18 లక్షల ఎకరాల ఆక్రమణకు ధరణి పోర్టల్ దేశంలోనే పెద్ద స్కాం 

‘‘ధరణి పోర్టల్ దేశంలోనే పెద్ద స్కాం. ‘ధరణి’ వచ్చాక 24 లక్షల ఎకరాల భూములను హోల్డ్ చేశారు.. 6 లక్షల ఎకరాలను హోల్డ్ చేసి, డబ్బులు తీసుకున్నాక రిలీజ్ చేశారు. 18 లక్షల కోట్ల విలువైన భూములు కేసీఆర్ కుటుంబం చేతిలో ఉన్నాయి’’ అని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.

వేలాది ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టారని, డబ్బులిస్తేనే నిషేధిత జాబితా నుంచి తీసేస్తున్నరని చెబుతూ  సీఎం కేసీఆర్ కుటుంబం 18 లక్షల ఎకరాలను ఆక్రమించుకోవడానికే ధరణి పోర్టల్ ను తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. నిషేధిత జాబితాలోని భూములపై రాష్ట్ర సర్కారు శ్వేతపత్రం రిలీజ్ చేయాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.

‘‘ధరణి పోర్టల్ ను ఐఎల్ఎఫ్ఎస్ అనే ప్రైవేటు సంస్థ నిర్వహిస్తోంది. వాళ్ల చెప్పుచేతల్లో ధరణి పోర్టల్ నడుస్తోంది. భూములన్నీ వాళ్ల కంట్రోల్ లోనే ఉన్నాయి. ఇది రూ.18 లక్షల కోట్ల విలువైన స్కామ్. సామాన్యులకు, తెలంగాణ ప్రజలకు తెలియకుండా ఈ స్కాం చేస్తున్నరు’’ అని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు.

కేసీఆర్ కుటుంబం చేతిలో ఉన్న భూములపై సీబీఐ దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. దీనిపై గవర్నర్ తమిళిసైకి వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రి, కేంద్ర దర్యాప్తు సంస్థల దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పారు.

‘‘కేసీఆర్ 2013లో తనకు 60 ఎకరాలు ఉన్నట్లు చెప్పారు.. కానీ ప్రస్తుతం ఫామ్ హౌస్ సహా దాదాపు 600 ఎకరాలు కేసీఆర్ బినామీల పేరిట ఉన్నాయి’’ అని బిజెపి అభ్యర్థి ఆరోపించారు. ‘‘కేటీఆర్ కు జన్వాడలో ఫామ్ హౌస్ ఎక్కడిది? వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినయ్? అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థలు బయటికి తీసుకొస్తయి.. వాళ్లు జైలుకు పోక తప్పదు’’ అని రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు.

కాగా, టీఆర్ఎస్ కు చెందిన 86 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు వచ్చి మునుగోడులో ధన ప్రవాహం చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. ‘‘కాషాయ కండువా కప్పుకున్న వాళ్లను బెదిరిస్తున్నారు. ఇది ధర్మ యుద్ధం.. మునుగోడు ప్రజలకు కేసీఆర్ కుటుంబానికి మధ్య ఈ యుద్ధం జరుగుతోంది’’ అని ఆయన తెలిపారు. 2009 నుంచి ఇప్పటివరకు తాను అధికారంలో లేకున్నా అసెంబ్లీలో, బయట ప్రజల కోసం పొట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు.

కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయానని తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నరని ఆయన  ఆవేదన వ్యక్తం చేశారు. అవన్నీ నిరాధార ఆరోపణలని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సీమాంధ్ర పెట్టుబడిదారులకు అప్పనంగా కేసీఆర్ సర్కారు లక్షల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చిందని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద జరిగిన దోపిడీ బయటికి రావాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. వేల కోట్లు ఖర్చు పెట్టినా మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు. 

ఇలా  ఉండగా, సీఎం కేసీఆర్ ఓట్ల కోసమే బీసీలకు సరికొత్త సంక్షేమ పథకాలు అమలుచేస్తానని హామీలిస్తున్నాడని మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి విమర్శించారు. ముఖ్యమంత్రికి తన కుటుంబం, ఓట్ల మీదున్న ప్రేమ ప్రజల మీద లేదని విమర్శించారు. ఈ ఉపఎన్నిక కేసీఆర్కు గుణపాఠం కావాలన్న ఆయన మునుగోడులో మార్పు వస్తేనే తెలంగాణలో మార్పు వస్తుందని తెలిపారు.