గోల్కొండ కోటలో తొలి పూజతో నేడే బోనాలు ప్రారంభం

తెలంగాణ వ్యాప్తంగా సంబరంగా వారసత్వంగా పెద్ద ఎత్తున జరుపుకొనే సాంప్రదాయక ఆషాడ మాసం బోనాల ఉత్సవాలు నేడే ప్రారంభం కానున్నాయి. మొదట గోల్కొండ కోటలోని జగదాంబికా అమ్మవారి పూజతో బోనాలు ప్రారంభం అవుతాయి.
భక్తుల కోలాహలం, డప్పు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలతో ఊరేగింపు గోల్కొండ కోటకు చేరుకుంటుంది. మధ్యలో చోట బజార్లోని పూజారి అనంత చారి ఇంట్లో అమ్మవారి ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఊరేగింపు సాయంత్రానికి కోటలోని జగదాంబిక మహంకాళి(ఎల్లమ్మ) అమ్మవారి దేవాలయానికి చేరుకుంటుంది. కోట పైన అమ్మవారికి భారీ తొట్టెలను సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు. 
 
కాగా జులై17న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు,18న రంగం భవిష్యవాణి ఉంటుంది. జులై 24న పాతబస్తీ బోనాలు, 25న ఉమ్మడి దేవాలయాల ఘటాల ఊరేగింపు నిర్వహించనున్నారు. మొత్తంగా భాగ్యనగరంలో జూన్​30న మొదలయ్యే బోనాల సంబురం జులై 28 వరకు కొనసాగనున్నాయి. ప్రభుత్వం తరపున అమ్మవార్లకు పట్టు వస్త్రాలను పశుసంవర్థ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి సమర్పించనున్నారు.
గత రెండేళ్ళగా కరోనా కారణంగా గోల్కొండ బోనాల ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులను అనుమతించలేదు. ఈసారి వైరస్‌ ఉధృతి తక్కువగా ఉండటంతో బోనాల జాతరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా నిబంధనలు పాటిస్తూ బోనాలను నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది.
లంగర్‌ హౌస్‌ నుంచి ఊరేగింపుగా వచ్చిన బోనాన్ని గోల్కొండ కోట జగదాంబికా అమ్మవారికి సమర్పిస్తారు. దీంతో తెలంగాణ అంతటా బోనాల జాతర మొదలవుతుంది. గోల్కొండ కోటలో జగదాంబికా అమ్మవారికి తరతరాలుగా సేవ చేస్తున్న కుమ్మరి వంశస్తులు భక్తులకు బొట్టు పెడుతూ అర్చనలు చేస్తూ అక్కడే పూజారులుగా ఉంటారు.
ఈ ఏడాది తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. బోనాల సందర్భంగా వివిధ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం రూ.15 కోట్లను కేటాయించింది. సుమారు 26 దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.
 అలాగే ప్రైవేటు నిర్వహణలో ఉన్న అమ్మవార్ల దేవాలయాలకు కూడా ఒక్కో ఆలయానికి రూ.3 వేల చొప్పున ప్రభుత్వం సాయం చేయనుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని పశుసంవర్థ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు.
బోనాల సందర్భంగా దేవాలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా వైద్య శిబిరాలు, నీటి సరఫరా, టాయిలెట్స్‌, సీసీ కెమెరాలు, మొబైలు ట్రాన్స్‌ఫార్మర్లు, ట్రాఫిక్‌ డైవర్షన్‌ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. బుధవారం బల్కంపేట రేణుకా ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో అమ్మవారి చీర తయారీ పనులను , భక్తుల వసతి భవనాన్ని మంత్రి తలసాని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 5వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, 6వతేదీన రథోత్సవం నిర్వహిస్తామని చెప్పారు. ఈ ఏడాది ఉత్సవాలకు 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు.