బలగాలు పూర్తిగా వైదొలగితేనే సరిహద్దుల్లో శాంతి

సరిహద్దుల్లో పరిస్థితి మామూలు స్థితికి రావాలంటే తూర్పు లడఖ్ ప్రాంతంలో మిగిలి ఉన్న వివాదాస్పద ప్రాంతాలనుంచి కూడా బలగాల ఉపసంహరణ వేగంగా పూర్తి కావలసిన అవసరం ఉందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో జైశంకర్ శుక్రవారం దాదాపు మూడు గంటల సేపు జరిపిన భేటీ జరిపారు. 
దాదాపు రెండేళ్ళ క్రితం తూర్పు లడఖ్‌లో ఇరు దేశాల సైన్యాలు బాహాబాహీకి దిగిన తర్వాత ఉన్నత స్థాయి దౌత్య చర్చలు జరగడం ఇదే తొలిసారి.  అనంతరం, జైశంకర్  మీడియాతో మాట్లాడుతూ భారత్, చైనాల మధ్య ప్రస్తుతం సంబంధాలు సాధారణ స్థితిలో లేవని స్పష్టం చేశారు.
సరిహద్దుల్లో ఎంత మేర భద్రతా దళాలు ఉండాలనే దానిపై 1993-96 మధ్య కాలంలో ఇరు దేశాల మధ్య కొన్ని ఒప్పందాలు జరిగాయని, ఆ ఒప్పందాలకు విరుద్ధంగా ఇప్పుడు సరిహద్దుల్లో భద్రతా దళాలు ఉన్నాయని ఆయన  అభ్యంతరం వ్యక్తం చేశారు.
 సైన్యాన్ని ఉపసంహరిస్తేనే ఇరు దేశాల సరిహద్దుల్లో సాధారణ పరిస్థితి నెలకొంటుందని ఆయన స్పష్టం చేశారు. 2020 ఏప్రిల్ తర్వాత చైనా చర్యల వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాల్లో చాలా ఇబ్బందులు తలెత్తాయని ఆయన తెలిపారు.
తూర్పు లడఖ్ వివాదంపై ఇప్పటివరకు ఇరు దేశాల సైనికాధికారుల మధ్య 15 దఫాలు చర్చలు జరిగాయని, ఈ చర్చల్లో కొంత మేరకు పురోగతి సాధించామని పేర్కొన్నారు.  అయితే ఇది ఆశించిన స్థాయికన్నా నిదానంగా ఉందని జైశంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
 
తూర్పు లడఖ్‌తో పాటు ఉక్రెయిన్‌కు సంబంధించిన అంశాలు కూడా తమ మధ్య చర్చకు వచ్చాయని జైశంకర్ చెప్పారు. ఎలాంటి అరమరికలు లేకుండా అత్యంత నిజాయితీగా తమ మధ్య చర్చలు జరిగాయని తెలిపారు.  భారత్‌తో సంబంధాల విషయంలో చైనా స్వతంత్రంగా వ్యవహరిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశామని తెలిపారు. 
 
 నిర్ణయాధికారంలో ఇతర దేశాల జోక్యం ఉండకూడదన్న విశ్వాసాన్ని తాము వ్యక్తం చేస్తున్న విషయాన్ని కూడా చైనా విదేశాంగ మంత్రితో చెప్పామని జైశంకర్ తెలిపారు.వాస్తవాధీన రేఖ వద్ద సైనిక దళాల ఉపసంహరణ పూర్తి కావడం అవసరమని చెప్పారు. ఈ ప్రక్రియను మరింత ముందుకు చురుగ్గా తీసుకెళ్ళవలసి ఉందన్నారు. భారీగా సైన్యాన్ని మోహరించినంత వరకు సరిహద్దు పరిస్థితి సాధారణ స్థితికి రాబోదని పేర్కొన్నారు. 
 
ఇప్పటికీ ఘర్షణ ప్రాంతాలు ఉన్నాయని చెబుతూ పాంగాంగ్ సో సహా కొన్ని ఘర్షణ ప్రాంతాల్లో సమస్యను పరిష్కరించుకోవడంలో పురోగతి సాధించినట్లు తెలిపారు. దీనిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనేదానిపై నేడు చర్చించామని చెప్పారు. కాగా,  క్వాడ్ (భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్) దేశాల సమావేశం గురించి వాంగ్ యీతో చర్చించలేదని తెలిపారు.
ఆఫ్ఘనిస్థాన్, ఉక్రెయిన్ సహా ముఖ్యమైన అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ఈ సమావేశం దోహదపడిందని చెప్పారు.  ఆఫ్ఘనిస్థాన్ విషయంలో భారత దేశ వైఖరి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం 2593కు అనుగుణంగా ఉంటుందని చెప్పారు. ఉక్రెయిన్ విషయంలో తమ దృక్పథాన్ని, వైఖరిని తెలియజేశామని, అయితే దౌత్యం, చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఇరువురం అంగీకరించామని చెప్పారు.
చైనాలో చదువుతున్న విద్యార్థులు అనుభవిస్తున్న ఇబ్బందుల గురించి వాంగ్ యీతో చర్చించినట్లు జైశంకర్ తెలిపారు. కరోనా  ఆంక్షల సాకుతో మన దేశ విద్యార్థులను తిరిగి చైనాకు రానివ్వడం లేదని,  అనేకమంది భవిష్యత్తుకు సంబంధించిన అంశమైనందువల్ల ఎటువంటి వివక్ష లేకుండా చైనా తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.