కేసీఆర్ వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం

సీఎం కేసీఆర్ వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని బిజెపి ఎమ్యెల్యే ఎన్ రఘునందన్ రావు ఆరోపించారు. 290 టీఎంసీల నీటి వినియోగానికి అంగీకరిస్తూ కేసీఆర్ సంతకం పెట్టిన విషయం కేటీఆర్కు తెలియకపోవడం హాస్యాస్పదం అని ఎద్దేవా చేశారు. 

వాస్తవాలు బయటకు రాకూడదన్న ఉద్దేశంతోనే రిటైరైన అధికారులను ఇంకా పదవుల్లో కొనసాగిస్తున్నారని విమర్శించారు. మంత్రి కేటీఆర్కు తొందరెక్కువైందనిచెబుతూ టీఆర్ఎస్ పునాదులు కదులుతున్నాయన్న ఆందోళన ఆయనలో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. 

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను విమర్శిస్తూ కేటీఆర్ బహిరంగ లేఖ వ్రాయడంపై స్పందిస్తూ  నదీ జలాల పంపకంపై ప్రతినిధుల బృందాన్ని ఏర్పాటు చేయకుండా కేసీఆర్ ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని మండిపడ్డారు.

కేసీఆర్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం వల్లే కృష్ణా నదీ జలాల పంపకాల్లో జాప్యం జరుగుతోందని రఘునందన్ ఆరోపించారు. 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామన్న హామీ ఏమైందని రఘునందన్ ప్రశ్నించారు. గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో మినహా రాష్ట్రంలో మరెక్కడా 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.

రైతుల డిమాండ్ మేరకు రాత్రి పూట కూడా విద్యుత్ ఇవ్వాల్సి   ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉచిక విద్యుత్ పై క్షేత్రస్థాయి వాస్తవాలు భిన్నంగా ఉన్నాయని చెబుతూ దీనిపై టీఆర్ఎస్ పెద్దలు చర్చకు రావాలని రఘునందన్ సవాల్ చేశారు.