కరోనా మహమ్మారి నుండి ఉపశమనం కలిగినదని భరోసాతో దేశ ప్రజలు అందరు దాదాపుగా సాధారణ స్థితికి చేరుకొంటున్న సమయంలో భారత్లో ఒమిక్రాన్ సబ్వేరియెంట్ కేసుల కలకలం మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా కరోనా వైరస్ వ్యాప్తిని చెందిస్తున్న వేరియెంట్లుగా బీఏ.4, బీఏ.5లను పరిశోధకులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో ఈ రెండు ఉపవేరియెంట్ల కేసులు ఇప్పుడు మన దేశంలోనూ వెలుగు చూడడం ఆందోళనకు గురి చేస్తోంది. బీఏ.4 కేసులు తెలంగాణ, తమిళనాడులో మాత్రమే వెలుగు చూడగా, బీఏ.5 కేసు తెలంగాణలోనే బయట పడటం గమనార్హం.
భారత్లో బీఏ.4, బీఏ.5 సబ్వేరియెంట్ కేసులు బయటపడినట్లు ఇన్సాకాగ్ ప్రకటించింది. ఇన్సాకాగ్ (ఇండియన్ సార్స్ కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం).. కరోనా వేరియెంట్ల కదలికలపై, కేసుల పెరుగుదలపై నిరంతర పర్యవేక్షణ నిర్వహించే కేంద్ర ఆధీన విభాగం.
ఒమిక్రాన్ వేరియంట్ లో ఉపవేరియెంట్లు బీఏ.4, బీఏ.5లు.. కరోనాలో ఇప్పటిదాకా అత్యంత వేగవంగా వైరస్ను వ్యాప్తి చెందించేవిగా పేరొందాయి. దక్షిణాఫ్రికా నుంచి దీని విజృంభణ మొదలైంది. అయితే ఒమిక్రాన్ ప్రధాన వేరియంట్ కంటే ఇవి ప్రమాదకారి కాదని, కాకపోతే వీటి ద్వారా సామాజిక వ్యాప్తి మాత్రం అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే స్పష్టం చేసింది.
ఇన్సాకాగ్ ఆదవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తమిళనాడులో 19 ఏళ్ల యువతిలో బీఏ.4 ఉపవేరియెంట్ బయటపడిందని, అలాగే తెలంగాణలో (హైదరాబాద్ ఎయిర్పోర్ట్) సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి శాంపిల్లోనూ ఈ ఉపవేరియెంట్ వెలుగు చూసిన్నట్లు తెలిపింది.
మరోవైపు తెలంగాణలోనే 80 ఏళ్ల వ్యక్తికి బీఏ.5 ఉపవేరియెంట్ కనుగొన్నట్లు ఇన్సాకాగ్ తెలిపింది. ఈ వృద్ధుడికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని, పైగా వ్యాక్సినేషన్ ఫుల్గా పూర్తికాగా, కేవలం స్వల్పకాలిక లక్షణాలే బయటపడినట్లు తెలిపింది. ముందస్తు జాగ్రత్తగా అప్రమత్తమైన అధికారులు కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలుపెట్టారు.
భారత్లో ఇప్పటికే టీకా కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టడం వల్ల ఈ రెండు సబ్ వేరియంట్ల ప్రభావం స్వల్పంగానే ఉండవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు సబ్ వేరియంట్ల వల్ల కొద్దిరోజుల్లో కేసులు పెరగవచ్చు, కానీ, ఉధృతి తక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు.
బాధితులకు తీవ్రస్థాయి అనారోగ్య ముప్పు, ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితులు ఉండవని స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ.. మరిన్ని వేరియెంట్లు, అందులో ప్రమాదకరమైనవి ఉండే అవకాశాలు ఉన్నందున అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు.
అయితే, దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకు అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో 2022 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 46 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 4.31 కోట్లకు చేరుకోగా 5.24 లక్షల మంది మృత్యువాతపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఒమిక్రాన్ వేరియంట్లు బిఎ4, బిఎ5లను జీనోమ్ టెస్టులో గుర్తించారు. ఈ వేరియంట్లలో స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. దేశ వ్యాప్తంగా 192 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని కేంద్రం వెల్లడించింది.
More Stories
పోలింగ్కు ముందే జారిపోతున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు
పోలవరం పూర్తి చేసే బాధ్యత నాది
సీఎం రమేష్ అరెస్ట్.. కాన్వాయ్ పై వైసీపీ నేతల దాడి