. సంజయ్ యాదగిరిగుట్టలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి వచ్చి, తడిబట్టలతో స్వామి వారి ఆలయం గర్భగుడిలోకి వెళ్లి ‘ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీకి ఎలాంటి ప్రమేయం లేదు’ అని ప్రమాణం చేశారు.
More Stories
ఉగ్రవాదంపై సరళంగా వ్యవహరించే ప్రభుత్వం కోరుకొంటున్న టిఎంసి
రేవంత్రెడ్డి, కేసీఆర్ వీణా వాణిలాగా అవిభక్త కవలలు
చదువుల్ని లోకకల్యాణం కోసం ఉపయోగించాలి