కేరళ మాజీ సీఎం విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు

కేరళ మాజీ సీఎం విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు
కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ (సీఎమ్​ఆర్​ఎల్) మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా కేరళ మాజీ  ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. అలాగే మరికొందరి నివాసాల్లోనూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు చేపట్టింది.

విజయన్ కుమార్తె టి. వీణకు చెందిన ‘ఎక్సాలాజిక్ సొల్యూషన్స్’ సంస్థ ఎలాంటి సేవలు అందించకపోయినా, సీఎమ్​ఆర్​ఎల్​​ అనే ప్రైవేట్ కంపెనీ 2018-19 మధ్య అక్రమంగా 1.72 కోట్లు చెల్లించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఈడీ దర్యాప్తును రద్దు చేయాలని కోరుతూ సీఎమ్​ఆర్​ఎల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కేరళ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.

మనీ లాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల కింద రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. వీటిలో తిరువనంతపురంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఇల్లు, కన్నూరులోని ఒక ప్రాంతం, అలాగే ‘కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్’  అనే ప్రైవేట్ సంస్థకు చెందిన “కీలక వ్యక్తుల” నివాసాలు ఉన్నాయని అధికారులు వివరించారు. 

ఈ దర్యాప్తులో విజయన్ కుమార్తె టి. వీణ ప్రమేయం ఉన్నందున, ఆయన నివాసంలో కూడా సోదాలు నిర్వహించినట్లు వారు తెలిపారు. 2017 నుంచి 2020 మధ్య కాలంలో, వీణకు చెందిన ‘ఎక్సాలాజిక్ సొల్యూషన్స్’ అనే ఐటీ సంస్థ సీఎమ్​ఆర్​ఎల్​కు ఎటువంటి సేవలు అందించనప్పటికీ, ఆ సంస్థకు రూ.1.72 కోట్లు అక్రమంగా చెల్లించిందని ఆరోపణలు ఉన్నాయి.

ఈడీ ఈ పీఎమ్​ఎల్​ఏ కేసును 2024లో నమోదు చేసింది. తన కుమార్తెపై వచ్చిన ఆరోపణలను విజయన్ గతంలోనే కొట్టివేశారు. తన ప్రతిష్టను దెబ్బతీయడానికి, తనపై బురద చల్లడానికే ఈ ఆరోపణలు చేశారని ఆయన వ్యాఖ్యానించారు. గత నెలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్​ విజయం సాధించడంతో, సీపీఎం కి చెందిన ఈ సీనియర్ నాయకుడు ఇటీవల అధికారాన్ని కోల్పోయారు. 

రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా (2016-2026) పనిచేసిన మాజీ సీఎంను, కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి స్థానానికి ఆయన పార్టీ నామినేట్ చేసింది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన దర్యాప్తు విభాగమైన ‘సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్’ (ఎసఎఫ్ఐఓ) దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభమైంది.

సీఎమ్ఆర్​ఎల్​​ చేపట్టిన కొన్ని లావాదేవీల చట్టబద్ధతపై ఆదాయపు పన్ను శాఖకు చెందిన ‘మధ్యంతర పరిష్కార మండలి’ సందేహాలు వ్యక్తం చేసిన తర్వాత ఎస్​ఎఫ్​ఐఓ దర్యాప్తు మొదలైంది.

సీఎమ్ఆర్​ఎల్​కు, వీణకు చెందిన ఐటీ సంస్థకు మధ్య కన్సల్టెన్సీ, సాఫ్ట్‌వేర్ మద్దతు సేవలకు సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది. అయితే, వీణ సంస్థ ద్వారా ఎటువంటి సేవలు అందించనప్పటికీ, “ఒక ప్రముఖ వ్యక్తితో ఆమెకున్న సంబంధం” కారణంగానే ఆ మొత్తాన్ని నెలవారీ ప్రాతిపదికన చెల్లించారని ఆరోపణలు ఉన్నాయి.