అగ్నిపథ్ పథకం దేశంలో వివిధ ప్రాంతాలలో చెలరేగుతున్న ఆందోళనల పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఈ పధకం యువతకు ఎంతో మేలు చేకూరుస్తుందని కేంద్ర మంత్రులు రాజనాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ తదితరులు విజ్ఞప్తి చేశారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఆర్మీ రిక్రూట్మెంట్ జరపగా పోవడంతో ఇప్పుడు మంచి అవకాశం అని తెలిపారు. పైగా, సైనికుల నమోదు కోసం, ప్రభుత్వం 2022 నాటికి గరిష్ట వయోపరిమితిని 21 సంవత్సరాల నుండి 23 సంవత్సరాలకు పొడిగించింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. ఇది యువతకు సైన్యంలో చేరడానికి .. దేశానికి సేవ చేయడానికి “సువర్ణావకాశం” అందించిందని తెలిపారు. జూన్ 14న, కేంద్ర క్యాబినెట్ భారతీయ యువత సాయుధ దళాలలో పనిచేయడానికి రిక్రూట్మెంట్ ప్లాన్ను ఆమోదించింది,
ఎంపికైన వారికి అగ్నివీర్స్ హోదాగా ఉంది. అగ్నిపథ్ అనేది దేశభక్తి .. దృఢ సంకల్పం ఉన్న యువకులను నాలుగు సంవత్సరాల పాటు సాయుధ దళాలలో సేవ చేయడానికి అనుమతించే కార్యక్రమం అని రక్షణమంత్రి చెప్పారు. దేశంలోని యువత రక్షణ వ్యవస్థలో చేరడానికి .. వారి దేశానికి సేవ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ చొరవ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు.
అగ్నిపథ్ వయోపరిమితిని పెంచడం వల్ల పెద్ద సంఖ్యలో యువతకు మేలు జరుగుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రక్రియకు ఆటంకం ఏర్పడిందని, దేశ యువత పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ కఠినమైన నిర్ణయం తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు.
కాగా, అగ్నిపథ్ ను యువత సరిగా అర్థం చేసుకోవాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అగ్నిపథ్ ఆందోళనలపై నితిన్ గడ్కరీ స్పందిస్తూ నాలుగేళ్ల తర్వాత ఉద్యోగం పోతుందని అనుకోవద్దని చెప్పారు. ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాన్నైనా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తాయని, అందులో భాగంగానే ఇలాంటి ఘటనలు జరుగుతాయని ఆయన ధ్వజమెత్తారు.
అగ్నిపథ్ విధానం యువతకు వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అగ్నిపథ్ లో చేరడం యువతకు అదనపు అర్హత అని చెబుతూ ఇతర ఉద్యోగాల్లో చేరడానికి నైపుణ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. కొందరు కావాలని విధ్వంసం చేయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. అగ్నిపథ్ పై కుట్రపూరితంగా ప్రచారం జరుగుతోందని పేర్కొంటూ స్వచ్ఛందంగా ఇష్టపడే వాళ్లు మాత్రమే చేరవచ్చని చెప్పారు.
ఆర్మీ చీఫ్ విజ్ఞప్తి
ఇలా ఉండగా, భారతీయ యువత అగ్నిపథ్ ను వినియోగించుకోవాలని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కోరారు. ఆర్మీ పరీక్ష కోసం సిద్దమవుతున్న యువతకు వయోపరిమితిని ఒకసారి పెంచే అవకాశం కేంద్రం కల్పించినట్లు ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల దేశంలోని యువతకు తమ దేశభక్తిని చాటుకునే అవకాశం దొరుకుతుందని, కరోనా సమయంలోనూ తీవ్రంగా కష్టపడ్డ యువతకు ఇప్పుడు మంచి అవకాశం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
గడిచిన రెండేళ్లు కరోనా ఆంక్షల వల్ల ఆర్మీ రిక్రూట్మెంట్ను నిర్వహించలేదని చెప్పారు. అయితే రిక్రూట్మెంట్కు చెందిన షెడ్యూల్ను త్వరలోనే ప్రకటించనున్నట్లు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే తెలిపారు. అగ్నివీరులకు ఈ ఏడాది డిసెంబర్లో శిక్షణ ప్రారంభిస్తామని మనోజ్ పాండే తెలిపారు.
శిక్షణ పొందిన సైనికులకు వచ్చే ఏడాది మధ్య నుంచి సర్వీసు ప్రారంభం అవుతుందని చెప్పారు . కాగా, త్వరలోనే రిక్రూట్మెంట్ ప్రక్రియను మొదలుపెట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఇక .. తమ అధికారిక వెబ్సైట్లో మరొ రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆయన తెలిపారు.
More Stories
దేశం సుభిక్షంగా ఉండాలంటే మోదీ రావాలి
ఏపీని అన్ని విధాలా నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్’
మోదీ, రాహుల్ ప్రసంగాలపై ఈసీ నోటీసులు