ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈద్ సందర్భంగా రోడ్లపై నమాజ్ చేయడం ఆగిపోయిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ రామనవమి సందర్భంగా మత ఘర్షణలు జరగలేదని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి బాగుందని ఆయన చెప్పారు.
‘‘ఉత్తరప్రదేశ్లో రామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రంలో ఎక్కడా అల్లర్లు జరగలేదు. ఉత్తరప్రదేశ్లో తొలిసారిగా ఈద్, అల్విదా జుమా సందర్భంగా నమాజ్ను రోడ్డుపై నిర్వహించలేదు’’ అని యోగి వెల్లడించారు.
ప్రముఖ జాతీయ వారపత్రికలు ఆర్గనైజర్, పాంచజన్యల 75వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొంటూ గతంలో ముజఫర్నగర్, మీరట్, మొరాదాబాద్ తదితర ప్రాంతాల్లో అల్లర్లు జరిగేవని, నెలల తరబడి కర్ఫ్యూలు ఉండేవని ఆయన గుర్తు చేసారు. అయితే గత ఐదేళ్లలో అల్లర్లు జరగలేదని స్పష్టం చేశారు.
‘‘మా ప్రభుత్వం రాష్ట్రంలోని అక్రమ కబేళాలను మూసివేసింది. గోవులను సురక్షితంగా ఉంచడానికి మేం రాష్ట్రంలో గోశాలలను నిర్మించాం. మేం మతపరమైన ప్రదేశాల్లోని లౌడ్ స్పీకర్లను కూడా తొలగించాం. మా ప్రభుత్వం 700 కంటే ఎక్కువ మతపరమైన స్థలాలను పునర్నిర్మించింది’’ అని యోగి వివరించారు.
రాష్ట్రంలో లక్షకు పైగా లౌడ్ స్పీకర్ల శబ్దం తగ్గించడమో లేదా వాటిని తొలగించడమో జరిగిన్నట్లు తెలిపారు. “ఇప్పుడు, మసీదులలో లౌడ్స్పీకర్ల వాల్యూమ్ తగ్గిపోయిందని లేదా లౌడ్ స్పీకర్ పూర్తిగా తీసివేయబడిందని మీరు వినే ఉంటారు. ఇప్పుడు ఈ లౌడ్ స్పీకర్లను పాఠశాలలు, ఆసుపత్రుల ఉపయోగం కోసం విరాళంగా ఇస్తున్నారు,” అని యోగి వెల్లడించారు.
రాష్ట్రంలోని విచ్చలవిడిగా తిరిగే పశువుల సమస్యపై ఆదిత్యనాథ్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. ‘‘రాష్ట్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్రమ కబేళాలన్నింటినీ మూసివేసిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. కానీ మేము వీధులు, పొలాల్లో విచ్చలవిడిగా పశువులు సంచరిస్తూ ఉండడంతో దీని ప్రతికూల పరిణామాలను భరించవలసి వచ్చింది” అని చెప్పారు.
“ఇంతకుముందు, వారు అక్రమ కబేళాలలోకి అక్రమంగా తరలించేవారు. ఈ సవాలును ఎదుర్కొనేందుకు, మేము విచ్చలవిడి పశువుల కోసం 5,600 షెల్టర్లను ఏర్పాటు చేసాము. మేము ఆవు పేడ నుండి సిఎన్జిని తయారు చేసే కొత్త మోడల్ను కూడా ఏర్పాటు చేస్తున్నాము. దీనిని ప్రజల నుండి కిలో రూ.1 చొప్పున కొనుగోలు చేస్తారు. గోవుల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాము” అని వివరించారు.
అయోధ్యలో “మహా రామాలయం”ను ఎలా నిర్మిస్తున్నారో, కాశీ విశ్వనాథ ఆలయ సముదాయాన్ని పునరుద్ధరించిన “వైభవం”, మధుర, బృందావనం, చిత్రకూట్ వంటి తీర్థయాత్రలలో కొత్త జీవితాన్ని ఎలా చొప్పించడం గురించి కూడా ఆదిత్యనాథ్ ప్రస్తావించారు.
యుపి “డబుల్ ఇంజన్” ప్రభుత్వంలో దేశంలోనే నంబర్ 2 ఆర్థిక వ్యవస్థగా మారడం ప్రారంభించిందని ఆదిత్యనాథ్ భరోసా వ్యక్తం చేశారు. 70 ఏళ్లలో దేశంలోని ఆర్థిక వ్యవస్థల్లో యూపీ ఆరో స్థానానికి చేరుకుంది. గత 70 ఏళ్లలో యూపీ తలసరి ఆదాయం దేశం మొత్తంలో నాలుగో వంతుగా ఉంది. గత ఐదేళ్లలో దీన్ని రెట్టింపు చేశాం అని తెలిపారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో యూపీ దేశంలోనే నెం.2 స్థానానికి ఎగబాకిందని చెబుతూ జీవన సౌలభ్యంలో, 44 పథకాలలో, యుపి నెం.1. యూపీలో ఉందని చెప్పారు. అత్యధిక మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతోందని పేర్కొంటూ ఆ రాష్ట్రాన్ని ఇప్పుడు ఎక్స్ప్రెస్వేగా పిలుస్తున్నామని గుర్తు చేశారు.
అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మ, మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్, హర్యానా ఎంఎల్ ఖట్టర్, గోవా ముఖ్యమంత్రి సావంత్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా ప్రసంగించారు.
More Stories
నేడు 92 స్థానాల్లో మూడో దశ ఎన్నికల పోలింగ్
ఎన్డీఏది అభివృద్ధి మంత్రం – వైసీపీది అవినీతి తంత్రం
కేజ్రీవాల్పై ఎన్ఐఏ దర్యాప్తునకు ఎల్జీ సక్సేనా సిఫార్సు