గుజరాత్‌లో దేశపు తొలి స్టీల్ రోడ్

దేశంలోనే తొట్టతొలి స్టీల్ రోడ్ గుజరాత్‌లోని సూరత్ పట్టణంలో ఏర్పాటు అయింది. అక్కడి హజిరా ఇండిస్ట్రియల్ ఏరియాలో శనివారం ఇది ప్రయాణాలకు అందుబాటులోకి వచ్చింది. 

ఉక్కు పదార్థాల వ్యర్థాలను కరిగించడం ద్వారా తయారయ్యే ద్రావకాన్ని ఉపయోగించి ఈ రాదారిని వేశారు. శాస్త్రీయ, పరిశ్రమల పరిశోధనా మండలి (సిఎస్‌ఐఆర్) నిపుణులు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ, పాలసీ కమిషన్, నీతి ఆయోగ్ సహకారంతో తగు నిర్మాణ ప్రక్రియలను మేళవించుకుని ఈ రోడ్‌కు శ్రీకారం చుట్టారు. 

దేశంలో స్వచ్ఛ భారత్ సంకల్పానికి దేశంలోని ఉక్కు వ్యర్థాలను సమీకరించుకుని రోడ్ల నిర్మాణానికి తగు ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఇందులో తొలి ప్రయత్నంగా సూరత్ స్టీల్ రోడ్ కనుల ముందుకు వచ్చింది.

దేశవ్యాప్తంగా ప్రతి ఏటా 19 మిలియన్ టన్నుల స్టీల్ వ్యర్థాలు వివిధ కర్మాగారాల నుంచి ఉత్పత్తి అవుతున్నాయి. ఇవి అత్యంత ప్రమాదకరంగా రసాయనిక ద్రవాలను మేళవించుకుని సమీపంలోని పంట పొలాలకు, భూగర్భజలాలకు జారుకుని పర్యావరణానికి, భూసారానికి నష్టం కల్గిస్తున్నాయి. 

ఈ తీవ్ర పరిణామాల దశలో ఈ వ్యర్థాలను తగు రీతిలో సేకరించి సద్వినియోగం చేసేందుకు, అన్ని కాలాల పరిస్థితులకు, భారీ వాహనాల రాకపోకలకు ధీటుగా ఉండే రోడ్లను నిర్మించేందుకు జాతీయ స్థాయిలో సంకల్పించారు. వినియోగంలోకి రాని వనరులను వాడకంలోకి తీసుకురావడం, మరింతగా జనజీవితాన్ని సౌకర్యవంతం చేసేందుకు ఈ వ్యర్థ వినియోగ పథకం దోహదం చేస్తుంది.