ఢిల్లీలో స్పందన లేకే కేసీఆర్ తిరిగి వచ్చారా!

మరో మూడు రోజుల పాటు దేశ రాజధానిలో ఉంది, జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖులతో భేటీ కావాలని అనుకున్నా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు షెడ్యూల్ కన్నా మూడు రోజుల ముందే హైదరాబాద్ కు తిరిగి రావడం రాజకీయ వర్గాలలో ఆసక్తి కలిగిస్తోంది.  ఆయనను కలవడానికి చాలా మంది ఆసక్తి చూపక పోవడంతోనే ఆయన తిరిగి వచ్చినట్లు పలువురు భావిస్తున్నారు. 
ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం ఈనెల 26 వరకు ఆయన ఢిల్లీలోనే ఉండి, అక్కడి నుంచే బెంగళూరుకు వెళ్లాల్సి ఉంది. కానీ సోమవారం రాత్రే కేసీఆర్‌‌ తిరుగు పయనమవడం చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం సాయంత్రం బేగంపేట ఎయిర్‌‌ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన సీఎం శని, ఆదివారాల్లో బిజీబిజీగా గడిపారు. 

అయితే సోమవారం పొద్దంతా దేశ రాజధానిలోనే ఉన్నా ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్‌‌ గులాటీ మినహా ఇంకెవ్వరూ ఆయన్ను కలిసేందుకు రాలేదు. పలువురు ప్రముఖులకు రాయబారం పంపినా ఏ ఒక్కరూ స్పందించక పోవడంతోనే  ఢిల్లీలో ఉండి ఉపయోగం లేదని ఆయన హైదరాబాద్‌‌కు తిరిగి బయల్దేరినట్టు తెలుస్తోంది.

శనివారం మొదటగా ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ వచ్చి ఆయనను కలిశారు. ఆ సందర్భంగా ఇద్దరం కలసి మీడియాను ఉద్దేశించి మాట్లాడదామని కేసీఆర్ ప్రతిపాదించినా అఖిలేష్ ఆసక్తి చూపలేదని తెలుస్తున్నది. అందుకనే మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదు. పైగా, కేసీఆర్ తో కలయిక గురించి అఖిలేష్ మీడియాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. 

మరోవంక, చండీఘర్ లో రైతులు, సైనికుల కుటుంబాలను పరామర్శించి, వారికి ఆర్ధిక సహాయం అందించే కార్యక్రమంపై కేసీఆర్‌‌తో కలిసి రావాలంటే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌‌ షరతు పెట్టినట్టు తెలుస్తోంది. కేసీఆర్‌‌తో కలిసి వేదిక పంచుకోవడానికి ఆయన తొలుత విముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు.

అయితే, రైతులకు చెక్కులు ఇస్తామని పలుమార్లు కేజ్రీవాల్‌‌ను సంప్రదించడంతో తమ ప్రభుత్వం చేపట్టిన సర్వోదయ స్కూళ్లు, మోహల్లా క్లినిక్‌‌లను ఢిల్లీలో కచ్చితంగా సందర్శించాలని ఆయన షరతు పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే సర్వోదయ స్కూల్‌‌, మొహల్లా క్లినిక్‌‌ను కేసీఆర్‌‌ సందర్శించారని చెప్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వ ఘనతను కీర్తిస్తూ ప్రత్యేకంగా స్లాట్‌‌లు బుక్‌‌ చేసి మరీ నేషనల్‌‌ ఎలక్ట్రానిక్‌‌ మీడియాలో ప్రచారం చేయించుకున్నారు. కానీ తన ఢిల్లీ, చండీగఢ్‌‌ లలో కేసీఆర్ పర్యటనను జాతీయ ఎలక్ట్రానిక్‌‌ మీడియా ఏమాత్రం పట్టించుకోలేదు.

ఢిల్లీలోని తెలంగాణ సీఎంవో పీఆర్‌‌ వర్గాలు ప్రయత్నించినా జాతీయ ఎలక్ట్రానిక్‌‌ మీడియా కేసీఆర్‌‌ కార్యక్రమాల కవరేజీకి అంతగా ఆసక్తి చూపలేదు. పలువురు సీనియర్ జర్నలిస్ట్ లతో భేటీకి ప్రయత్నం చేసినా కార్యరూపం దాల్చలేదు. దానితో కేసీఆర్ తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తున్నది.

కేసీఆర్‌‌ ఢిల్లీకి వెళ్లడానికి ముందు ఆయన నేషనల్‌‌ మీడియా ప్రముఖులు, ఆర్థిక రంగ నిపుణులు, రాజకీయ పార్టీల నాయకులతో భేటీ అవుతారని సీఎంవో నుంచి పత్రిక ప్రకటనను విడుదల చేశారు. కేజ్రీవాల్‌‌తో కలిసి సర్వోదయ స్కూల్‌‌ను సందర్శించిన తర్వాత దేశ రాజకీయాల్లో సంచలనం జరుగుతుందని ప్రకటించారు. 

అయితే చెప్పుకోదగిన భేటీలు ఏవీ జరగక పోవడం, ఢిల్లీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని అయన తిరిగిరావడం ఆ పార్టీ వర్గాలకే విస్మయం కలిగిస్తోంది. 

ఇలా ఉండగా, ఈ నెల 26న హైదరాబాద్ కు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం చెప్పకుండా మరోసారి తప్పించుకోవడం కోసమే ఆయన ఢిల్లీ పర్యటన పెట్టుకున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ నుండి తిరిగి వచ్చినా ప్రధానికి స్వాగతం చెప్పబోరని అధికార వర్గాలు తెలిపాయి. 

ఈనెల 26న హైదరాబాద్‌ వస్తున్న ప్రధాని గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) గ్రాడ్యుయేషన్‌ డేలో ప్రధాని పాల్గొని విద్యార్థులకు అవార్డులు బహూకరిస్తారు. అనంతరం జరిగే సమావేశంలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తారని ఐఎస్‌బీ డీన్‌ మదన్‌ పిల్లుట్ల తెలిపారు. 

సీఎం కేసీఆర్‌ తరఫున మంత్రివర్గంలో సీనియర్‌ మంత్రి ఒకరు పాల్గొంటారని ఆ మంత్రి పేరు, ఇతర వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించలేదని చెప్పారు. ఐఎస్‌బీలో జరుగుతున్న గ్రాడ్యుయేషన్‌ డేకు సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించామని ఆయన తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చెప్పారు.

హైదరాబాద్ తిరిగివచ్చిన కేసీఆర్ షెడ్యూల్ ప్రకారం ఈనెల 26న కేసీఆర్‌‌ బెంగళూరుకు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడ, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామితో భేటీ కావచ్చని తెలుస్తున్నది.  కేసీఆర్‌‌ ఆ రోజు బెంగళూరులోనే బస చేసి మరుసటి రోజు మహారాష్ట్రలోని రాలేగావ్‌‌ సిద్ధికి వెళ్లి అన్నాహజారేతో సమావేశం కావాల్సి ఉంది. 

తర్వాత షిర్డీ సాయిబాబాను దర్శించుకొని హైదరాబాద్‌‌కు తిరిగి రానున్నారు. కేసీఆర్ బెంగళూరు, మహారాష్ట్ర టూర్‌‌ యథావిధిగా కొనసాగుతుందని టీఆర్‌‌ఎస్‌‌ నేతలు చెప్తున్నారు. బీహార్‌‌, పశ్చిమబెంగాల్‌‌కు ఏ రోజు వెళ్తారనే దానిపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.