రేవంత్ సంస్కారం వెల్లడిస్తున్న ఆయన భాష

ప్రధాని మోదీతో పాటు బిజెపి నేతలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ మంత్రి హరీష్ రావులు విమర్శలు గుప్పించిన తీరు పట్ల దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ నేత  రఘునందన్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి  మాట్లాడే భాష ఆయన సంస్కారాన్ని తెలియజేస్తుందని  విమర్శించారు.
బండిగాడు, గుండు గాడు అంటున్న రేవంత్.. ఒకసారి తిరిగి ఆలోచించుకుంటే బాగుంటుందని ఆయన హితవు చెప్పారు. మేం కూడా మీలాగా మాట్లాడొచ్చు కానీ, మాకు సంస్కారం అడ్డొస్తోందని ధ్వజమెత్తారు. మోదీని గతంలో విమర్శించిన అహ్మద్ పటేల్, మణిశంకర్ అయ్యర్ వంటి వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసుకో అంటూఎద్దేవా చేశారు.
అందుకే మాట్లాడేటప్పుడు యతిప్రాసల కోసమో, పేపర్లు టీవీలలో బ్రేకింగ్ ల కోసమో, బూతులు మాట్లాడటమే సంస్కారం అనుకుంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు. బీజేపీ సంస్కారం అదికాదని స్పష్టం చేశారు. ఒక ఓటు.. రెండు రాష్ట్రాలు తీర్మానం చేసినపుడు మీరు ఇంకా రాజకీయాలలోకి రాలేదని గుర్తు చేశారు.
మిమ్మల్ని రాజకీయాలలోకి తీసుకొచ్చిన చంద్రబాబే తెలంగాణకు అడ్డుపడ్డారని అప్పడు ఎల్‎కే అద్వానీ చెప్పారని గుర్తు చేశారు. బీజేపీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఒక కలగా మిగిలిపోయేదని స్పష్టం చేశారు. తెలంగాణ వాదుల మీదికి తుపాకి ఎక్కుపెట్టిన మీరా బీజేపీని విమర్శించేది? అని ప్రశ్నించారు.
“మోదీ ప్రధాని ఎలా అయ్యారని నువ్వు అంటున్నావే.. నీకు తెలియదా? ఎవరో వడ్డించిన విస్తరి ముందుకు ఆయన రాలేదు. గుజరాత్ వద్దంటున్న మీరు.. గుజరాత్ పీసీసీ ఆఫీసుకు తాళం వేస్తారా? గుజరాత్ వాళ్ళను విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతల్లారా.. సర్దార్ వల్లభాయ్ పటేల్, అహ్మద్ పటేల్ ఎక్కడి నుంచి వచ్చారో చెప్పాలి” అంటూ రఘునందనరావు విమర్శించారు.
మోదీకి  అల్పాబెట్స్ రావంటున్న రేవంత్ రెడ్డి.. నువ్వు ఎక్కడ చదివావో చెప్పు? అని ప్రశ్నించారు.  భారత రాజ్యాంగం మీద రేవంత్ రెడ్డికి కనీస అవగాహన లేదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రులను చంపుకునేది, తీసేసేది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ బిల్లు పెట్టిన కాంగ్రెస్ పార్టీ.. తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేసిందని ఆయన ఎద్దేవా చేశారు.
“బీజేపీ తెలంగాణకు వ్యతిరేకం కాదు. మీ పార్టీనే తెలంగాణకు వ్యతిరేకంగా అడ్డుకుంది” అని రఘునందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నాడో హరీష్ రావు చెప్పాలని రఘునందన్ డిమాండ్ చేశారు. ‘మోదీ  తెలంగాణకు వ్యతిరేకమంటున్నావ్ కదా.. మరి నువ్వు దుబ్బాకకు వ్యతిరేకం కాదా?’ అని ప్రశ్నించారు. 1200 మంది చావులకు కారణమైన తెరాస నరేంద్ర మోదీని విమర్శిస్తోందని దుయ్యబట్టారు.
దుబ్బాక, హుజురాబాద్‎లో సిలిండర్లు మోసినా ప్రజలు తిప్పికొట్టింది మర్చిపోయావా? సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్, దుబ్బాకకు నువ్వు ఎన్ని నిధులు ఇచ్చావ్? రూ 53 కోట్ల ఉపాధిహామీ పథకం నిధులు కేంద్రం నుంచి సిద్ధిపేట జిల్లాకు ఇచ్చారు అంటూ నిలదీశారు.  మోదీకి తెలంగాణ మీద ప్రేమ లేదంటున్న హరీష్ రావు.. దుబ్బాక మీద నీకు ప్రేమ ఉందా? దుబ్బాక మీద ప్రేమ ఉంటే శిలాఫలకాలపై ఎమ్మెల్యే పేరు ఎందుకు లేదు? అని ప్రశ్నించారు.
మీ తిట్లే ఆశీర్వచనాలుగా, మీ శాపనార్థాలే దీవెనలుగా.. ఒక సీటు నుంచి నాలుగు సీట్లు గెలిచినం.. నాలుగు సీట్ల నుంచి డబుల్ డిజిట్ సీట్లు గెలుస్తాం.. తెలంగాణలో కూడా బీజేపీని అధికారంలోకి తీసుకువస్తాం’ అని రఘునందన్ స్పష్టం చేశారు.