వర్సిటీ నియామక బోర్డుతో ఉపయోగం లేదు.. ఎబివిపి 

తెలంగాణలోని యూనివర్సిటీలలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వర్సిటీ నియామక బోర్డుతో ఎటువంటి ఉపయోగం లేదని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విమర్శించింది. 
 
ఎనిమిదేళ్లుగా ఎలాంటి నియామకాలు చేపట్టని ప్రభుత్వం  ఇవాళ ఎలాంటి చట్టబద్దత లేని కమిటీని ఏర్పాటు చేయడం వెనుక నియామక ప్రక్రియను మరింత ఆలస్యం చేసేందుకు కుట్ర పన్నినట్లు అర్థమవుతోందని ఎబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. 
నియామక బోర్డులో వైస్ ఛాన్సలర్ కు స్థానం లేకపోవడం దారుణమని ఆయన ధ్వజమెత్తారు. అధికార బలంతో వ్యవస్థలను తమ కబంధ హాస్తాల్లోకి తీసుకుంటూ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహారిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఉద్యమ కేంద్రాలైన యూనివర్సిటీలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదని దయ్యబట్టారు.
యూనివర్సిటీ టీచింగ్ పోస్టుల భర్తీ కేవలం మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలతో నియమించేది కాదని,  అకాడమిక్ విలువలు, పరిశోధన ప్రమాణాలతో వైస్ ఛాన్సెలర్, సీనియర్ ప్రోఫసర్లతో జరగాల్సిన నియామకాలు ఐఏఎస్ అధికారుల బృందానికి అప్పగించడం సమంజసం కాదని ప్రవీణ్ రెడ్డి విమర్శించారు.
ప్రభుత్వం యూనివర్సిటీలపై పక్షపాత వైఖరిని వీడి వెంటనే యూనివర్సిటీల స్వయంప్రత్తిని కాపాడుతూ త్వరిత గతిన నియామకాలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే ఎబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన  కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.