12.9 బిలియన్ డాలర్లు ఆదాయం కోల్పోతున్న కేంద్రం 

పెట్రోలు, డీజిల్‌ లపై ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించడం వల్ల ఏర్పడిన ఆదాయ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అదనపు రుణం కోసం ప్రయత్నించే అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శనివారం ప్రకటించిన నిర్ణయం వల్ల దాదాపు 12.9 బిలియన్ డాలర్లు (రూ లక్ష కోట్లకు పైగా) ఆదాయాన్ని కేంద్రం కోల్పోతుందని అంచనా. 

విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, వస్తు, సేవల పన్ను, వ్యక్తిగత ఆదాయపు పన్ను ద్వారా వసూలైన సొమ్ము పేదలు, రైతులకు ఆహారం, ఎరువుల కోసం రాయితీలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇటీవల తగ్గించిన ఎక్సయిజ్ సుంకాల వల్ల ఖజానాకు రాబోతున్న నష్టాన్ని అదనపు రుణాల ద్వారా భర్తీ చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రుణ భారం పెరుగుతుండటంతో భారత దేశ బాండ్ మార్కెట్‌పై ప్రభావం పడుతుంది. గత నెలలో బెంచ్‌మార్క్ 10 ఇయర్ నోట్స్‌పై రాబడిలో పెరుగుదల కనిపించింది. భారతీయ రిజర్వు బ్యాంకు ఈ నెలలో వడ్డీ రేట్లను పెంచి మదుపరులను ఆశ్చర్యపరిచింది. కేంద్ర ప్రభుత్వం శనివారం పెట్రోలు, డీజిల్‌లపై ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించడంతోపాటు, కోకింగ్ కోల్‌పై దిగుమతి పన్నును తగ్గించింది. అదేవిధంగా ఎరువులపై రాయితీలను పెంచింది.

అంతేకాకుండా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం క్రింద పేదలకు అందిస్తున్న వంటగ్యాస్ సిలిండర్ ధరలో రాయితీని పెంచింది. ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు తేవాలని ప్రణాళికను రచిస్తుండటాన్ని, ధరల ఒత్తిళ్ళు పెరుగుతుండటాన్ని, ఆర్బీఐ వడ్డీ రేట్ల పెరుగుదలను మదుపరులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

కాగా, కేంద్రం పన్నులు తగ్గించడంతో స్పందిస్తూ కేరళ, రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాలు కూడా పెట్రో ఉత్పత్తుల పన్నును తగ్గించాయి. కేరళ ప్రభుత్వం పెట్రోల్ పై రూ. 2.41, డీజిల్ పై రూ. 1.36 తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ పెట్రోల్ పై రూ. 2.48, డీజిల్ పై రూ. 1.36 తగ్గించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ వెల్లడించారు. ఒడిశా పెట్రోల్ పై రూ. 2.23, డీజిల్ పై రూ. 1.36 తగ్గించింది.

ఇమ్రాన్ ఖాన్ ప్రశంస 

ఇలా ఉండగా, పెట్రోలు, డీజిల్‌లపై పన్నులను తగ్గించిన భారత ప్రభుత్వంపై పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు కురిపించారు. అమెరికా ఒత్తిళ్ళు తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రజలకు ఉపశమనం కల్పించడం కోసం రష్యా నుంచి డిస్కౌంట్ రేటుతో చమురును భారత్ కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. 

క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డయలాగ్ (క్వాడ్) దేశాల్లో భారత దేశం ఒకటి అని, అయినప్పటికీ, భారత దేశం అమెరికా ఒత్తిడిని తట్టుకుని, సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించడం కోసం రష్యా  నుంచి డిస్కౌంట్ రేటుతో చమురును కొనుగులో చేసిందని ప్రశంసించారు.

స్వతంత్ర విదేశాంగ విధానంతో పాకిస్థాన్‌ లో కూడా ఇటువంటిదానిని సాధించేందుకు తన ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్-ఎన్ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం దిక్కు తోచని స్థితిలో అటూ ఇటూ పరుగులు తీస్తోందని దుయ్యబట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థ అరాచక స్థితిలో ఉందని అంటూ  మీర్ జాఫర్లు, మీర్ సాదిక్‌లు విదేశీ ఒత్తిళ్ళకు తలొగ్గి ప్రభుత్వాన్ని మార్చేశారని ఆరోపించారు.