బడ్జెట్ ఆమోదం లేని వ్యయంలో చంద్రబాబుతో జగన్ పోటీ!

నేడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక లావాదేవీల నిర్వహణ తీవ్ర సంక్షోభంలో చిక్కు కొంటున్నాయి. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా, ఇష్టం వచ్చినట్లు అప్పులు తేవడం,  వాటిని ఒక పద్ధతి లేకుండా ఖర్చు పెట్టడం ద్వారా ఆర్థిక నిర్వహణను  గాడి తప్పించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ముందున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పోటీ పడుతున్నట్టు కనిపిస్తున్నది. 
 
బడ్జెట్ ఆమోదం లేకుండానే లక్షల కోట్ల రూపాయాలు ఖర్చు చేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది.  2020-21 ఆర్థిక సంవత్సరంలో జరిగిన లావాదేవీలకు సంబంధించి  శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్  నివేదికను చూస్తే ఇదే అనుమానం కలుగుతుంది.  రాజ్యాంగం ప్రకారం శాసనసభ ఆమోదం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి వీలులేదు. అందుకే నూతన ఆర్థిక సంవత్సరం మొదటిరోజుకల్లా ఏదో రకంగా బడ్జెట్‌ను సభలో ప్రభుత్వాలు ఆమోదింపచేసుకుంటాయి.

అయితే, శాసనసభలో ఆమోదం పొందడాన్ని లాంఛనంగా మాత్రమే ప్రభుత్వాలు చూస్తున్నాయి. శాసనసభ ఆమోదం లేకుండానే లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తునాుయి. 2020ా-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఇలా రూ 1,10,509.12 కోట్లను ఖర్చు చేసినట్లు కాగ్‌ పేర్కొంది. ఐదు గ్రాంట్లు, మూడు అప్రాప్రియేషన్స్‌లో ఈ లావాదేవీలు చోటుచేసుకున్నట్లు తెలిపింది. 

తెలుగుదేశం పార్టీ పాలన సాగిన 2014-15 నుండి 2019-20 మధ్య కాలంలో కూడా ఈ తరహా ఖర్చు భారీగానే చేశారు. రూ 2,36, 811.96 కోట్లను ఆ ఐదేళ్ళలో శాసనసభ ఆమోదం లేకుండా ఖర్చు చేసినట్లు పేర్కొన్న కాగ్‌, ఆ మొత్తానికి ఇప్పటికి కూడా శాసనసభ ఆమోదం తెలపలేదని పేర్కొంది. 

‘రాజ్యాంగంలోని 204, 205 అధికరణాల ప్రకారం శాసనసభ ఆమోదం పొందిన చట్టం లేకుండా కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదు. రాష్ట్రంలో ఆ అధికరణాల ఉల్లంఘన జరుగుతోంది. ఇది ఆర్థిక నియంత్రణ, బడ్జెటరీ విధానాలను నీరు గారుస్తుంది. ఆర్థిక అరాచకత్వానికి, ప్రజా వనరులను సక్రమంగా నిర్వహించకపోవడానికి దారి తీస్తుంది.’ అని కాగ్‌ స్పష్టం చేసింది. 

కాగ్‌ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టడానికి ఒక్క రోజు ముందు 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ 17వేల కోట్ల  అదనపు వ్యయానికి రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ అనుమతి తీసుకోవడం ఈ సందర్భంగా గమనార్హం.

ప్రత్యేక బిల్లులపైన కూడా  కాగ్‌ తీవ్రంగానే స్పందించింది. రూ 48,284 కోట్ల బిల్లులను స్పెషల్‌ బిల్లులుగా చూపించడాన్ని ఆక్షేపించింది. సర్దుబాటు బిల్లులు కూడా రూ 54,092 కోట్లుగా చూపించారని, ఇలా మార్పు చేసే అధికారం ట్రెజరీ నిబంధనలకు విరుద్ధమని కాగ్‌ పేర్కొంది. 

మరో రూ  26,839 కోట్ల  బిల్లులను ప్రభుత్వ ఆదేశాల మేరకే పద్దుల్లో చూపించినట్లు ప్రభుత్వం పేర్కొందని, అయితే ఉత్తర్వుల్లో మాత్రం సరైన కారణాలు కనిపించలేదని పేర్కొంది. ఇలా పనులు, స్థానిక సంస్థల పద్దులను మార్పు చేయడం కూడా ట్రెజరీ నిబంధనలకు వ్యతిరేకమని కాగ్‌ తెలిపింది. మరో 16,688 ఎంట్రీలకు సంబంధించి రూ 9127 కోట్ల నిధుల వినియోగంపైనా కాగ్‌ పెదవి విరిచింది.

 ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌ఫర్‌ విఫలం కావడం వల్ల ఈ సమస్య తలెత్తిందని ఆర్ధికశాఖ చెప్పడాన్ని కూడా సరికాదన్న భావాన్ని కాగ్‌ వ్యక్తం చేసింది.మరో రూ  8891 కోట్లను నిర్దిష్టమైన విడుదల ఆదేశాలు లేకుండానే ఖర్చు చేశారని పేర్కొంది. బడ్జెట్‌ ప్రతిపాదనలకు విరుద్ధంగా రూ 48,757 కోట్లను అదనంగా వ్యయం చేశారని, ఇది మొత్తం గ్రాంట్లలో 19 శాతంగా ఉందని కాగ్‌ గుర్తించింది.

కాగా, పరిమితికి మించి వేస్‌ అండ్‌ మీన్స్‌ను వినియోగించినట్లు కూడా కాగ్‌ పేర్కొంది. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా 331 రోజులపాటు  రూ 1.04 లక్షల కోట్లను ఈ సౌకర్యం కింద వాడుకున్నట్లు గుర్తించింది. ఇందులో 184 రోజులు సాధారణ వేస్‌ అండ్‌ మీన్స్‌గా ఉండగా, మరో 44 రోజులు ప్రత్యేక డ్రాయింగ్‌ ఫెసిలిటీని ఉపయోగించుకుందని, 103 రోజులపాటు ఓవర్‌డ్రాఫ్ట్‌లో ఉందనికాగ్‌ వివరించింది. 
 
కనీస ఖజానా నిల్వ రూ. 1.94 కోట్లుకన్నా తక్కువగా ఉన్న సమయంలో ఈ ఓవర్‌డ్రాఫ్ట్‌కు వెళ్లినట్లు పేర్కొంది. ఇది రూ. 31,812 కోట్లుగా ఉన్నట్లు వివరించింది. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చే గ్యారంటీలు కూడా భారీగా ఉన్నట్లు పేర్కొంది. 2019-20లో రూ 67 వేల కోట్లు గ్యారంటీలుగా ఉండగా, 2020-21లో రూ 91,330 కోట్లకు చేరినట్లు వివరించింది. రుణాలు కూడా జిఎస్‌డిపిలో 35 శాతానికి చేరుకున్నట్లు పేర్కొరది. మొత్తం రుణాలు రూ 3. 50 లక్షల కోట్లుగా ఉన్నట్లు గుర్తించింది.