విజయమే లక్ష్యం కాదు, అది మార్గం మాత్రమే… డా. భగవత్  

విజయమే లక్ష్యం కాదని, అది మార్గం మాత్రమే కావాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆర్‌.ఎస్‌.ఎస్ స‌ర్ సంఘ‌చాల‌క్  డా. మోహ‌న్ భ‌గ‌వ‌త్  స్పష్టం చేశారు. ఎందరో రాజులు ఎన్నో యుద్ధాల్లో విజయాలు సాధించారని,  కానీ వాళ్లు వెయ్యి రెండు వేల ఏళ్ల కంటే ఎక్కువగా మనకు తెలియదని, యుగయుగాలుగా రాముని ఆదర్శం కావాలని కోరుకుంటున్నామని ఆయన గుర్తు చేశారు.

భాగ్య‌న‌గ‌ర్‌లో నూతనంగా నిర్మించిన ఏబీవీపీ కార్యాలయం “స్పూర్తి ఛాత్ర శక్తి భవన్” ని గురువారం ప్రారంభిస్తూ  అహంకారం దరిచేరనీయ‌కుండా దేశానికి పరమవైభవ స్థితిని తీసుకురావాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌ని పిలుపునిచ్చారు.
ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుని ఎంతో కాలంగా శ్రమించి ఒక కార్య సిద్ధి సాధించిన వారికి, ఎవరి ప్రేరణతో ఈ కార్యాలయం నిర్మించారో వారందరికీ ఆయన అభినందనలు తెలిపారు. మన దగ్గర ఉన్న కార్యకర్తలను ఆత్మవిశ్వాసమే ఏదో ఒక రోజు మన ఆలోచన న్యాయబద్ధమైన అని దానికి ఒక విజయం లభిస్తుంది అనడానికి ఈ కార్యాలయమే ఒక సాక్ష్యం అని ఆయ‌న చెప్పారు.
ఏబీవీపీ అంటే ఏమిటో తెలంగాణలో ఏబీవీపీ కార్యంను చూసి తెలుసుకోవచ్చ‌ని స్పష్టం చేశారు. సంఘ ప్రార్థనలో చెప్పుకున్నట్టుగా ఇది కంటాకాకీర్ణ మార్గం అని, ప్రతికూల వాతావరణంలో మన పని వేగం పెంచడానికి చెమటతో పాటు రక్తాన్ని కూడా చిందించాల్సి వ‌చ్చిందని ఆయ‌న గుర్తు చేశారు.

సత్యాన్ని న్యాయాన్ని నమ్ముకుని నడుస్తున్నప్పుడు త‌మదే సత్యం, ఇతరులది అంతా వ్యర్థం అనుకునే తర్కవాదులు వారి సర్వశక్తులను వడ్డీ సత్యాన్ని న్యాయాన్ని అణచాలని చూశారని చెబుతూ అయితే  సత్యం ఎప్పటికీ దాగదని ఆయ‌న పేర్కొన్నారు. అన్యాయాలను ఎదురించి, బలిదానమిచ్చిన కార్యకర్తల తప ఫలమే ఈ కార్యాలయం అని ఆయ‌న చెప్పారు.

స్పూర్తి భవనం అనే పేరు సరైనదే అంటూ  ఇక్కడి ఏబీవీపీ కార్యానికి ఘన చరిత్ర ఉన్నదని,  ఇదంతా చూసి మన మనసులో ఒక స్ఫూర్తి ఉద్భవిస్తుంది డా. భగవత్  ఆకాక్షించారు. మొదటి నుండి ఏబీవీపీ తెలంగాణ ప్రాంత కార్యం అగ్రస్థానంలో ఉందని, ఎలా ఉండాలో తెలంగాణ చూపెట్టి నిలబడిందని చెబుతూ కార్యాలయం ట్రెండ్ సెట్టర్ గా మిగిలిందని తెలిపారు.

ఒకవైపు విరోధులను ఎదుర్కొని నిలబడటం, మరోవైపు ఆవిరోధులతో కలిగిన నష్టాన్ని నివారించడం- ఈ రెండూ తెలంగాణ ఏబీవీపీకే చెల్లిందని చెబుతూ వీటి ప్రతిరూపమే నేటి కార్యాలయ‌మ‌ని డా.  భగవత్ వివరించారు.  ప్రార్థన లో చెప్పినట్లు ఇది కంటకాకీర్ణ మార్గము, 30 ఏళ్ళ క్రితమే ఇది మనకు అనుభవైకవేద్యం అయిందని చెప్పారు.

ఇప్పటి కార్యకర్తలు మన దారిలో ముల్లు ఎక్కడ ఉన్నాయని అడుగుతున్నారంటే  మనం ఆ సమయంలో చూపిన సహనం, ఓపిక నిరోధ సమయంలో సంఘర్షణ చేయడం లోపలి దుఃఖాన్ని ఆపుకుని కార్యకర్తల కోసం కార్యం కోసం ముందుకు వెళ్ళాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఇంత చేసినా మనలో శత్రు భావన రాకుండా మనలో నిగ్రహం విశ్వాసం పెంచుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

ఇప్పుడు కార్యాలయం ఏర్పడింది, ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి.. మన సమాజంలో నమ్మకం విశ్వాసం ప్రేమ పెంచడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంద‌ని ఆయ‌న విశ్వాసం వ్యక్తం చేశారు. ఒక సమయంలో ఏబీవీపీ కార్యకర్తలను చూసి అందరూ నవ్వేవార‌ని, మీరు సరస్వతీ ప్రార్థన చేస్తారని, ప్రధమ శ్రేణిలో ఉతీర్ణులైన  వారికి అభినందనలు తెలుపుతారని హేళన చేసేవారని గుర్తు చేసారు.

కానీ మనల్ని హేళన చేసిన వారే ఇప్పుడు మన దారిలో నడుస్తున్నారని,  వారు అదే పనులు చేస్తున్నార‌ని డా. భగవత్ తెలిపారు.  అప్పుడు మనలను పట్టించుకోని వారు ఇప్పుడు మనలను అగ్రగణ్యులుగా గుర్తిస్తున్నార‌ని చెబుతూ ఈ సమయంలో కంటకము అంటే మనకున్న సౌకర్యాలే మనకు కంటకంగా మారుతాయని వారించారు.

ఆనందం ఉత్సాహాన్నిసెలబ్రేట్ చేసుకునేటప్పుడు కొంత జాగరూకత కూడా అవసరమేన‌ని హితవు చెప్పారు. లేకుంటే అనుకూలత కూడా కంటకమే అవుతుంద‌ని ఆయ‌న కార్య‌క‌ర్త‌ల‌కు సూచించారు. సమాజంలో ఒక స్థాయి రాగానే మనకు అహంకారం వస్తుందని సర్ సంఘచాలకే హెచ్చరించారు. అందరి లాగా మనం కేవలం విజయం కోసమే పరితపించిన రాదని చెప్పారు.

యుగాల నాడే పితృవాక్య పరిపాలన కోసం అడవి మార్గం పట్టిన రాముడిని కేవలం స్మరించడంమే కాకుండా ఆయన ఆదర్శాలపై మనం నిలవాలని కోరుకుంటున్నాం అని గుర్తు చేశారు. జూలియస్ సీజర్ ఎన్ని విజయాలు సాధించినా అహంకారంతో అడుగంటి పోయాడని గుర్తు చేశారు.  ధర్మాన్ని ఆచరణలో చూపి మన రాముడు అందరి నోళ్లలో నానుతున్నాడని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఉత్తరప్రదేశ్ లో కొన్ని గ్రామాల్లో కొన్ని చదరపు కిలోమీటర్ల వరకు శనగ పంట పండించరని, ఎందుకంటే సీతమ్మ తన ఇంటికి నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఈ ఎండిన శ‌నగ గింజలపై న‌డ‌వ‌డం వ‌ల్ల‌ రక్తం వ‌చ్చేందని భావిస్తుంటారని డా. భగవత్ తెలిపారు. కనుక నేటికీ కొన్ని మైళ్ల దూరం వరకు శనగలు పండించ‌డం లేదని చెబుతూ యుగాలనాటి సీత ఇప్పటికీ మన మనసుల్లో నిలిచిపోయిందని ఆయ‌న పేర్కొన్నారు.

ధీరులను అనుకూల ప్రతికూలతలు ప్రభావితం చేయలేవని, వారిని పొగడిన, తెగడినా, ఇప్పుడే మరణం ముంచుకొచ్చినా,  యుగాంతం వరకు మరణం కోసం ఎదురు చూడాల్సి వచ్చిన వారు చలించర‌ని, సత్యం, న్యాయ‌ మార్గాల మీదనే ఎల్లప్పుడూ చరిస్తారని  అంటూ రాత్రి 12 గంటలకు చిరిగిన చొక్కా దర్శించే మంత్రి కథను ఆసక్తికరంగా వివరించారు.

మనం ఎక్కడి నుంచి వచ్చాము అనే స్పృహ మనకు ఉండాలని స్పష్టం చేశారు. మన గూర్చి ప్రపంచంలో మంచి చెప్పిన వాళ్ళు లేరు తిట్లే, నిందలే అటువంటి స్థితి నుంచి మనకు ప్రచారం, ప్రభుత్వం లేని చోట, అనుభవం లేని చోట మనం స్వశక్తితో పైకి ఎదిగామ‌ని డా. భగవత్ గుర్తు చేశారు. పెద్ద పెద్ద కార్యాలను సౌకర్యాలతో కాకుండా కార్యకర్తల శక్తితో సాధించడమే ఆవశ్యకం అని స్పష్టం చేశారు.  ఆత్మీయత, ధ్యేయ నిష్ట, అనుశాసనంతో కార్యకర్తల గుణాలను వికసింప జేసి వారిని శక్తివంతులుగా చేశామ‌ని వివరించారు.

మనం ఎప్పుడూ మోసాల వెంట, కీర్తి వెంట, అబద్ధాల వెంట పడరాదని హితవు చెప్పారు. శీలం వెంట మాత్రమే ఉండాలని,  జ్ఞాన శీల ఏక‌త లే మన బలం కావాలని స్పష్టం చేశారు.  నూత‌న భవనంతో పూర్తి ఉత్సాహం కార్య వేగం పెంచడానికి లభించిన సౌకర్యాలతో శక్తిని పూర్తిగా వినియోగించాలని, కార్య‌నిష్ఠ‌తో పరమ వైభవాన్ని సాధించాల‌ని విద్యార్థుల‌కు, విద్యార్థి నాయ‌కుల‌కు మోహ‌న్ జీ ఈ సంద‌ర్భంగా సూచించారు.

ఏబివీపి అఖిల భార‌త సంఘ‌ట‌నా కార్య‌ద‌ర్శి ఆశిష్ చౌహన్, ఏబివిపీ అఖిల భార‌త ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కుమారి నిధి త్రిపాఠి కూడా ప్రసంగించారు.

(వి ఎస్ కె తెలంగాణ నుండి)