కేసీఆర్ రైతు ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చారు 

కేసీఆర్ ప్రభుత్వం రైతులకు చేసింది ఏమీ లేదని, తెలంగాణను రైతు ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చిందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ధ్వజమెత్తారు.  
 
తెలంగాణ ఏర్పడిన 7 ఏళ్లలో  7,409 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక తెలిపిందని విజయశాంతి గుర్తు చేశారు. నలుగురికీ అన్నం పెట్టే రైతులు ఆత్మహత్యలకు పాల్ప‌డుతూ… వారి కుటుంబాలు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లుతుంటే ప్ర‌భుత్వం చోద్యం చూస్తోందని ఆమె మండిపడ్డారు.
 
తెలంగాణ రాష్ట్రం వ‌స్తే  రైతు సమస్యలు సమసిపోతాయని నాడు రైతులు కూడా ఉద్యమాలలో పాల్గొన్నారని ఆమె గుర్తు చేశారు. కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే వెయ్యి మందికి పైగా రైతులు చనిపోవడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 
 
కేసీఆర్ ప్ర‌భుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్ర‌వేశ‌పెట్టిన రైతు బంధు పెద్ద‌ల జేబులోకి వెళ్లుతుంటే… చిన్న, సన్నకారు రైతుల రైతు బంధు డ‌బ్బును మాత్రం బ్యాంకర్లు రాబందుల్లా మారి వడ్డీ కింద జమ చేసుకుంటూ రైతన్న‌లకు పైసా కూడా ఇవ్వడం లేదని ఆమె విమర్శించారు. 2018 ఎన్నికల సమయంలో లక్ష వరకు రుణ మాఫీ చేస్తామని ప్రకటించినా నేటికీ అది సాధ్యం కాలేదని ఆమె గుర్తు చేశారు. 
 
వానా కాలంలో ఇవ్వాల్సిన క్రాప్ లోన్‌‌‌‌లు ఇవ్వకుండా రైత‌న్న‌ల ఉసురు తీస్తుండ్రు అంటూ ఆమె దుయ్యబట్టారు. కేవలం రూ.30 వేల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం…. రుణమాఫీ చేసేశామని అబద్ధాలు ప్రచారం చేసుకుంటోందని ఆమె ఆరోపించారు. 
 
వ్యవసాయంలో ఏటా పెట్టుబడులు పెరుగుతున్నప్పటికీ… ఆ మేరకు దిగుబడి రాక రైతన్న‌లు క్రమంగా అప్పుల ఊబిలోకి నెట్టి వేయబడుతున్నా… తాను రైతునని చెప్పుకునే కేసీఆర్ ఏం చేసిండు? అని విజయశాంతి ప్రశ్నించారు. 
 
 రైతులు ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తేవడం… చివరకు దిగుబడి తక్కువ రావడంతో అప్పులు పెరిగిపోవడం… దీనికి తోడు పిల్లల చదువులు, పెళ్లిళ్లు, పండుగల వల్ల‌ ఇంకా అప్పులు పెరిగి ఎక్కువై… తీర్చే మార్గం కనిపించడం లేదని ఆమె పేర్కొన్నారు. దాంతో తీవ్రమైన మనోవేదనకు గురై… అనారోగ్యం పాలై చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆమె చెప్పారు. 
 
ఇంత జరుగుతున్నా దొర‌వారి స‌ర్కారుకు చీమ కుట్టినట్ట‌యినా లేదని ఆమె ఎద్దేవా చేశారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సాక్షాత్తు మన సీఎం ప్రెస్ మీట్‌‌‌‌లోనే… యాసంగిలో రైతులెవరూ వరి పంట సాగు చేయొద్ద‌ని ప్రకటించి, రైతులు మరింత మానసిక వేదనకు గురయ్యేలా చేస్తుండు అంటూ ఆమె ధ్వజమెత్తారు. 
 
ధైర్యం ఇవ్వాల‌సిన ముఖ్య‌మంత్రి రైతులు కుంగిపోయేలా చేసి… ఆ తప్పులు కేంద్రం మీద వేసి రాజ‌కీయ ప‌బ్భం గ‌డుపుకుంటుండు అంటూ ఆమె మండిపడ్డారు. నీ ఆటలు రైతుల‌ ద‌గ్గ‌ర సాగ‌వు కేసీఆర్…. యావత్ తెలంగాణ రైతాంగం నీకు బుద్ధి చెప్ప‌డం ఖాయం  అని విజయశాంతి స్పష్టం చేశారు.