వయనాడ్ ఎంపీ తన ఇటాలియన్ కళ్లద్దాలు తీసి చూస్తే అరుణాచల్ ప్రదేశ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి పెమ ఖండూ చేసిన అభివృద్ధి కనిపిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్షా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై విరుచుకు పడ్డారు.
నమ్సాయి జిల్లాలోని రూ.1000 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన సందర్భంగా అమిత్షా మాట్లాడారు. ఎనిమిదేళ్లలో ఏమి చేశారని కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారని, వీళ్లంతా మూసుకున్న కళ్లను తెరిచి చూడాలని హితవు పలికారు.
రాహుల్ గాంధీ ఇటాలియన్ కళ్లద్దాలు ఒకసారి తీసి చూస్తే ప్రధాని మోదీ, సీఎం పెమాఖండూ చేసిన అభివృద్ధి కనిపిస్తుందని పేర్కొన్నారు. ఈశాన్య భారతదేశానికి మోదీ సర్కారు ఏం చేసిందంటూ ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతలపై అమిత్ షా మండిపడ్డారు. కళ్లు మూసుకుంటే అభివృద్ధి ఎలా కనిపిస్తుందని నిలదీశారు. కళ్లు తెరిచి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూడాలని హితవు పలికారు. ‘‘రాహుల్ గాంధీజీ.. మీరు కళ్లు తెరవండి. ఇటలీ కళ్లద్దాలను పక్కనపెట్టండి. ఇండియా కళ్లద్దాలు ధరించండి’’ అని అమిత్ హితవు చెప్పారు.
”మౌలిక వసతుల కల్పన, శాంతి భద్రత పటిష్టత, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో సహా ఎనిమిదేళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు చేశాం. 50 ఏళ్లలో చేయలేని పనిని మోదీ, పెమా ఖండూ కలిసి ఎనిమిదేళ్లలో చేసి చూపించారు” అని అమిత్షా కొనియాడారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన అరుణాచల్ ప్రదేశ్ వచ్చారు.
నమసాయ్ జిల్లాలోని గోల్డెన్ పగోడాను ఆదివారం ఉదయం సందర్శించారు. ఆయనతో పెమా ఖండూ, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా పాల్గొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో అవినీతి సంస్కృతిని బీజేపీ అంతం చేసిందని అమిత్ షా ప్రశంసించారు.
ప్రభుత్వం ఇచ్చే నిధులు పక్కదారి పట్టడం లేదని, చివరి లబ్ధిదారుడి దాకా చేరుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో నిధులు మధ్యవర్తుల జేబుల్లోకి వెళ్లేవని అన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో ఈశాన్య రాష్ట్రాలు దారుణంగా నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆయన ధ్వజమెత్తారు.
ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదుల ప్రాబల్యం అధికంగా ఉండేదని, ఇప్పుడు శాంతి పవనాలు వీస్తున్నాయని ఉద్ఘాటించారు. ఇక్కడి ప్రజల్లో దేశభక్తి నిండిపోయిందని, ఒకరినొకరు ‘నమస్తే’ బదులు ‘జైహింద్’ అంటూ అభివాదం చేసుకుంటారని తెలిపారు. ఇలాంటి సన్నివేశం దేశంలో ఇంకెక్కడా చూడలేమని స్పష్టం చేశారు.
ఆయన ఆదివారం అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం, నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ(ఎన్డీయూ) మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందం(ఎంఓయూ)పై సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం అరుణాచల్ రాష్ట్రం ఈస్ట్ సియాంగ్ జిల్లాలోని పాసీఘాట్లో ఎన్డీయూ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నారు. ఒప్పందంపై సంతకాల అనంతరం నామ్సాయ్ జిల్లాలో భారీ ర్యాలీలో అమిత్ షా ప్రసంగించారు.
తన పర్యటనలో భాగంగా నమసాయిలో ఆర్మీ, ఇండో-టిబిటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సర్వీసెస్ సెక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బీ), అసోం రైఫిల్స్, బోర్డర్ రోడ్ ఆర్గనైజేష్, నేషనల్ హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఐడీఎల్సీ) సిబ్బందిని కలుసుకుని భద్రత, అభివృద్ధిని అమిత్షా సమీక్షించారు.
More Stories
మహిళలు, రైతులు, నిరుద్యోగులపై కూటమి వరాల జల్లు
జేడీఎస్ నుంచి ప్రజ్వల్ రేవణ్ణ సస్పెండ్
బీజేపీకి 400 సీట్లు పక్కా! ఓటమి భయంతో ప్రతిపక్షాలు