అసెంబ్లీ నుండి ఈటెలను కాదు, కేసీఆర్ ను సస్పెండ్ చేయాలి!

బిజెపి ఎమ్యెల్యే ఈటెల రాజేందర్ ను రాష్ట్ర శాసనసభ నుండి స్పీకర్ సస్పెండ్ చేయడం పట్ల కేంద్ర మంత్రి జి కృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ నియమాలకు విరుద్ధంగా మాట్లాడిన మీరు ఎవరినైనా శాసనసభలో సస్పెండ్ చేయాలి అంటే స్పీకర్ ముందుగా సస్పెండ్ చేయవలసింది గౌరవ ముఖ్యమంత్రిని అని గుర్తు చేశారు. 
‘‘మరమనిషి అనే ఒక సాధారణ పదాన్ని ఈటల వాడితే.. దాన్ని అన్ పార్లమెంటేరియన్ పదంగా పరిగణించడం సరికాదు. ఎన్నో అన్ పార్లమెంటేరియన్ పదాలను సీఎం కేసీఆర్ వాడితే అమృత పదాలుగా పరిగణిస్తున్నారు. ఈటల రాజేందర్ నుంచో, బండి సంజయ్ నుంచో ఏవైనా పదాలు వస్తే మాత్రం అన్ పార్లమెంటేరియన్ గా ముద్రవేసే దుష్ట  యత్నంలో కేసీఆర్ సర్కారు ఉంది” అంటూ ధ్వజమెత్తారు. 
 
రాష్ట్ర శాసనసభలో ప్రధాన మంత్రి మోదీని `ఫాసిస్ట్’ అని మాట్లాడిన ముఖ్యమంత్రిపై స్పీకర్ ముందుగా చర్య తీసుకోవాలని హితవు చెప్పారు. కేవలం సస్పెండ్ చేయడమే కాకుండా, కేసీఆర్ శాసన సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని చెప్పారు.  
శాసనసభ సంప్రదాయాలకు వ్యతిరేకంగా, ఓ ప్రధాన మంత్రి పట్ల అటువంటి అనుచిత భాష ఉపయోగించిన ముఖ్యమంత్రి ఈటెల రాజేందర్ పట్ల వ్యవహరిస్తున్న తీరుతెన్నుల పట్ల కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 శాసనసభలో ఈటెల ముఖం చూడడానికి ఇష్టం లేకపోతే, ఈటెల మాట్లాడుతున్నప్పుడు శాసనసభలో కూర్చోవడానికి ఇష్టం లేకపోతే కేసీఆర్ సభ నుంచి బైటకు వెళ్లిపోవాలని లేదా శాసనసభను బహిష్కరించాలని కేంద్ర మంత్రి హితవు చెప్పారు. 
రాజేందర్ ఓ జాతీయ రాజకీయ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధి అని, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి అని ఆయన గుర్తు చేశారు.
ఈటెలను శాసనసభలో ఉండనీయనని కక్షపూరితంగా వ్యవహరిస్తున్న మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? ప్రజాస్వామ్యం గురించి నీతులు వల్లిస్తారా? అంటూ కేసీఆర్ ను కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మొదటి నుండి ఈటెలను రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నం తీస్తున్నారని, అడుగడుగునా అవమానించే ప్రయత్నం చేస్తున్నారని, ఈటెల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని, ఈటెలపై కక్షసాధింపు చర్యలు పాల్పడుతున్నారని విమర్శించారు.
ఈటెల వ్యాపారాన్ని, ఆస్తులను, కుటుంబాన్ని, రాజకీయంపై దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.  మీరు అనేకరకాల  కుట్రలు, కుతంత్రాలు చేసినా, బీజేపీ జెండాపై, హుజురాబాద్ ప్రజల ఆశీస్సులతో, ప్రజాస్వామ్య వాదుల సహకారంతో ఎన్నికైన ప్రజాప్రతినిధి ఈటెల అని చెబుతూ ఆయనను సభలో మాట్లాడనీయను అందానికి మీరెవ్వరు అంటూ కేంద్ర మంత్రి ప్రశ్నించారు.
అదేమైనా మీ జాగీరా? అని నిలదీశారు. మీరు నిజాం నవాబ్ అనుకొంటున్నారా? అని ఎద్దేవా చేశారు.  ఇంత అహంకారామా కేసీఆర్? అని ప్రశ్నిస్తూ  “మీరు ప్రజాస్వామ్యాన్ని అవమానాపరుస్తున్నారు. తెలంగాణ ప్రజలను అవమాన పరుస్తున్నారు. హుజురాబాద్ ప్రజల తీర్పును కాలరాచే ప్రయత్నం చేస్తున్నారు” అని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అగ్నిప్రమాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జ‌ర‌పాలి
 
 అగ్ని ప్రమాదం జరిగిన రూబీ హోటల్ వద్దకు చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది చనిపోవడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. గతంలో కూడా హైదరాబాద్ లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగాయని గుర్తు చేస్తూ ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని కోరారు.
 
ప్రమాదం జరిగిన హోటల్ లోపలికి కిషన్ రెడ్డిని తొలుత పోలీసులు అనుమతించలేదు. బిల్డింగ్, సెల్లార్‌కి లాక్ వేశారు. లోకల్ ఎంపీని లోపలికి పంపించరా? అంటూ కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు లాక్‌ తీసి కిషన్‌రెడ్డిని లోపలికి అనుమతించారు
 
 అగ్ని ప్రమాదం ఏవిధంగా జరిగిందో తెలియవలసి ఉన్నదని చెబుతూ వాహనాల ఉత్పత్తిలో లోపం ఉంటే ఎలక్ట్రికల్ వెహికిల్ కంపెనీపై కేసు పెట్టాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్  బిల్లు వసూలు చేయడానికే రాకూడదని, ఇలాంటి కాంప్లెక్స్ , అపార్టుమెంట్ల లో తనిఖీలు చేయాలని ఆయన సూచించారు. 
 
అన్ని వ్యాపార సంస్థల వారు, రెసిడెన్షియల్ కాంప్లెక్సుల వారు విధిగా ఎలక్ట్రిక్ వైరింగ్ సిస్టం ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాలని కిషన్ రెడ్డి తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి, ఎలాంటి సంబంధం లేకుండా ఇక్కడ చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. 
కేంద్ర ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు రూ.  2 లక్షలు, గాయాలైన వారికి రూ. 50 వేలు ప్రకటించారు. మృతుల రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి వారిని ఆదుకోవాలని కోరుతానని కిషన్ రెడ్డి వెల్లడించారు.