నిజాయితీకి నిదర్శనం `ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం

* వర్ధంతి నివాళి 
ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి, ఆ తర్వాత  మొట్ట మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రకు మొదటి ముఖ్యమంత్రిగా సేవలు అందించిన ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం నిజాయతీకి నిదర్శనంగా నిలిచిన మేటి నాయకుడు. ప్రజాసేవలో తన సర్వస్వాన్ని అర్పించిన మహోన్నత త్యాగశీలి. తెలుగు వారి పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన మహా నాయకుడు. 
 
నాలుగో తరగతి చదువుతున్న ఓ కుఱ్ఱాడు తన పరీక్ష ఫీజు కు మూడు రూపాయలు లేక, వాటికోసం తన ఊరుకు 25 మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ళ బావగారింటికి కాలినడకన బయల్దేరాడు. తీరా అక్కడకు వెడితే ‘నాదగ్గర మాత్రం ఎక్కుడున్నాయిరా’ అన్నాడా బావ గారు.చేసేదేముందనుకుంటూ కాళ్ళీడ్చుకుంటూ 25 మైళ్ళు తిరిగి నడుచుకుంటూ ఇంటికొచ్చేసాడు ఆ కుఱ్ఱాడు. 
 
ఆ పరిస్థితికి తల్లడిల్లిపోయిన అతని తల్లి తన పెళ్ళినాటి పట్టుచీరను అమ్మి ఆ మూడు రూపాయల ఫీజు కట్టింది.ఆ తర్వాత ఎన్నో ఎన్నెన్నో ఢక్కామొక్కీలు తిని తనకిష్టమైన ప్లీడరీ పరీక్షలో నెగ్గి, అక్కడితో తృప్తి పడక ఇంగ్లాండ్ పోయి బారిష్టర్ అయి మద్రాస్ మైలాపూర్ అరవ మేధావులతో పోటీపడి న్యాయవాద వృత్తి చేపట్టారు. 
 
 ఆ రోజులలోనే (1917-18 నాటికే) రోజుకు వెయ్యి రూపాయల ఫీజు తీసుకునే స్థాయిలో, కోస్తా జిల్లా లన్నిటిలో భూములు బంగళాలు కొనుగోలు చేసేటంతగా ఎదిగిన మన కాలపు మేరునగధీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు. ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెము గ్రామంలో సుబ్బమ్మ, గోపాలకృష్ణయ్య దంపతులకు 23 ఆగష్టు, 1872న జన్మించారు. 11 ఏళ్ళ వయస్సులోనే తండ్రి చనిపోవడంతో, ఆ రోజులలో చులకనగా చూసే ఓ హాస్టల్ ను ఒంగోలులో నడుపుతూ తల్లి ఆయనను పెంచింది. 
 
ఆయన ఉపాధ్యాయుడు హనుమంతరావు రాజమండ్రికి బదిలీపై వెడుతూ అక్కడ ఎక్కువగా చదువుకొనే అవకాశాలు ఉంటాయని ప్రకాశంను కూడా తీసుకెళ్లి చదివించారు. చిన్నప్పటి నుండి న్యాయవాది వృత్తిపట్ల ఆసక్తి ఏర్పర్చుకున్న ఆయన పట్టుదలతో సాధించుకొని, ఆ వృత్తిలో బాగా రాణించారు. అయితే  గాంధీజీ పిలుపుతో తన ప్లీడరు వృత్తిని వదిలి జాతీయోద్యమంలోకి ఉరికారు.
నీయవాదిగా ఎంతోమందిని జైళ్ళనుంచి బైటకు తెచ్చిన ఆయన ప్రజల కోసం తాను స్వచ్చందంగా జైలు శిక్షను అనుభవించాడు.గాంధీజీ ఆశయాల ప్రచారం కోసం ‘స్వరాజ్య’ పత్రికను స్థాపించి గాంధీజీకి నిజమైన అనుచరునిగా ఆయన మెప్పును పొందారు.అదే గాంధీజీ కొందరి చెప్పుడు మాటలు విని ఆయనను తప్పు పట్టుకుంటే గాంధీజీని సైతం నిలదీశాడు.
సైమన్ కమీషన్ కు వ్యతిరేకంగా మద్రాస్ నగరంలో హర్తాళ్ జరిగినప్పుడు తెల్లవాడి తుపాకీకి తన గుండెనే ఎదురు పెట్టారు. ఆనాటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి రెవిన్యూ మంత్రిగా,ముఖ్యమంత్రి గా పనిచేశారు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు (1953)తొలి తెలుగు ముఖ్యమంత్రి అయ్యారు.
 
దురాశాపరుల మూలంగాన, శాసనసభ స్పీకర్ తెలివి తక్కువ తనం మూలంగానూ ఒకే ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం పతనమైనప్పుడు,  వ్యతిరేకంగా ఓటు వేసిన వారు తమ తప్పు తెలుసుకొని మళ్ళీ ఓటింగ్ కు వెడదామని బతిమాలుకున్నా వినకుండా శాసనసభ నుండి తిన్నగా గవర్నర్ వద్దకు వెళ్ళి తన రాజీనామాను సమర్పించారు.
 
కేవలం 13 నెలల తన ప్రభుత్వ కాలంలో ఆ రోజుల్లోనే 14 నీటి పారుదల ప్రాజెక్టులు స్థాపించారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపించారు. తెలుగు వారికి ఓ హైకోర్టు స్థాపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణకు కావలసిన మార్పులకు శాసనబద్దత కల్పించారు. సహకార రంగంలో తెలుగు రాష్ట్రాన్ని ప్రధమ స్థానంలో నిలిపారు.
 
బెజవాడలో కాటన్ దొర కట్టిన బరాజ్ కొట్టుకుపోయే పరిస్థితి వస్తే ఆనాటి కేంద్ర ప్రభుత్వం పైసా కూడ ఇవ్వలేమని స్పష్టం చేస్తే, రాష్ట్ర నిధులన్నీ మళ్ళించి యుద్ధ ప్రాతిపదికన బరాజ్ ను బాగుచేయించి నిలబెట్టారు. ఆ భారాన్ని పన్నుల రూపంలో ప్రజల మీద వెయ్యకుండా ఆ లోటును సరిదిద్దారు. అందుకే ప్రజలందరూ ఆ బరాజ్ ను ఆయన పేరునే ప్రకాశం బారేజ్ గా పిలుచుకుంటున్నారు.
 
రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా దేశంలోనే తొలిసారిగా ఖైదీలందరినీ విడుదల చేశారు. అంతటి మహనీయుడు తన చరమ దశలో కటిక దారిద్రయాన్ని అనుభవించారు. తనను శాలువతో సత్కరిస్తే ‘ఈ శాలువ నాకెందుకురా! ఆ డబ్బుతో అరటిపళ్ళు కొనిస్తే  ఓ పూట గడిచేది కదురా!!’ అని తన అనుచరునితో అన్నారంటే ఆయన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఆయన మూలంగా అధికారంలోకి వచ్చిన మహా నాయకులందరూ అధికారం కోసం ఆయనకు వెన్నుపోటు పొడిచినా అధికారం కోసం పాకులాడలేదు. 85 సంవత్సరాల వయస్సులో రోహిణీ కార్తె మండుటెండలో వడదెబ్బకు మరణించిన ఇద్దరు ముదుసలుల కుటుంబ పరామర్శ కోసం వెళ్ళి తాను వడదెబ్బకు గురై 1957 మే 20న మృతిచెందారు.