పాస్పోర్టు తీసుకోవడం చాలా సులభం. ఏజెంట్లు, దళారుల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. అవసరం వచ్చినప్పుడు హడావుడిగా పాస్పోర్టు కోసం ప్రయత్నం చేసేబదులు ముందుగానే ప్రతి ఒక్కరు తీసుకొని ఉంచుకొంటే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. ఒక సారి తీసుకొనే అది పదేళ్ల వరకు చెల్లుబాటు అవుతుంది.
www.passportindia.gov.in వెబ్ సైట్ లో పేరు, మెయిల్ ఐడీతో రిజిస్టర్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకుంటే సరిపోతుంది. స్లాట్ ఏయే తేదీల్లో, ఏయే కేంద్రాల్లో అందుబాటులో ఉందో వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఆ రోజున ఫిజికల్ వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ డాక్యుమెంట్లతో సంబంధిత ఆఫీసుకు వెళ్లాలి. అక్కడ అడిహకారులు డాక్యుమెంట్లు పరిశీలించి పాస్పోర్టు అప్రూవ్ చేస్తారు.
పాస్పోర్టు కోసం పుట్టిన తేదీ, పుట్టిన స్థలాన్ని ధ్రువీకరించే డాక్యుమెంట్లు ఉంటే సరిపోతుంది. ఆధార్ కార్డులో ఈ రెండూ ఉంటాయి కాబట్టి అదొక్కటి సరిపోతుంది. విద్యార్హతలు నమోదు చేసుకోవాలంటే సంబంధిత సర్టిఫికెట్లను అప్లికేషన్ టైమ్ లోనే వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఫిజికల్ వెరిఫికేషన్ కోసం వచ్చేటప్పుడు ఒరిజినల్స్ తీసుకొని రావాలి.
హైదరాబాద్లోని అమీర్పేట్ , టోలీచౌకి, బేగంపేట్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, భువనగిరి, కామారెడ్డి, ఖమ్మం, మహబూబ్నగర్ , మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, నల్గొండ, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్ జిల్లా సెంటర్లలో సేవా కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో ఎక్కడైనా ఫిజికల్ వెరిఫికేషన్ కోసం హాజరు కావచ్చు.
పాస్పోర్టు జారీకి రెండు ముఖ్యమైన నిబంధనలు ఉన్నాయి. తీసుకునే వ్యక్తి భారతీయుడు అయి ఉండాలి. అతని మీద క్రిమినల్ కేసులు ఉండరాదు. ఎఫ్ఐఆర్ నమోదైన పాస్పోర్టు ఇస్తారు. కానీ చార్జ్షీటు దాఖలు కావడం, జైలు శిక్ష పడిన వారి విషయంలో పోలీసు వెరిఫికేషన్లోనే తిరస్కారంకు గురవుతుంది.
ఈ ఏడాది ఇప్పటికే 3.23 లక్షల మంది పాస్పోర్టు తీసుకున్నారని హైదరాబాద్ లోని రీజనల్ పాస్పోర్టు ఆఫీసర్ దాసరి బాలయ్య తెలిపారు.
వీరిలో ఎక్కువగా యువతే ఉన్నారు. ప్రస్తుతం రోజు 3 వేల మందికి పాస్పోర్టు జారీ చేస్తున్నారు. కరోనా తర్వాత ఎక్కువ మంది వస్తుండడంతో వెయిటింగ్ సమయం పెరిగింది. దాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు.
పాస్పోర్టుకు సంబంధించి సమస్యలు, అనుమానాలు ఉంటే సికింద్రాబాద్ లోని రీజనల్ ఆఫీస్, జిల్లాల్లోని సేవా కేంద్రాలతో పాటు వెబ్ సైట్ లోని గ్రీవెన్స్ సెల్ ద్వారా సంప్రదించొచ్చు. ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు 81214 01532 నెంబర్కు వాట్సప్లో వీడియో కాల్ చేసి కూడా ప్రాంతీయ అధికారితో నేరుగా మాట్లాడొచ్చు.
పాస్పోర్టు ఫీజు రూ.1,500 మాత్రమే. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ ఉండి, త్వరగా కావాలంటే తత్కాల్ సేవలు వినియోగించుకోవచ్చు. ఇందుకోసం రూ.2 వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్లోనే కట్టొచ్చు. తత్కాల్కు పోలీస్ వెరిఫికేషన్తో పని లేకుండా వెంటనే పాస్పోర్టు ఇస్తారు. ఆ తర్వాత పోలీసులు విచారణ జరుపుతారు.
ఏవైనా సమస్యలుంటే పాస్పోర్టు రద్దు చేసే అధికారం వారికి ఉంటుంది. ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత వారం రోజుల్లో పాస్పోర్టు ఇంటికి వచ్చేస్తుంది. ఒకవేళ తత్కాల్ లో అయితే మూడ్రోజుల్లోనే వస్తుంది. పెద్దలకు పదేండ్లు, పిల్లలకు ఐదేండ్ల వ్యాలిడిటీతో పాస్ పోర్ట్ ఇస్తున్నారు. వ్యాలిడిటీ ఇంకో ఏడాది ఉండగానే రెన్యూవల్ చేసుకోవాలి.
6 నెలల కంటే తక్కువ వ్యాలిడిటీ ఉన్న పాస్పోర్టులతో విదేశాలకు వెళ్లరాదు. గడువు ముగిసిన మూడేండ్ల లోపల కూడా రెన్యూవల్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అయితే మాత్రం మళ్లీ పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆన్ లైన్ లోనే రెన్యూవల్ చేసుకోవచ్చు.
More Stories
నామినేషన్ ఉపసంహరించుకున్న ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి
హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అంటూ కేటీఆర్ కొత్త అస్త్రం
రేజర్వేషన్లపై అమిత్ షా `నకిలీ వీడియో’పై ఎఫ్ఐఆర్