తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబ పాలనను తరిమికొట్టే లక్ష్యంతోనే ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ స్పష్టం చేశారు.గురువారం అలంపూర్ జోగుళాంబ అమ్మవారిని బండి సంజయ్, ఇతర బీజేపీ నేతలు దర్శించుకున్నారు. తర్వాత హరిత హోటల్ వెనుక మైదానంలో బహిరంగ సభ నిర్వహించి.. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో గడపగడపకూ వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుంటామని,కేసీఆర్ పాలనలో పడుతున్న ఇబ్బందులను వివరించి చైతన్యవంతం చేస్తామని సంజయ్ చెప్పారు. గడీల పాలన తీరు, కేసీఆర్ బాగోతాలన్నీ బయటపెడతామని వెల్లడించారు.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే హిందూ పండగలకు వెసులుబాట్లు కల్పిస్తామని తెలిపారు. ‘‘వడ్లు కొనేది, పైసలిచ్చేది కేంద్రమేనని మేం ముందు నుంచే చెప్తున్నం. అయినా సీఎం కేసీఆర్ వడ్లు కొనబోమంటూ రైతులను అరిగోస పెట్టిండు. వరి వేస్తే ఉరే అన్నడు. మేం పోరాడినం. కేసీఆర్ మెడలు వంచి వడ్లు కొనేలా చేసినం” అంటూ తెలిపారు.
కేసీఆర్.. వడ్ల పేరుతో ఢిల్లీలో దొంగ దీక్ష చేసినవ్.. పైసల సంచులు పట్టుకుని వేరే రాష్ట్రాలకు తిరగడం కాదు.. జనంలోకి రా అంటూ సంజయ్ సవాల్ చేశారు. నువ్వు ప్రగతిభవన్లో, ఫామ్హౌస్లో ఉంటవ్.. నేను జనం మధ్య ఉంటా అని పేర్కొంటూ కేసీఆర్ ఆ వర్గాన్ని ఈ వర్గాన్ని కాదు. అందరినీ మోసం చేసిండు అని ధ్వజమెత్తారు.
ఇకముందు కేసీఆర్ పతనాన్ని బ్రహ్మదేవుడు కూడా ఆపలేడని సంజయ్ స్పష్టం చేశారు. నిన్ను, నీ పార్టీని జనం కట్టకట్టి తుంగభద్రలో పడేయడం ఖాయం అని భరోసా వ్యక్తం చేశారు. కేసీఆర్కు మైనారిటీలంటే భయం అంటూ 15 నిమిషాలు టైమిస్తే దేశంలో హిందువులందరినీ చంపుతానన్న ఎంఐఎం నేతపై ప్రభుత్వం సాక్ష్యాధారాలను సమర్పించకపోవడం వల్లే కోర్టు కేసు కొట్టేసిందని మండిపడ్డారు.
అయినా మేం వదిలిపెట్టం. కేసులు తిరగదోడుతాం. శివాజీ మహారాజ్ హిందూ ద్రోహుల తలలు ఎలా నరుక్కుంటూ పోయిండో.. అలా అవినీతి, నియంత, కుటుంబ పాలనను అంతం చేసేందుకు బయలుదేరుతున్నం అంటూ హెచ్చరించారు. కేసీఆర్ హిందూ ద్రోహి. మైనార్టీ ఓట్ల కోసం హిందూ సమాజాన్ని, హిందూ దేవాలయాలను అవమానిస్తున్నడు అంటూ దుయ్యబట్టారు.
రంజాన్, బక్రీద్కు నమాజ్ కోసం, ఇఫ్తార్ కోసం ముస్లింలకు ప్రత్యేక అనుమతులిస్తూ జీవోలు జారీ చేస్తరు. మరి అయ్యప్ప, శివ, హనుమాన్ భక్తులు ఏం చేశారు? అంటూ ప్రశ్నించారు. వారి భిక్షకు టైం ఇవ్వరు. పైగా మాల వేసుకున్నవాళ్లు డ్యూటీకి రావొద్దంటరు అంటూ విమర్శించారు.
బీజేపీకి అధికారంలోకి వచ్చాక అయ్యప్ప, హనుమాన్, శివమాల ధరించే భక్తులకూ ప్రత్యేక జీవోలిచ్చి స్వేచ్ఛగా పూజలు, భిక్ష చేసుకునేలా వెసులుబాటు కల్పిస్తామని సంజయ్ ప్రకటించారు. అష్టాదశ శక్తి పీఠమైన జోగుళాంబ అమ్మవారి దగ్గర, ఇతర ఆలయాల్లో అధికారికంగా దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని వెల్లడించారు.
“మేం ముస్లింలుసహా ఎవరికీ వ్యతిరేకంకాదు. అలా అని హిందువులపట్ల చిన్నచూపును సహించం’’ అని సంజయ్ స్పష్టం చేశారు. పాదయాత్ర తొలిరోజు అలంపూర్ నుంచి 4 కిలోమీటర్లు సాగి రాత్రి 11.30కి ఇమాంపురంలో ముగిసింది. శుక్రవారం అక్కడి నుంచి బయల్దేరి.. లింగనవాయి, డి–బూడ్దిపాడు, ఉండవెల్లి, కంచుపాడు మీదుగా 13 కిలోమీటర్లు్ల యాత్ర సాగనుంది.
టీఆర్ఎస్ కుటుంబ పాలన అంతం చేద్దామని బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్చుగ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కేసీఆర్ బంగారు తెలంగాణ పేరుతో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజల గొంతుకగా మారి.. నియంత పాలనపై పోరాడుతామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను చూసి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టుల పేరిట కేసీఆర్ మోసం చేస్తున్నారని.. ముందే ఉన్న రిజర్వాయర్లతో నీళ్లు వస్తున్నాయే తప్ప కేసీఆర్ చేసిందేమీ లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో భవిష్యత్ బీజేపీదేనని స్పష్టం చేస్తూ బీజేపీని అడ్డుకునే శక్తి కేసీఆర్ డబ్బు సంచులకు, మద్యం సీసాలకు లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. అన్ని వర్గాలను మోసం చేసిన సీఎం కేసీఆర్ను ప్రజలు క్షమించబోరని మాజీ ఎంపీ జితేందర్రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ మెదడు బూజుపట్టిందని.. అందుకే ఏ సీఎం చెప్పని విధంగా రాజ్యాంగాన్ని మారుస్తానని అంటున్నారని విజయశాంతి విమర్శించారు.
More Stories
దిశ ఎన్కౌంటర్ కేసులో హైకోర్టులో పోలీసులకు ఊరట
ఢిల్లీ పోలీసులను 4 వారల గడువు కోరిన రేవంత్ రెడ్డి
ఢిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపులు