సమైక్య, సుస్థిర, సువిశాల ఇరుగు, పొరుగు పట్ల భారత దేశ దార్శనికతకు కేంద్ర బిందువు మధ్య ఆసియా అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తొలి భారత్ – మధ్య ఆసియా సమ్మిట్లో గురువారం ఆయన వర్చువల్ విధానంలో మాట్లాడారు. మధ్యఆసియా దేశాలు, భారత్ మధ్య సహకారం ప్రాంతీయ భద్రతకు ఎంతో కీలకమని చెబుతూ ముఖ్యంగా అఫ్గాన్లో పరిణామాల దృష్ట్యా ఈ ప్రాంతానికి భారత్కు మధ్య బంధం మరింత బలపడాలని ప్రధాని కోరారు.
ఈ సదస్సుకు మూడు లక్ష్యాలు ఉన్నాయని తెలిపారు. ఐదు దేశాల అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సదస్సుకుగల మూడు లక్ష్యాలను మోదీ వివరిస్తూ, మొదటిది, ప్రాంతీయ భద్రత, సౌభాగ్యాల కోసం భారత దేశం, మధ్య ఆసియా మధ్య పరస్పర సహకారం అవసరమని స్పష్టం చేశారు.
రెండోది, ఈ పరస్పర సహకారానికి సమగ్ర నిర్మాణాన్ని కల్పించడమని, సంబంధితులందరి మధ్య ప్రతి నిత్యం సంభాషణలు జరగడానికి ఓ వేదిక ఏర్పాటుకు ఈ నిర్మాణం దోహదపడుతుందని తెలిపారు.
మూడోది, ఈ పరస్పర సహకారం కోసం ఓ గొప్ప మార్గసూచిని రూపొందించడమని చెప్పారు. ప్రాంతీయ అనుసంధానం, సహకారం కోసం ఓ సమైక్య వైఖరిని స్వీకరించేందుకు ఈ మార్గసూచి దోహదపడుతుందని చెప్పారు.
ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితులపై మనమంతా ఆందోళన చెందుతున్నామన్నారు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ సుస్థిరత, భద్రతలకు భారత్-సెంట్రల్ ఆసియా మధ్య సహకారం మరింత ముఖ్యమైనదవుతుందని ప్రధాని పేర్కొన్నారు.
సుస్థిరమైన ఇరుగుపొరుగు ఉండాలనే భారత ఆలోచనకు మధ్య ఆసియా ప్రాంతం కీలకమని ఆయన చెప్పారు. వచ్చే 30 ఏళ్లకు కావాల్సిన సమీకృత విధానాన్ని ఇరు పక్షాలు రూపొందించుకోవాలని ఆయన సూచించారు.
అఫ్గాన్ భూభాగాన్ని ఎలాంటి ఉగ్ర కార్యక్రమాలకు అనుమతించకూడదన్న తమ అభిప్రాయాన్ని ప్రధాని మోదీ మరోమారు వెల్లడించారు. ఇరు పక్షాల మధ్య సహకారం పెంపొందించడం, ఇందుకు తగిన విధానాలు రూపొందించడం సదస్సు లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇంధన భద్రతలో కజ్బెకిస్తాన్ ఇండియాకు ముఖ్యమైన భాగస్వామి అని చెప్పారు.
ఉజ్బకిస్తాన్తో గుజరాత్ సహా పలు రాష్ట్రాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉన్నత చదువుల కోసం పలువురు భారతీయులు కిర్గిజ్కు వెళ్తుంటారని చెప్పారు. రక్షణ విషయంలో తజ్బెక్తో మరింత బలమైన బంధం ఏర్పడాలని ఆకాంక్షించారు. ప్రాంతీయ కనెక్టివిటీలో టర్కెమెనిస్తాన్ది కీలకపాత్రని తెలిపారు. సదస్సు ఏర్పాటుపై ఐదుగురు అధ్యక్షులు ప్రధానిని ప్రశంసించారు. 2015లో మోదీ ఈ దేశాల్లో పర్యటించారు.
ఈ వర్చువల్ సమావేశంలో కజకిస్థాన్ ప్రెసిడెంట్ కస్సిమ్-జోమర్ట్ టొకయేవ్, ఉజ్బెకిస్థాన్ ప్రెసిడెంట్ షవకట్ మిర్జియొయెవ్, తజకిస్థాన్ ప్రెసిడెంట్ ఎమొమలి రహమోన్, తుర్క్మెనిస్థాన్ ప్రెసిడెంట్ గుర్బంగులీ బెర్డిముహమెడోవ్, కిర్గిజ్ ప్రెసిడెంట్ సడిర్ జపరోవ్ పాల్గొన్నారు.
దేశాధినేతలు పాల్గొన్న తొలి భారత్-సెంట్రల్ ఆసియా సమావేశం ఇదేనని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. మధ్య ఆసియా దేశాలతో సత్సంబంధాలు పెరుగుతుండటానికి ఇది నిదర్శనమని పేర్కొంది.
More Stories
ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడి రాజీనామా
ఇండియా కూటమి గెలిస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు
ఉక్రెయిన్లో నాలుగు పవర్ ప్లాంట్లు ధ్వంసం