దేశంలో ప్రధమ స్థానంలో సంసద్ ఆదర్శ గ్రామం వెన్నంపల్లి

కరీనంగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామం సంసద్ ఆదర్శ గ్రామ యోజన (ఎస్.ఎ.జి.వై) లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. పట్టణాలకు ధీటుగా పల్లెలను అభివృద్ది చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సంసద్ ఆదర్శ యోజన పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తుంది. 
 
ఈ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న వేలాది గ్రామాలతో అభివృద్దిలో పోటిపడి వెన్నంపల్లి గ్రామం జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి కరీంనగర్ జిల్లా కీర్తి పథకాన్ని నలుదిశల చాటింది. దేశ వ్యాప్తంగా లోకాసభ, రాజ్యసభ సభ్యులు 2598 గ్రామాలను దత్తత తీసుకోని అన్ని విధాల అభివృద్ది చేయాలని నిర్ణయించుకున్నారు. 
 
పార్లమెంట్ సభ్యులు (ఎం.పి.) అర్థిక సహాయంతో గ్రామాల్లో వివిధ ప్రగతి అంశాలు సూచికగా సంపూర్ణ ప్రగతి సాధించుటకు ప్రోత్సహకాలు అందించారు. దేశవ్యాప్తంగా సంసద్ ఆదర్శ యోజన పథకం క్రింద 248 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా ఎంపిక చేశారు. ఇందులో తొలి పదకొండు గ్రామాలు తెలంగాణ రాష్ట్రానికి చెందినవే, అందులో 3 గ్రామాలు కరీంనగర్ జిల్లాలోనివి కావడం విశేషం.
 
రాజ్యసభ సభ్యులు కెప్టన్ వి. లక్ష్మీకాంత రావు 2014-15 సంవత్సరంలో వెన్నంపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. రూ. 1.50 కోట్లు ఎంపి నిధులు మంజూరు చేశారు. గ్రామంలోని అన్ని కాలనీలలో సిసి రోడ్లు నిర్మించారు. నూతన గ్రామ పంచాయతి భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 20 లక్షలు మంజూరు చేయగా నిర్మాణ పనులు పూర్తికావచ్చాయి. 
 
తమ వెన్నంపల్లి గ్రామం సంసద్ అదర్శ్ గ్రామయోజన పథకం క్రింద దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచినందుకు తమకు ఎంతో గర్వంగా ఉందని గ్రామ సర్పంచ్ అబ్బిడి పద్మ ఆనందం వ్యక్తం చేశారు. వెన్నంపల్లి గ్రామంలో 534 ఇండ్లు, 2167 జనాభా ఉన్నారు. 
 
గ్రామంలో రూ. 4లక్షలతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. రూ. 34.60 లక్షలతో రైతువేదిక, వైకుంఠధామం నిర్మాణాలను పూర్తిచేశారు. గ్రామంలో నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరాకు రూ.1కోటి రూపాయలతో సబ్ స్టేషన్ ప్రభుత్వం మంజూరు చేయగా, భవన నిర్మాణ స్థలానికి గ్రామస్థులు రూ. 6.60 లక్షలు విరాళాలు సేకరించి భూమి కొనుగోలు చేసి సబ్ స్టేషన్ నిర్మించుకున్నారు. 
 
గ్రామంలో రూ. 20 లక్షలతో మహిళా సంఘ భవనాన్ని నిర్మించుకున్నారు. రూ.16 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య భవనం, మిషన్ కాకతీయ పథకం కింద రూ. 2.90 కోట్ల రూపాయలతో కుంటలు, చెరువులు పునఃనిర్మించుకున్నారు. మిషన్ భగీరథ పథకం కింద 2.20 లక్షల కిలో లీటర్ల సామర్థ్యం కలిగిన 3 వాటర్ ట్యాంకుల నిర్మాణం చేశారు. 
 
ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నల్లా ద్వారా త్రాగు నీటిని అందించుటకు రూ. 6.7 కోట్లతో పైపులైన్ నిర్మించారు. గ్రామంలో ప్రతిరోజు ప్రతి ఇంటికి మిషన్ భగీరథ పథకం ద్వారా త్రాగు నీరు సరఫరా చేస్తున్నారు. గ్రామంలో రూ. 25 లక్షలతో సిసిరోడ్లు, రూ. 12 లక్షలతో మురుగు కాలువల నిర్మాణాలు పూర్తి చేశారు. 
 
గ్రామంలో ఉపాధి కల్పన పథకం ద్వారా మహిళా సంఘాల కుటుంబ సభ్యులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించుటకు 60 మందికి కుట్టు మిషన్ల శిక్షణ ఇప్పించనైనది, గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, ప్రాథమిక పశువైద్య కేంద్రం భవనాలు నిర్మించుకున్నారు.
గ్రామంలో పెట్రోల్ బంక్ ను కూడా నిర్వహిస్తున్నారు. గ్రామంలో రూ. 65వేలతో తడి పొడి చెత్త బుట్టలను కొనుగోలు చేసి ప్రతి ఇంటికి పంపిణి చేశారు. ప్రజలకు తడి పొడి చెత్తపై అవగాహన కల్పించి ప్రతి రోజు తడి పొడి చెత్తను సేకరించి ట్రాక్టర్ ద్వారా సెగ్రిగేషన్ షెడ్ కు తరలిస్తున్నారు. ఇలా సేకరించిన తడి పొడి చెత్తను వేరుచేసి కంపోస్టు ఎరువు తయారు చేసుకుంటున్నారు. పారిశుద్ధ్య చర్యలలో భాగంగా గ్రామంలోని దాదాపు 6కి.మి.రోడ్లు, 5 కి.మి. మురికి కాలువలను ప్రతిరోజు శుభ్రం చేస్తున్నారు.