దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్ బూటకమని సుప్రీం కోర్ట్ నియమించిన జస్టిస్ వి.ఎస్ సిర్పూర్కర్ కమిషన్ తేల్చింది. ఈ మేరకు 387 పేజీల నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ వ్యవహారంలో పోలీసులపై హత్యానేరం కింద విచారణ జరపాలని కమిషన్ అభిప్రాయపడింది.
నిందితులు ఎదురుకాల్పుల్లో మరణించారన్న పోలీసుల వాదన నమ్మశక్యంగా లేదంటూ అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో జస్టిస్ వి.ఎస్ సిర్పూర్కర్ కమిషన్ పేర్కొంది. పోలీస్ మాన్యువల్కు విరుద్ధంగా విచారణ జరిగిందని కమిషన్ పేర్కొంది.
ప్రజల ఆగ్రహాన్ని కట్టడి చేసేందుకే ఎన్కౌంటర్ జరిగిందని సిర్పూర్కర్ కమిషన్ స్పష్టం చేసింది. ఈ ఎన్కౌంటర్లో 10 మంది పోలీసులు పాల్గొన్నారని.. వీరిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారించాలని కమిషన్ పేర్కొంది. పోలీస్ అధికారులు సురేందర్, నరసింహారెడ్డి, షేక్లాల్ మదార్, సిరాజుద్దీన్, రవి, వెంకటేశ్వర్లు, అరవింద్గౌడ్, జానకీరామ్, బాలురాథోడ్, శ్రీకాంత్ ఈ ఘటనకు పాల్పడ్డారని సిర్పూర్కర్ కమిషన్ వెల్లడించింది.
అనుమానిత నిందితులను హతమార్చాలన్న ఉద్దేశంతోనే కాల్పులు జరిపారని పేర్కొన్నారు. వీరిపై ఐపీసీ 302, 201 ప్రకారం కేసు నమోదు చేయాలని కమిషన్ స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన దిశ ఎన్కౌంటర్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు పంపిస్తున్నట్టు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. సిర్పూర్కర్ కమిషన్ నివేదికను సాఫ్ట్కాపీ రూపంలో.. కేసులోని భాగస్వాములందరికీ పంపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
నివేదికపై ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పుకోవాలని సూచించింది. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం.. విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. దిశ కేసుకు సంబంధించి అన్ని రికార్డులను హైకోర్టుకు పంపించింది.
నివేదికలో సిర్పూర్కర్ కమిషన్ 16 సిఫార్సులు చేసింది. సత్వర న్యాయం పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదని పేర్కొంది. ఇవి మూక దాడులు లాంటివేనని సిర్పూర్కర్ కమిషన్ స్పష్టం చేసింది. పోలీసులు శరీరానికి కెమెరాలు తగిలించుకోవాలని తెలిపింది. నేర దర్యాప్తు విభాగాన్ని శాంతిభద్రతల విభాగంతో వేరు చేయాలని సూచించింది.
More Stories
తెలంగాణాలో అన్ని స్థానాల్లో బిజెపి క్లీన్స్వీ ప్
పోలీసుల తీరుపై మాధవీలత అసహనం
2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యంగా మోదీ