బాసర ట్రిపుల్ ఐటీలో 100 మంది విద్యార్థులకు అస్వస్థత

బాసర ట్రిపుల్ ఐటీలో మరోసారి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో విద్యార్థులు ఉత్తప్ప తిన్న అనంతరం వాంతులు, కడుపునొప్పి, తలనొప్పితో బాధపడుతున్నారు. విషపూరిత ఆహారం కారణంగానే అస్వస్థతకు గురయ్యామని భావిస్తున్నారు విద్యార్థులు. దాదాపు 100 మంది విద్యార్థులు అనారోగ్యంతో ట్రిపుల్ ఐటీ హాస్పిటల్ లో చేరారు. మరికొంతమంది విద్యార్థులు కూడా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.
కొన్నాళ్లుగా బాసర ట్రిపుల్ ఐటీని సమస్యలు వెంటాడుతున్నాయి. నెల రోజుల కింద బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ ఘటన విద్యార్థుల ఆందోళనకు దారి తీసింది. వారం రోజులు పాటు విద్యార్థులు ఎండా, వాన లెక్క చేయకుండా నిరసన తెలిపారు. తర్వాత మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి మాటిచ్చి 20రోజులు గడిచిపోయినా సమస్యలు పరిష్కారం కాలేదు.
 మొన్నటికి మొన్న విద్యార్థులు మరోసారి ఆందోళన చేస్తామనడంతో  హడావుడిగా మెస్ టెండర్లకు నోటిఫికేషన్ ను ట్రిఫుల్ ఐటీ అధికారులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ట్రిఫుల్ ఐటీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. ఎంతసేపు నోటీమాటలు, హామీలతోనే సరిపెడుతున్నారని,  సమస్యల పరిష్కారాన్ని మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు.
తిండి సరిగ్గా లేక, వసతులు లేక అవస్థలు పడుతుంటే ప్రభుత్వం పట్టనట్లు వ్యహరిస్తుందని మండిపడుతున్నారు. పర్మినెంట్ వీసీని నియమించి,  సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని బాసర ట్రిఫుట్ ఐటీ విద్యార్థులు హెచ్చరిస్తున్నారు.
అయితే, ఫుడ్ పాయిజన్ జరిగిందన్న ప్రచారాన్ని ట్రిపుల్ ఐటీ అధికారులు కొట్టి పారేశారు. అటు వైద్యులు కూడా అప్రమత్తమై ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురి కాలేదని తెలిపారు. సీజనల్ వ్యాధులతోనే విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని…ఆందోళన చెందవద్దని వైద్యులు సూచించారు.