కేంద్రం ఉచిత రేష‌న్ ప‌థ‌కం మ‌రో ఆరు నెల‌లు

దేశమంతటా 80 కోట్ల మంది పేదలకు నెలకు 5 కిలోల ఆహార ధాన్యాల సరఫరాకు ఉద్ధేశించిన రేషన్ పథకం సెప్టెంబర్ వరకూ కొనసాగుతుంది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్నా యోజన (పిఎంజికెఎవై) అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ అమలు చేయనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రకటించారు.

కరోనా లాక్‌డౌన్ తొలిదశలో కేంద్రం పేదల ఆకలితీర్చేందుకు ప్రతికుటుంబానికి నెలకు ఐదు కిలోల రేషన్‌ను ఉచితంగా పంపిణీ చేసే స్కీం తీసుకువచ్చింది. జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలో ఇప్పుడు సబ్సిడీ రేట్లకు ఇస్తున్న రేషన్ సరుకులకు అదనంగా ఈ ఉచిత సహాయం సంకల్పించారు.

ఈ పథకాన్ని సెప్టెంబర్ వరకూ కొనసాగించాలని కేంద్రం నిర్ణయించిందని ప్రధాని తెలిపారు. సెప్టెంబర్ వరకూ కొనసాగే ఈ పథకంతో ప్రభు త్వ ఖజనాకు అదనంగా రూ 80,000 కోట్ల భారం పడుతుంది. ఈ దేశం బలం అనేది దేశ ప్రతి పౌరుడి అధికారం జీవన శక్తిలోనే ఇమిడి ఉంది. ఈ చట్రంలోనే మరో ఆరునెలలు దీనిని పొ డిగిస్తున్నట్లు వివరించారు.

మరో వైపు ఉత్తర ప్రదేశ్‌లో రెండోసారి అధికారం చేపట్టిన యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం రాష్ట్రం సొంతంగా చేపట్టిన ఉచిత రేషన్ పథకాన్ని మరో మూడు నెలలు పొడిగించినట్టు తెలిపారు. రెండేళ్ల క్రితం ఆరంభమైన దేశవ్యాప్త ఉచిత రేషన్ పథకం ఈ నెలాఖరుతో నిలిచిపోవల్సి ఉంది. రెండేళ్లుగా ఈ స్కీం అమలు కు దాదాపు రూ. 2.6 లక్షల కోట్లు ఇప్పటికే వెచ్చించారు.

నెలలకు అదనపు ఖర్చు రూ 80,000 కోట్లు వచ్చిపడుతుంది. ఈ పథకాన్ని పొడిగిస్తూ ప్రధాని మోదీ నిర్ణయం తీసుకోవడం దేశ పేదల పట్ల ప్రధానికి ఉన్న సమాదరణ, సమాలోచనకు అద్దం పడుతుందని కేంద్ర ఆహార మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దేశంలో ఇప్పుడు గణనీయ స్థాయిలో కరోనా  తగ్గుముఖం పట్టింది. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయి. జనజీవితం గాడిలో పడుతోంది.

అయితే పేదలు నిలదొక్కుకునే బలం మరింత కల్పించేందుకు ఈ పథకాన్ని కొనసాగిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఏ ఒక్క పేద ఆకలితో పస్తులు ఉండరాదనే సంకల్పంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ప్రకటించారు. ఈ పథకం పరిధిలో ఆహార ధాన్యాల సరఫరాకు కేంద్రం 759 లక్షల టన్నుల సరుకులను కేటాయించింది.

దేశవ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వారు ఒక దేశం ఒక రేషన్ కార్డు పరిధిలో ఈ ఉచిత రేషన్ ప్రయోజనాన్ని ఎక్కడైనా పొందవచ్చు. ఈసారి దేశం తీవ్రస్థాయి కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొన్నా పరిస్థితిని ఎదుర్కొని రికార్డు స్థాయిలో రైతులు పంటలు పండించారు. ఈ విధంగా ఈ పథకం కొనసాగింపు వెనుక అన్నదాతల ఘనత ఉందని ప్రభుత్వం తెలిపింది.

ప్రభుత్వం అత్యధిక స్థాయిలో ధాన్య సేకరణకు దిగింది. రైతులకు ఇంతకు ముందెన్నడూ లేని స్థాయిలో ప్రభుత్వం గిట్టుబాటు ధరలను చెల్లించిందని వివరించారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఐదు లక్షల రేషన్ దుకాణాల ద్వారా ఉచిత రేషన్‌ను పేదల వద్దకు చేరుస్తున్నారు. ఇక ఇళ్లకు దూరంగా ఉన్న వలసకూలీలను గుర్తించి వారు రేషన్‌కార్డు కలిగి ఉంటే సరుకులు అందించేందుకు ఏర్పాట్లు జరిగాయి.ఈ విధంగా సంచార సరుకుల పంపిణీ ఏకంగా 61 కోట్ల మేర జరిగిందని తెలిపారు.