నేషనల్ హెరాల్డ్ ను స్వాతంత్య్రోద్యమ సమయంలో 1938లో జనానికి వార్తలు చేరవేయడానికి పండిట్ జవహర్లాల్ నెహ్రూతో పాటు పలువురు స్వాతంత్య్ర సమరయోధులు కలిసి రూ.5 లక్షల మూలధనంతో ఏర్పాటు చేశారు. అసోసియేడ్టె జర్నల్స్ అనే కంపెనీ దీంతో పాటు పేరు లేని చిన్నాచితకా పత్రికల్నీ ప్రచురించేది. స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో ఈ కంపెనీకి అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు భూములు, భవనాల రూపంలో పలు రకాల ఆస్తుల్ని కట్టబెట్టాయి.
అయితే ఆస్తులు పెరిగినా పత్రికగా మాత్రం అది రాణించలేకపోయింది. ఢిల్లీలోని ప్రఖ్యాత హెరాల్డ్ హౌస్తో పాటు కోట్ల రూపాయల ఆస్తులున్నా జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో 2008కి వచ్చేసరికి మూతపడింది. జీతాలతో పాటు ఇతర బకాయిలూ పేరుకుపోవటంతో కాంగ్రెస్ దీన్ని కాపాడాలనుకుంది. ప్రజల నుంచి చందాలు, విరాళాల రూపంలో వసూలు చేసిన పార్టీ నిధి నుంచి అసోసియేటెడ్ జర్నల్స్కు రూ.90 కోట్లు అప్పు ఇచ్చింది. ఆ డబ్బుతో దాని రుణాలు తీర్చుకోమంది.
అసోసియేటెడ్ జర్నల్స్కు కాంగ్రెస్ పార్టీ రూ.90 కోట్ల అప్పిచ్చిన రెండేళ్లకు.,అంటే 2010 నవంబర్ లో రూ.5 లక్షల మూలధనంతో ‘యంగ్ ఇండియన్’ అనే సంస్థ పుట్టుకొచ్చింది. దీన్లో 76 శాతం వాటా సోనియా, రాహుల్ గాంధీలదే. మిగతా 24 శాతం మాత్రం గాంధీలకు నమ్మకస్తులుగా ఉంటూ వస్తున్న మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్లది (ఇప్పుడు వీరిద్దరూ సజీవంగా లేరు).
‘యంగ్ ఇండియన్’ పుట్టిన 15 రోజులకే దాని తరఫున అధికారిక ప్రతినిధిగా మోతీలాల్ వోరా ఓ అత్యద్భుతమైన ఒప్పందం చేసుకున్నారు. అదీ కాంగ్రెస్ కోశాధికారి మోతీలాల్ వోరాతోను.. అసోసియేటెడ్ జర్నల్స్ ఎండీ మోతీలాల్ వోరాతోను!!. అంటే మూడింటి తరఫునా రకరకాల హోదాల్లో తనే ఒప్పందంపై సంతకాలు పెట్టేశారు.
ఇంతకీ ఆ ఒప్పందం ఏంటో తెలుసా? రూ.90 కోట్ల రుణాన్ని అసోసియేటెడ్ జర్నల్స్ చెల్లించలేని పరిస్థితుల్లో ఉంది కనక.. దాని బదులు తామైతే ఓ 50 లక్షలు చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీకి ‘యంగ్ ఇండియన్’ ఓ ఆఫరిచ్చింది. యంగ్ ఇండియన్ ప్రతినిధిగా మోతీలాల్ వోరాయే ఈ మేరకు లేఖ రాశారు. దానిని కాంగ్రెస్ కోశాధికారిగా ఆయనే ఆమోదం తెలిపారు.
ఇటు అసోసియేటెడ్ జర్నల్స్కూ ‘యంగ్ ఇండియన్’ ఓ ప్రతిపాదన చేసింది. మీరెలాగూ రుణం చెల్లించలేరు.. మీ బదులు మేం చెల్లిస్తాం.. ఆ మేరకు వాటాను మాకు బదిలీ చేసేయండి.. అనేది దాని సారాంశం. ఈ లేఖ రాసిందీ వోరాయే. జర్నల్స్ ఎండీ హోదాలో దీనికి ఓకే చేసింది వోరాయే.
అంటే.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అప్పును ఓరా మేనేజింగ్ డైరెక్టరుగా ఉన్న అసోసియేటెడ్ జర్నల్స్ కంపెనీ తీర్చలేకపోవటంతో, ఆ రుణాన్ని 94 శాతాన్ని మాఫీ చేసి కంపెనీని మాత్రం సోనియా యజమానిగా ఉన్న యంగ్ ఇండియన్కు రూ.50 లక్షలిస్తే చాలునన్న లెక్కతో కట్టబెట్టేశారు. ఫలితం కాంగ్రెస్ ఇచ్చిన 90 కోట్లు గాయబ్ అయ్యాయి. అసోసియేటెడ్ జర్నల్స్కు చెందిన వేల కోట్ల ఆస్తులు సోనియా చేతికి వచ్చేశాయి.
నిజానికి 2008లో ఐటీ శాఖ దీని ఆస్తుల విలువను రూ.2 వేల కోట్లుగా లెక్కించింది. మార్కెట్ విలువ 5 వేల కోట్లపైనే. ఇలా ఉండగా, యంగ్ ఇండియన్ దగ్గర చెల్లించడానికి ఆ రూ 50 లక్షలు కూడా లేవు. దానికి బ్యాంకు ఖాతా లేదు. మరెలా? 2011 ఫిబ్రవర్లో యంగ్ ఇండియన్ సంస్థ డాటెక్స్ మర్చండైజింగ్ అనే కంపెనీ నుంచి రూ.1కోటి రుణం తీసుకుంది. దాంట్లో రూ.50 లక్షలను మార్చిలో కాంగ్రెస్ పార్టీకి చెల్లించింది.
అంటే 2010 డిసెంబర్లో రూ.90 కోట్ల సరుకు తీసుకుని 3 నెలలకు దానికి రూ 50 లక్షలు అప్పు తెచ్చి చెల్లించిందన్న మాట. రూ 90 కోట్లు పోతే పోయింది. ఎనలేని దయతో రూ.50 లక్షలు చెల్లించినందుకు ‘యంగ్ ఇండియన్’కు సంస్థలో 99 శాతం షేర్లు కేటాయించారు అసోసియేటెడ్ జర్నల్స్ ఎండీ మోతీలాల్ వోరా. అప్పటిదాకా కంపెనీలో షేర్లున్న 32,000 మంది షేర్హోల్డర్లు… ఈ కొత్త షేర్ల కేటాయింపుతో 1 శాతానికి పరిమితమైపోయారు. నిజానికి వాళ్లంతా నాటి స్వాతంత్ర సమరయోధులు.
నిబంధనల ప్రకారం వారి వారసులకు ఆ వాటా చెందాలి. వారసులెవరో తెలియనప్పుడు సదరు ఆస్తి ప్రభుత్వానికి చెందుతుంది. దీన్ని తప్పించుకోవటానికే ఈ కేటాయింపు జరిపారు. ఈ మొత్తం లావాదేవీల్లో కాంగ్రెస్ పార్టీ తన సభ్యుల నుంచి సేకరించిన రూ 89.5 కోట్ల రూపాయల్ని నష్టపోయింది. జర్నల్స్లో వాటా ఉన్న షేర్ హోల్డర్లు తమ వాటా విలువను పూర్తిగా కోల్పోయారు. కానీ రూ 50 లక్షలు పెట్టుబడితో సోనియా, రాహుల్ ఈ అసోసియేటెడ్ జర్నల్స్ ఆస్తులకు యజమానులైపోయారు.
More Stories
దేశం సుభిక్షంగా ఉండాలంటే మోదీ రావాలి
ఏపీని అన్ని విధాలా నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్’
మోదీ, రాహుల్ ప్రసంగాలపై ఈసీ నోటీసులు