పార్లమెంటులో ఏడ్చేసిన రూపా గంగూలీ

బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలో ఎనిమిది మంది సజీవదహనమైన ఘటనపై బిజెపి పార్లమెంటు సభ్యురాలు, మాజీ టివి నటి రూపా గంగూలీ రాజ్యసభలో విరుచుకుపడ్డారు. బెంగాల్‌లో జీవించే స్థితి లేదని, అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.
 
 ఆ రాష్ట్రంలో సామూహిక హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ కేసు దర్యాప్తును కేంద్ర ఏజెన్సీకి అప్పగించొద్దని మమతా బెనర్జీ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను తిరస్కరించిన కలకత్తా హైకోర్టు శుక్రవారం కేంద్ర దర్యాప్తు సంస్థకు బదిలీ చేసింది.
ఎనిమిది మంది వ్యక్తులు మొత్తం మహిళలు, పిల్లలు. వారిని ఓ గుంపు కొట్టి సజీవ దహనం చేసింది. 
 
పార్లమెంటు వద్ద రాజ్యసభ వెలుపల విలేకరులతో రూపా గంగూలీ విలేకరులతో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం నేరస్తులను కాపాడుతోందని ఆరోపించారు.
 
 ‘పశ్చిమ బెంగాల్‌లో ప్రజలు మాట్లాడలేరు. హంతకులకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తోంది. ఎన్నికల్లో గెలిచి ప్రజలను చంపే ప్రభుత్వం ఏ రాష్ట్రంలోనూ లేదు…మేము మనుషులం. కరడుగట్టిన రాజకీయాలు మేము చేయలేం’ అని ఆమె రాజ్యసభలో ఆమె ఏడ్చేశారు.
 కాగా, బీర్‌భూమ్‌ సజీవ దహనాలపై విచారణ బాధ్యతను కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ స్వీకరించింది. 8 మంది మరణంపై పలు కేసులు నమోదు చేసింది. సీబీఐకి చెందిన సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ నిపుణుల బృందం సంఘటనా స్థలంలో పలు ఆధారాలు సేకరించింది. అంతకుముందు కలకత్తా హైకోర్టు ఈ కేసుపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ప్రగతి నివేదికను వచ్చేవారం సమర్పించాలని సీబీఐకి స్పష్టం చేసింది.