యూపీలో మూడో వేవ్ అడుగుపెట్టింది

 
ఉత్తరప్రదేశ్‌లో కోవిడ్ థర్డ్ వేవ్ అడుగుపెట్టిందని, అయితే దీనివల్ల అంతగా ప్రమాదమేమీ లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.  రాష్ట్రంలో 33,900 యాక్టివ్ కేసులున్నాయని, అయితే 90 శాతం మందిలో వ్యాధి లక్షణాలు లేవని, వీరు హోం ఐసొలేషన్‌లో ఉన్నారని చెప్పారు. 
 
కరోనా రోగులతో  ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపేందుకు ప్రతి జిల్లాలో కరోనా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి, మెడికల్ కిట్స్ అందిస్తున్నట్టు తెలిపారు. యూపీలో తాజాగా 7,695 కొత్త కేసులు నమోదు కాగా, నలుగురు మృత్యువాత పడ్డారు. మీరట్, ప్రయాగరాజ్, బులంద్‌షహర్, బుదౌన్‌లో ఒక్కో మరణం చోటుచేసుకుంది.
గత 24 గంటల్లో 2.2 లక్షలకు పైగా శాంపుల్స్ పరీక్షించినట్టు ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గౌతం బుథ్ నగర్, ఘజియాబాద్‌లలో కోవిడ్ యాక్టివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో సుమారు 30.44 శాతం ఇక్కడి నుంచే నమోదయ్యాయి.  ఆదివారం ఒక్కరోజే గౌతం బుధ్ నగర్‌లో 1,100కు పైగా కేసులు నమోదుకాగా, ఘజియాబాద్‌లో 1000 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఢిల్లీలో ఆంక్షలు మరింత కఠినం

ఇప్పటికే ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ, వారాంతర లాక్ డౌన్ అమలు చేస్తున్న ఢిల్లీలో కేసుల సంఖ్య తగ్గడం లేదు. తాజాగా వెయ్యి మందికి పైగా పోలీసులు కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ నేతృత్వంలోని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ పరిస్థితిని సమీక్షించేందుకు భేటీ అయింది. 
 
కరోనా కట్టడికి ఆంక్షలు మరింత కఠినం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా బార్లు, రెస్టారెంట్లను మూసివేయాలని, కేవలం టేక్ అవేకు మాత్రమే పర్మిషన్ ఉంటుందని ప్రకటించింది. బస్సలు, మెట్రో రైళ్లను 100శాతం సీటింగ్ కెపాసిటీతో నడపేందుకు సిద్ధమైంది. 
 
కరోనా విజృంభిస్తున్నందున ప్రైవేటు సంస్థలన్నింటినీ 100శాతం వర్క్ ఫ్రం హోంకు పరిమితం చేయాలని డీడీఎంఏ భావిస్తోంది. మరోవైపు కేసుల తీవ్రత దృష్ట్యా ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ ఉమ్మడి మీడియా సెంటర్ను సైతం మూసివేయాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం.