అథ్లెట్గా మొదలు పెట్టిన నిఖత్ బాక్సర్గా ఎదిగింది. నిజామాబాద్లో ప్రముఖ బాక్సింగ్ కోచ్గా గుర్తింపు ఉన్న శంషముద్దీన్ ఆమెలో ప్రతిభను చూసి సత్తా చాటేందుకు సరైన వేదిక కల్పించాడు. దాంతో 13 ఏళ్ల వయసులో ఆటను మొదలు పెట్టిన నిఖత్ ఆరు నెలల వ్యవధిలోనే రాష్ట్ర స్థాయిలో విజేతగా నిలవడంతో పాటు రూరల్ నేషనల్స్లో కూడా పాల్గొని స్వర్ణం సాధించింది.
ఆ తర్వాత మరో మూడు నెలలకే జాతీయ సబ్ జూనియర్ స్థాయిలో బెస్ట్ బాక్సర్గా నిలిచింది. ఆ తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ క్యాంప్లోకి ఎంపిక కావడంతో నిఖత్కు తన భవిష్యత్తు ఏమిటో స్పష్టమైంది. ఇప్పుడు ప్రపంచాన్ని గెలిచిన టర్కీలోనే నిఖత్ 2011లో జూనియర్ వరల్డ్ చాంపియన్గా కూడా నిలిచింది. అదే ఆమె విజయాలకు పునాది. ఈ గెలుపుతో జాతీయ బాక్సింగ్లో నిఖత్పై అందరి దృష్టి పడింది.
జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఆర్థిక సహకారం అందించడంతో ఆమె ఆటకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. ఇదే జోరులో యూత్ బాక్సింగ్లో రజతం, నేషన్స్ కప్, థాయిలాండ్ ఓపెన్లలో పతకాలు వచ్చాయి. ప్రతిష్టాత్మక స్ట్రాండ్జా మెమోరియల్ టోర్నీలో 2019లో స్వర్ణం గెలవడంతో భవిష్యత్ తారగా గుర్తింపు దక్కింది.
పారిస్లో జరిగే 2024 ఒలింపిక్స్లో పతకం లక్ష్యంగా నిఖత్ సిద్ధమవుతోంది. అయితే ఆమె పతకం గెలిచిన కేటగిరీ 52 కేజీలు ఒలింపిక్స్లో లేదు. 50 కేజీలు లేదా 54 కేజీలకు మారాల్సి ఉంటుంది. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆమె సాధన చేయాల్సి ఉంది.
ప్రతిష్టాత్మక ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో నిజామాబాద్ కు చెందిన నిఖత్ జరీన్ విశ్వ విజేతగా నిలవడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. బంగారు పతకాన్ని సాధించిన జరీన్కు శుభాకాంక్షలు తెలిపారు. భారత కీర్తి పతాకాన్ని విశ్వ క్రీడా వేదిక మీద ఎగరేసిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ ను మనస్ఫూర్తిగా అభినందించారు.
More Stories
వీవీప్యాట్లపై పిటిషన్లను కొట్టేసిన సుప్రీం కోర్టు
లండన్ భారత హైకమిషన్పై దాడి నిందితుడి అరెస్ట్
అగ్నికి ఆజ్యం పోసిన శామ్పిట్రోడా వారసత్వ పన్ను ప్రస్తావన